21, అక్టోబర్ 2016, శుక్రవారం

రాజకీయ వారసులు, వారసత్వ రాజకీయాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-10-2016, SUNDAY)
అది సంపద కావచ్చు, అధికారం కావచ్చు.
వాటిని కూడబెట్టినవారికి ఒకటే సమస్య, తమ వారసులకు వాటిని భద్రంగా ఒప్పచెప్పడం ఎలా అన్నదే!
ఒకడు వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తూ పొలాలు కొంటూ పోతాడు. పిల్లలు ఉద్యోగాల పేరుతొ విదేశాలకు యెగిరి పోతుంటే ఆ భూముల్ని ఎవరు చూడాలి, ఎవరు కాపాడాలి, ఎవరు అనుభవించాలి?
పెద్దతనం మీద పడినప్పుడు అన్నేళ్ళుగా ఇంటి వ్యవహారాలపై పెత్తనం చేస్తూ వచ్చిన ఆ ఇంటి పెద్దమనిషికి పట్టుకునే పెద్ద బెంగ.
మరొకడు వైద్యం చేస్తూనో, ఇంకొకడు  వకీలుగా ప్రాక్టీసు చేస్తూనో పది తరాలకు సరిపడా పోగుచేస్తాడు. పోయేటప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలకే  ఆ ప్రాక్టీసు ఒప్పచెప్పాలని తెగ మధన పడతారు.
అలాగే నటీనటులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు అందరికీ ఒకే కోరిక, తమ సామ్రాజ్యాలకు తమ పిల్లలే వారసులు కావాలని.  ఈ విషయంలో వీళ్ళందర్నీ తలదన్నే వర్గం ఒకటుంది, అది రాజకీయం.  
పూర్వం రాజులు, మహారాజులకి వారసులే రాజ్యానికి వచ్చేవారు. వారసుల నడుమ పొరపొచ్చాలు వస్తే మహా భారత యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. రాజ్యాధికారం వారసత్వ హక్కు అని కొందరు, కాదు, రాజ్యం వీరబోధ్యం అంటూ మరికొందరూ చరిత్ర పుటల్ని రక్తసిక్తం చేసారు.
రాజకీయ వారసత్వం గురించి ముచ్చటించుకునే ముందు ఓ పూర్వకాలపు ముచ్చట చెప్పుకోవాలి.
ఒక రాజుగారికి వయసయిపోయింది. పేరుకు తొమ్మిదిమంది యువరాజులు వున్నారు కానీ వారందరూ పనికి పోతరాజులే కాని సింహాసనం మీద కూర్చోదగిన వాళ్ళు కాదు. తన వారసుడు ఎవరనే విషయంలో రాజుగారు తన ఆస్థాన గురువును సంప్రదించాడు. ‘తండ్రిగా అయితే నీకు ఇష్టం వచ్చిన వాడిని వారసుడిగా ఎంచుకో. రాజుగా అయితే రాజ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకో’ అని గురువు సలహా ఇస్తాడు.
రాజులు, రాచరికాల సంగతి సరే. ప్రస్తుతం ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అయినా రాజకీయాల్లో ఈ వారసుల మాట పదేపదే వినబడుతోంది. మొన్నటికి మొన్న తమిళనాడులో డీ ఎం కే కురువృద్ధుడు కరుణానిధి  తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు స్టాలిన్ పేరు ప్రకటించి, ఆ పార్టీలో, తన కుటుంబంలో ప్రకంపనలు సృష్టించారు. ప్రస్తుతం అధికారంలో లేని పార్టీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో తెలియదు.
ఈ పవిత్ర భారత దేశంలో ఒక విచిత్రమైన ద్వైదీభావం వుంది. ఇప్పటికీ ఎన్నికల్లో రాజకీయ వారసులే ఫలితాలను ప్రభావితం చేస్తారు. కానీ జనాన్ని విడిగా అడిగి చూడండి. తద్విరుద్ధంగా మాట్లాడతారు. నవతరం ఓటర్లలో  కొంత మార్పు కానవస్తోంది. కేజ్రీవాల్ పార్టీ పెట్టి ‘నేను భిన్నమైన వాడిని’ అంటే మురిసిపోయారు. ‘మా చుట్టూ పోలీసులు వుండరు, ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోము, అధికారానికి వచ్చినా నేనూ మా  మంత్రులు బుగ్గ కార్లు వాడము, పెద్ద భవంతుల్లో ఉండము, అంతేకాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయరు, అలాంటివాళ్ళకి టిక్కెట్లు ఇవ్వము’ అని తెగేసి చెబుతుంటే వినేవాళ్ళకు విచిత్రంగా అనిపించింది.
‘సెహభాష్, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే!’  అని జనం  క్యూలల్లో నిలబడి ఓట్లు వేసి గెలిపించారు.
అంటే, వారసత్వ రాజకీయాలతో, రాజకీయ వారసులతో జనాలు అంతగా విసుగెత్తి పోయారని అనుకోవాలా!
విసుగెత్తిపోయిన మాట నిజమే కానీ వారి  వరస పూర్తిగా మారలేదు.
ప్రస్తుతం వున్న లోక సభలో మూడింట రెండువంతుల మంది సభ్యులు నలభై ఏళ్ళ లోపువాళ్ళు. అయితే వారి దగ్గరి బంధువుల్లో చాలామంది రాజకీయాల్లో తలనెరిసినవాళ్ళే. ప్రస్తుత లోకసభలో ఇరవై మంది అత్యంత సంపన్నులయిన సభ్యుల్లో పదిహేనుమంది వారసత్వంగా  ఎన్నికల్లో గెలిచి వచ్చినవాళ్ళే కావడం గమనార్హం. మరో సంగతి ఏమిటంటే ఈ నలభై వసంతాల యువ పార్లమెంటు సభ్యులు పది మందిలో తొమ్మిది మంది రాజకీయ వారసులుగా కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచి సభలో అడుగుపెట్టారు.
దేశ రాజకీయాల తీరు తెన్నులు గమనించేవారికి తెలిసే వుంటుంది. అనేక నియోజకవర్గాల్లో ఒక కుటుంబం పెత్తనమే నడుస్తూ వుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో వుంటే జనాలు ఆ పార్టీకే ఓట్లు వేస్తుంటారు.  వీటికి ఏ పార్టీ మినహాయింపు కాదుకాని, వామపక్షాలు, బీజేపీ కొంత మెరుగు.
ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాజకీయ వారసులు వున్నారు. అయితే పార్టీలు వాళ్ళ కుటుంబాల పెత్తనంలో ఉండడానికి ఒప్పుకోవు. కానీ, మన దేశంలో, పొరుగున వున్న పాకీస్తాన్ లో, ఇంకా ఫిలిప్పీన్స్ లో పరిస్తితి ఇందుకు భిన్నం. మన దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనే కాకుండా, బిజూ జనతా దళ్, రాష్ట్రీయ లోక్  దళ్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్  పార్టీ  వంటి  ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ వారసత్వ సంస్కృతి వుంది.
వారసుల గొడవతో సంబంధంలేని రాజకీయ నాయకుల జాబితా తయారు చేసి అక్షర క్రమంలో  కుదిస్తే అదిలా వుంటుంది.
అహమద్ పటేల్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్, మాయావతి, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధి.   

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

వారసులు లేకపోతే తిప్పలు వేరే రకం: జయలలితను చూడండి!