24, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) పదో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


యాత్రలో మా వెంట వచ్చిన గైడ్ పేరు చవాన్. కేదార్ గురించి, బదరీ గురించి అతనే మాకో విషయం చెప్పాడు. “కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా  వుంటాయి. అవి ఎల్లవేళలా ఆక్సిజన్ విడిచిపెడుతూ వుంటాయి కనుక అంత ఎత్తున వున్నా  ఆయాసం అనిపించదు. బడరీలో చెట్లు వుండవు. ఎత్తుకు పోయిన కొద్దీ గాలిలో ఒత్తిడి తగ్గి, ఆక్సిజన్ సరిగా అందదు అంచేత నడిచేటప్పుడు మాట్లాడ కూడదు. మాట్లాడితే ఆయాసం వస్తుంది. ఎటు తిరిగినా నెమ్మదిగా నడవాలి. మౌనంగా వుండాలి”.
అతను చెప్పినట్టు గదిలో వున్నప్పుడు బాగానే వుండేది. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఊపిరి పీల్చడం కష్టంగా వుండేది. నాకీ కాదు, అక్కడ ఎవ్వరికయినా అంతే.  మనిషి  ముందూ వెనకా ఆలోచించకుండా, ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది.
నాకు మాత్రం హైదరాబాదులో డాక్టర్ నాగభూషణం గారు ఇచ్చిన మాత్రలు బాగా అక్కరకు వచ్చాయి. అందువల్ల ఎలాటి ఆయాసం లేకుండా నేను యాత్ర చేయగలిగాను. ఆయన్ని తలచుకోని రోజు లేదు.
బస్సు అలాగే పర్వతాలను ఒక్కొక్కటే దాటుకుంటూ జోషీ కుండ్ చేరింది. ఇక్కడ నరసింహాలయం వుంది. గుడి గుహలో వుంది. సాధారణంగా నరసింహ స్వామి కోవెలలు కొండలు, గుహల్లోనే వుంటాయి. గుడి బయట నరనారాయణులు, శివపార్వతులు, గరిత్మంతుడు, నవ దుర్గ ఆలయాలు వున్నాయి. మా పెద్ద తమ్ముడు పర్వతాలరావు ఆరోజుల్లో నరసింహ తత్వం మీద పుస్తకాలూ రాస్తుండేవాడు. విషయ సేకరణ ఎక్కడెక్కడో నరసింహ స్వామి క్షేత్రాలు తిరుగుతూ ఉండేవాడు. భార్గవగారు మా తమ్ముడికి పరిచయం. ఆయన శ్రీధర్ గురూజీ శిష్యులు. కను చూపు లేకపోయినా మేము చేస్తున్న ఈ యాత్రలన్నీ భార్గవ గారు అప్పటికే పూర్తిచేసారు. అది మామూలు విషయం కాదు. ఆయనలో ఉన్న భక్తికీ, దీక్షకూ, మనోనిబ్బరానికి తార్కాణం. మా పెనుగంచిప్రోలు నరసింహస్వామి దేవాలయంలో అచ్యుతా చార్యులు గారని పూజారి వుండేవారు. ఆయనకూ కంటి చూపులేదు. కానీ అంతర్నేత్రాలు ఉండేవని చెప్పుకునేవారు. బహుశా భార్గవగారికి కూడా అలంటి నేత్రాలను భగవంతుడు అనుగ్రహించాడేమో తెలవదు.
శంకరాచార్యుల వారు కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులను బదరి దేవాలయంలో అర్చకులుగా నియమించారుట. అప్పటి నుండి దక్షిణాదివారే అక్కడ పూజారులు. ఈవిధంగా ఆసేతు హిమాచలం ( దక్షిణాన సేతువు నుండి ఉత్తరాన హిమాలయాల వరకు) అని భారతదేశం గురించి చెప్పుకునే వర్ణన అతికి నట్టు సరిపోతుంది అనిపించింది.   
బదరిలో వుండే అర్చకులు సంవత్సరానికి ఆరు మాసాలే అక్కడ వుంటారు. మంచు పడడం ఎక్కువకాగానే వాళ్ళు ఉత్సవ విగ్రహాలతో సహా దిగి వచ్చి కింద జోషీ కుండ్  లో మిగిలిన ఆరు నెలలు వుంటారు. ఆ కాలంలో అక్కడి ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. కేదార్ లో కూడా ఆరునెలలే మనుషుల పూజ. తరువాత గుడి మూసివేస్తారు. ఆ ఆరు  నెలలు శివుడికి  దేవతలు పూజ చేస్తారని చెబుతారు. కేదార్  లో అయితే ఇళ్ళ ఛాయలు కూడా లేవు. భక్తులు వెళ్ళే రోజుల్లో ప్లాస్టిక్ షీట్లతో పందిళ్ళ లాగా వేసుకుని కాలక్షేపం చేస్తారు. కేదార్ కు వెళ్ళే దోవలో దేవ  ప్రయాగ, రుద్ర  ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంది ప్రయాగ మొదలయినవి చూసాము. ప్రయాగ అంటే రెండు నదుల సంగమం. (ఇంకా వుంది)   


కామెంట్‌లు లేవు: