11, డిసెంబర్ 2017, సోమవారం

సత్సంగంలో సమస్యాపూరణం

  
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”
(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నల్లుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ యాభయ్ అరవై ఏళ్ళు వెనక్కి పోవాలి.


(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)

నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు గుర్తులేదు, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మినహా.
నిన్న మా మేనల్లుడు రామచంద్రం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గుర్తున్న ఆ ఒకటి  రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం...... చతుర్విధం...) గురించి అడిగాను. అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవని చెప్పి టీకాతాత్పర్యాలు వివరించాడు.

అరవైఏళ్ళుగా నా మనసును తొలుస్తున్న సమస్యకు పరిష్కారం దొరికింది.                     

కామెంట్‌లు లేవు: