21, నవంబర్ 2016, సోమవారం

అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదు


ఈ పన్నెండు రోజుల చర్చల్లో ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ( అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్  అధికార ప్రతినిధిచేత   ప్రకటించి వుంటే బాగుండేది, దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్  కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ  ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి స్వయంగా చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.  కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక  అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా  క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని  మోడీ మరో విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ, అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి  కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన  ప్రధాని ఆ అంశానికే  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే దేశ ప్రజల దృష్టి అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే  రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు  చెప్పేసరికి అసలు  విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న ఉపశమన చర్యలు గురించి ఆ రోజే ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు. ప్రకటన దరిమిలా  మీడియాలో వస్తున్న  వార్తలను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తూ, మార్చుకుంటూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం  చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు.  నిర్ణయాన్ని సమర్ధించిన వారే  అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది  జరిగిపోయింది. నిర్ణయం  వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే  కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు  మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం కానీ వుండదు.

ఇప్పుడు బంతి పూర్తిగా  సర్కారుకోర్టులోనే  వుంది. అది స్పష్టంగా కానవస్తోంది.            

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అల్లా ఐనా ఎల్లా ఐనా ఒల్లు గుల్ల గుల్ల అయిపోయింది అందరికి. జిలేబి పద్యాలు చదివి గిలగిల కొట్టుకుంటూ వలవల ఏడుస్తున్న జనాలు.

శ్యామలీయం చెప్పారు...

ఇప్పుడు బంతి ఎవరి కోర్టులోనూ‌ లేదు. అసలు రెండువేల నోట్లకు బదులుగా కేవలం ఐదువందల రూపాయలనోట్లు ఇబ్బడిముబ్బడిగా అందుబాట్లులోనికి వచ్చే ఏర్పాటు చేసి ఈ పెద్దనోట్లరద్దు నిర్ణయం ప్రకటించవలసింది. కావలసినన్ని ఐదువందలనోట్లు అచ్చు కావటానికి హెచ్చు సమయం కావాలి - రెండువేల రూపాయలనోట్లు ఐతే అందులో నాలుగవవంతు సమయంలోనే అచ్చొత్తవచ్చును. యూపీ ఎన్నికలలో ఈనోట్లరద్దు-నల్లధనం ఆటకట్టు కీర్తితో సులభంగా గెలవచ్చు అన్న తాపత్రయం కారణంగా ఇంగితజ్ఞానం లోపించి పెద్ద పొరపాటు చేసారు. పదినెలల అతిగొప్ప కసరత్తులో ఇంత పెద్దనోటు మాత్రమే వస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులే ప్రథానికి కాని ఆయన సలహాదారులకు కాని తోచలేదంటే అది వారి హ్రస్వదృష్టి అని కాక మరే మనాలి? పూర్తి అధికారం దక్కిన మత్తులో ఇలాంటి పిచ్చితుగ్లక్ నిర్ణయం చేసారు. అదే మత్తులో ఆంధ్రులను ముంచారు అధికారంలోనికి రాగానే - ఆ పాపఫలం అనుభవానికి వస్తుంది తప్పకుండా.

ఈ‌ బీజేపీ - కాంగీలు దొందూ దొందే. ఒకటి పులి మరొకటి సింహం. ఈ రెండింటిలో దేన్ని ఆహ్వానించానినా అది మనని తింటుంది కాని రక్షిస్తుందా? ఓ దేవుడా ఈ దేశానికి దొంగపార్టీల నుండి మోక్షం ఎప్పుడు?

అజ్ఞాత చెప్పారు...

ప్రభుత్వం లో పనిచేసే అధికారులంతా మీలాంటి సరకే శ్యామలీయం గారు. ఒక్కరికి సామాన్య ప్రజలతో సంబంధంలేదు. భారతదేశంలో ఉంటారే గాని ఢిల్లి నే వారి లోకం అక్కడే పుడతారు చదువుతారు పైచదువులకి విదేశాలలో చదివి వచ్చి సిటీలలోనే పనిచేస్తారు. భారతదేశంతొ సంబంధం ఉండదు. మీరు పెద్ద పుడింగిలా మోడి విమర్సిస్తున్నారు.

అధికారులు ప్రధానిని తప్పుడు నివేదికలతో తప్పు త్రోవ పట్టించుంటారు. ఏ.టి.యం. లు సరిగ్గా పనిచేయవని తెలియదు. అధికారూలందరు ఇన్ని ఏ.టి.యం. లు ఉన్నాయి, ఇంత కాష్ డెలివరి చేయవచ్చనే లెక్క చెప్పి ఉంటారు. ఆ అధికారులు కూడా ఏ.టి.యం. లు సరిగ్గా పనిచేయదని తెలియదు. కారణం బాంక్ వాళ్ళు అవి బాగా పనిచేస్తున్నాయని చూపించుకొంట్టూ, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామని మనదగ్గర చార్జ్ వసూలు చేసుకొని, రిసర్వ్ బాంక్ కు లెక్కలు చూపించుకొంట్టూంటారు. రిసర్వ్ బాంక్ బాంక్ లను ఏ.టి.యం. ల పై రిపోర్ట్ అడిగితే బాంక్ లు అన్ని బాగా పనిచేస్తున్నట్లు చూపుతూ పంపి ఉంటారు. కార్పోరేట్ కంపెనీలలో ఉండేవి తప్పించి, బయట ఉండేవాటిలో 30% ఏ.టి.యం. లు ఎప్పుడు సరిగ్గా పనిచేయవు.

మోడి కి నేడు భారత రాజకీయాలలో పోటి లేకపోయినా, ప్రతి సర్వేలో ఆయన కు 60% పైన ప్రజల మద్దతు ఉన్నా. ఎంతో రిస్క్ తో కూడుకొన్న ఈ నిర్ణయం ఎందుకు తీసుకొంటాడు? ప్రజల కోసం అతని కమిట్మెంట్ అది. నీ కోడి బుర్రకి ఒక పది జన్మలెత్తినా అర్థంకాదు. మీకు బుద్ది ఉంటే ఇలా నోరు పారేసుకోరు. మీ కోడి బుర్రకి తెలిసిన దానితో ఆగాల. మోడిని తుగ్లక్ గిగ్లక్ అంటే శ్యామలీయం కు పిచ్చి పుట్టింది వెర్రి వాగుడు మొదలైంది అని ప్రచారం చేయవలసి వస్తుంది.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.