5, జులై 2016, మంగళవారం

టీవీ ఛానళ్ళు – ఓ సలహా

  
ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే,  పూర్వం దూరదర్శన్  కూడా ఇంతటి తీవ్ర  స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని  అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం  వచ్చాయి. కానీ,  ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్  ఛానళ్ళకు  మాత్రం  విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం)  కూడా ఇవ్వడం లేదుపైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు. అయినా ఇది  కాదనలేని నిజం.
నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ,  ‘లెస్ నాయిస్ చిల్డ్రన్ లెస్ నాయిస్అని పదేపదే అనేవారు. పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు,  కాబట్టి చేసేదేదో కాస్త తక్కువ చేయండన్నది దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ  ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతే  ‘రేటింగులను’ ఓపక్క కనిపెడుతూనే జనం నాడిని పట్టుకునే  కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా అనేక  వీలుసాళ్లు వున్నాయి. వాటిని గురించి  ఛానళ్ళ యజమానులు ఆలోచిస్తే బాగుంటుంది. అదిగో,   ఉద్దేశ్యంతోనే నా గొడవ

ఇంతకీ సలహాలు సూచనలు ఏవిటంటే:
వారేరీఎక్కడ ఇప్పుడు?’ అనే పేరుతొ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలోసినిమారంగంలో కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిఇప్పుడు కనుమరుగయి  అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలాటి వాళ్ళను వెతికిపట్టుకుని ‘అప్పుడు – ఇప్పుడు’ వారి పరిస్తితి యెలా వుండేది  ఎలావుంది అన్న విషయాలను చూపగలిగితే వీక్షకులు ఆసక్తిగా చూసే అవకాశం వుంటుంది. ‘వీళ్ళ వారసులు ఎవరు  ఎక్కడ వున్నారు  ఏం చేస్తున్నారు’  అనే సంగతులు నిజానికి  చాలా ఆసక్తిని రగిలించే అంశాలు.
కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి వారసులు ఏం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు  గారి వారసులు ఎవరు, వారు ఇప్పుడేం చేస్తున్నారు?
వరసలోనే తెలుగు సినిమా రంగాన్ని కూడా ఒక పట్టు పట్టవచ్చు. ఒకనాడు తమ  కంటి చూపుతో సినిమా రంగాన్ని శాసిస్తూ అంతులేని ఐశ్వర్యాలను, రాజభోగాలను అనుభవించి,   చివరకు అన్నీ పోగొట్టుకుని నేలకు రాలిన తారలవారసుల పరిస్తితి ఏమిటి? ఇప్పుడెలావున్నారు?  
వీరిలో కొందరి గురించి లోగడ పత్రికల్లో కొన్ని వ్యాసాలు వచ్చిన మాట నిజమే అయినా టీవీ  ఛానళ్ళ ద్వారా అయితే మరింత విస్తృతంగా ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంటుంది.
అలాగే, భర్తలు మరణించిన కారణంగా అనుకోకుండా  రాజకీయ వారసత్వం దక్కించుకున్న కొందరు మహిళలు వున్నారు. అయితే అలా దొరికిన అవకాశాన్ని సమర్ధంగా వాడుకుని పదవులను హోదాలను  పదిలం చేసుకున్నవారు బహు కొద్దిమందే.  అయాచితంగా లభించిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నఅలాటి  వారి  కధనాలు కూడా వీక్షకుల్లో  ఆసక్తి కలిగించేవే. (ఉదాహరణలు: బాలయోగి భార్య, కరణం రామచంద్రరావు సతీమణి)             
ఇప్పుడు ఎన్ని చెప్పినా,  ఏవి చెప్పినా అవన్నీ రాజకీయం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి రాజకీయాలనే ఒక అంశంగా తీసుకుని కొన్ని ఆసక్తి కరమైన కార్యక్రమాలను రూపొందించడానికి వీలుంది.
ఉదాహరణకు ఇప్పుడు తెలుగు  రాష్ట్రాలలో నెలకొనివున్న రాజకీయ పరిస్తితి. చాలా ఛానళ్ళలో  -  వున్న పరిస్తితికి మరింత ఆజ్యం పోసి  మరింత  దిగజార్చే కార్యక్రమాలే ఎక్కువగా  వుంటున్నాయి. వీక్షకుల్లో చాలా మంది వీటిని విధిలేక చూస్తున్నారు కాని హృదయపూర్వకంగా ఆస్వాదించలేకపోతున్నారు. పైకి అందరూ అంగీకరించలేకపోయినా లోలోపల అంతా వొప్పుకునే వాస్తవం ఇది.
గతంలో  ఉమ్మడి  రాష్ట్రంగా వున్నప్పటి సంగతి గుర్తు  చేసుకుంటే, కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉమ్మడి  రాష్ట్రం  చివరాఖరి  రోజుల్లో ఒక్క మంత్రి కూడా, ప్రాంతాల గొడవ పక్కనపెట్టండి, కనీసం  తన సొంత  జిల్లాను దాటి (పెళ్ళిళ్ళూ మొదలైన వాటిని మినహాయిస్తే) వేరే జిల్లాలకు ఒక్కటంటే ఒక్కసారి అధికార కార్యక్రమాలపై  వెళ్ళిన దాఖలాలు  లేవు. ఇందులో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పెద్దగా  కష్టపడాల్సిన పని కూడా లేదు. మంత్రుల కార్యాలయాల్లో టూరు వివరాలు గురించి వారి వ్యక్తిగత సిబ్బందిని వాకబు చేస్తే సరిపోయే విషయం ఇది. దీనికి ఓ ఉదాహరణగా ఓ సంగతి చెప్పుకోవచ్చు.  ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు (ఇప్పుడు లేరు, కీర్తిశేషులయ్యారు) మాత్రం తన పొరుగున వున్న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లివచ్చారు. అదీ ఎందుకటా! ఆయన గారికి పందెపుటెడ్లు అంటే మక్కువ ఎక్కువ. వాటి కొనుగోలు కోసం,  జిల్లాలు ఏమిటి మొత్తం దేశంలో ఎక్కడికయినా వెళ్ళి వస్తారు.  తూర్పు గోదావరి జిల్లాలో మంచి లక్షణాలు వున్న కపిల గోవుకు పుట్టిన ఆవుదూడను కొనుక్కురావడానికి మాత్రమే ఆయన మొట్టమొదటిసారి జిల్లాలో అడుగుపెట్టారట. ఒక మంత్రి అన్నవాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బాధ్యత వహించాల్సినవాడు. మరి దీన్ని  ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?  ఆ రోజుల్లో  ఆరోగ్యశాఖకు సంబంధించి సీమాంధ్రకు చెందిన క్యాబినెట్ మంత్రి ఒకరు వున్నారు.  ఆదిలాబాదు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలడం గురించి పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ అధికారులు తప్ప సంబంధిత  మంత్రి ఒక్కనాడు  కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగేతెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు. తమ శాఖలకు చెందిన అనేక సమస్యలు సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తినా కిక్కురుమనలేదు. అటు వైపు తొంగి చూడలేదు.  
ఇప్పుడు  కూడా  ఈ  రకమైన విషయాలకు  కొదవ  లేదు. ఈ అంశాలను తీసుకుని కార్యక్రమాలను రూపొందిస్తే వాటికి రాజకీయ పరమైన రంగూ రుచీ వాసనా వున్నప్పటికీ ప్రజోపయోగంగా కూడా వుంటాయి. మీడియా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించినట్టు అవుతుంది.
ఏమంటారు?


3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

వీళ్ళ వారసులు ఎవరు ఎక్కడ వున్నారు ఏం చేస్తున్నారు:

ఇటువంటివి (ఉ. శంకరాభరణం ఫేమ్ తులసి ఇప్పుడు ఎక్కడ లేదా ఫలానా సినిమాకు 60 ఏళ్ళు) తరుచూ వస్తూనే ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనం సున్నా. ఇక వారసుల విషయానికి వస్తే సంజీవ రెడ్డి మనవడు అన్న విషయం తప్ప సొంతదేమీ లేని వారి గురించి తెలుసుకోవడం (అతనికి కాస్త పబ్లిసిటీ రావడం మినహా) అవసరమా? నెత్తి మీద రూపాయి పెడితే చారానా చేయని వ్యక్తులు ఎందరినో రోజూ టీవీలలో చూస్తానే ఉన్నాం మళ్లీ వీళ్ళెందుకు?

వినోదం ప్రయోజనం రెంటి మేళంతో కాస్త వెరైటీ కావాలంటే మరుగున పడిన ఆణిముత్యాలు (ఉ. గుళ్ళు, కళాఖండాలు, కళారూపాలు, గుర్తింపుకు నోచుకోని ప్రతిభావంతులు & వారు చేస్తున్న పనులు వగైరా) బయటికి తీసుకొస్తే మంచిది. వీ6 వారు కొంత ఈమేరకు పని చేశారు.

రాజకీయాలే ప్రధానం అనుకుంటే కొంచం అర్ధవంతమయిన చర్చలు (ఉ. సంజీవయ్య తరువాత దళితులకు ఉన్నత పదవులు ఎందుకు రాలేదు?) జరపాలి. దీనిలో పెద్ద ఇబ్బంది ఏమిటంటే విషయజ్ఞానం ఉన్న వ్యక్తులు టీవీలలో లేరు. ముఖ్యంగా విశ్లేషకులుగా చూపిస్తున్న వారికి బొత్తిగా ఏమీ తెలీదు. Every Tom, Dick & Harry is touted as an expert!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jai Gottimukkala: మీ సూచనలు మెచ్చ దగినవి. నేను చెప్పేది చెప్పాను. అవే గొప్ప సలహాలు అని అనుకోవడం లేదు.ఇలా అర్ధవంతమయిన చర్చలు జరిగితే మరిన్ని మంచి సూచనలు రావచ్చు.

నీహారిక చెప్పారు...

ఒకప్పుడు రాధిక సీరియళ్ళు ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళం. సాగతీత సీరియళ్ళు వచ్చి విరక్తి కలిగింది.ఇపుడు వాస్తవిక సమస్యలతో కూడిన రచ్చబండ, సంసారం ఒక చదరంగం బాగా పాపులర్గా నడుస్తున్నాయి.ఎందరికో సమస్యలు తీరుతున్నాయి. సామాన్యులకు కూడా చట్టం అంటే ఏమిటి అన్నది తెలియచేస్తున్నారు.జీవిత ఓవర్ యాక్షన్ ఉన్నా సుమలత ఓపిగ్గా వింటున్నది.

ఏ ప్రోగ్రాం చేసినా ప్రజలకి కాస్త వినోదంతో పాటు ప్రయోజనం ఉండాలి.తెలంగాణా ఉద్యమం అపుడు అఖిల పక్షంతో ఓపెన్ డిబేట్ పెట్టమని నేను కోరాను.ఎవరూ స్పందించలేదు.వేదకుమార్ గారు ప్రతి వారం ఒక చర్చ నిర్వహిస్తారు.సామాన్యులకు అక్కడ మాట్లాడడానికి అవకాశమిస్తారు.చాలా మంది అక్కడ తమ అభిప్రాయాలు తెలుపుతారు.జనం మధ్యలో "యంగిస్థాన్ "కార్యక్రమం చాలా పాప్యులర్ అయింది.జనం మధ్య "మా ఇంటి వంట " చాలా పాప్యులర్.జనం మధ్య మేము సైతం,సత్యమేవ జయతే అన్నీ విజయవంతమయ్యాయి.

నేను చెప్పేది ఏమిటంటే ప్రజలని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం ఏదైనా విజయవంతం అయింది.ఒక్క స్వచ్చ్ భారత్ మాత్రమే సెల్ఫీలతో సమాప్తమైనది.