18, ఫిబ్రవరి 2017, శనివారం

కళ్ళల్లో నీళ్లె౦దుకు వున్నాయి? ఇందుకే కాబోలు


చాలా కాలంనాటి ముచ్చట 
ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఓ స్టార్ హోటల్ కి వెళ్లాను. తిరిగొస్తుంటే జంధ్యాల, శంకరాభరణం శంకర శాస్త్రిగా ప్రసి ద్దులయిన సోమయాజులు గారు, ఒక జిల్లా పోలీసు సూపరింటెండె౦ట్, (ఇప్పుడాయన అడిషినల్ డీజీ రాంక్ కాబోలు) ఒక చోట కూర్చుని కాలక్షేపం చేస్తూ కనబడ్డారు.  నన్ను చూసి రమ్మంటే వెళ్లాను. ఆ కబుర్లలో కాలం తెలియలేదు. బాగా పొద్దుపోయింది. ఇక సర్వ్ చేసే టైం అయిపోయిందన్నాడు సర్వేశ్వరుడు. ‘మరి ఎలా’ అన్నాడు జంధ్యాల. ‘ఇలా’ అన్నాను నేను. పొలోమంటూ అందరం అర్ధరాత్రి దాటిన తర్వాత మా ఇంటికి చేరాము. చేరి మేము మా పని పూర్తి చేస్తుంటే మా ఆవిడ తన పని పూర్తిచేసి అందరికీ వేడి వేడిగా వడ్డించింది. పెద్దాయన సోమయాజులుగారు భోజనం అయిన తరువాత చేతులు కడుక్కుని  ‘అన్నదాతా సుఖీభవ’ అని మా ఆవిడను మనసారా  దీవించారు.
సుఖపడ్డది ఏమో కానీ ఇన్నేళ్ళ జీవితంలో ఇలాంటి దీవెనలు పుష్కలంగానే దొరికాయి మా ఆవిడకు.
మొన్నొక రోజు ఒక సాయంకాలక్షేప సమావేశంలో ఒకాయన కలిసారు. అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో వున్నారు. ‘నేను మీకు  తెలవదు కానీ, ఆంటీ తెలుసు, అర్ధరాత్రివేళ మీ మేనల్లుడు వెంకన్నతో  కలిసి మీ ఇంటికి వచ్చేవాడిని. ఎక్కడ దొరక్కపోయినా మా అత్తయ్య ఇంట్లో భోజనం ఖచ్చితంగా వుంటుంది. లేకపోతే నిమిషాల్లో వండి పెడుతుందని వాడు ధీమాగా చెప్పి మీ ఇంటికి తీసుకువచ్చే వాడు. ఆ ఆప్యాయత  ఎలా మరిచిపోగలం చెప్పండి. ఆంటీ ఎలా వున్నారని అడిగారు.

ఏం చెప్పాలో తోచలేదు. కానీ కళ్ళల్లో తడి తెలుస్తూనే వుంది.

1 కామెంట్‌:

Lalitha చెప్పారు...

ఆకలెరిగి అన్నం పెట్టే అమ్మలు - ఆత్మీయతలు నిలిపే పట్టుగొమ్మలు!