16, మార్చి 2016, బుధవారం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ – కొన్ని జ్ఞాపకాలు


(ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన సూవెనీర్ ను తెలంగాణా పురపాలక శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం సాయంత్రం (15-03-2016) విడుదల చేశారు. క్లబ్ తో  వివిధ హోదాల్లో నాకున్న అనుబంధం గురించిన వ్యాసాన్ని  అందులో  ప్రచురించారు. అదే ఇది.)
“ఎంతటి పెద్ద సంస్థ అయినా చిన్నగానే మొదలవుతుంది. ఈనాడింత గొప్పగా హైదరాబాదులో ఒక లాండ్ మార్క్ మాదిరిగా  పేరు తెచ్చుకున్న ప్రెస్ క్లబ్  పుట్టుక కూడా అంతే. బషీర్ బాగ్ చౌరాస్తాకు దగ్గరలో ఫతే మైదాన్ వద్దనరసంచారం అంతగా కనబడని ప్రాంతంలోయాభయ్ ఏళ్ళ క్రితం ఒక చిన్న రేకుల షెడ్డులో పురుడు పోసుకుంది. ప్రెస్ క్లబ్ ఏర్పడిన పదేళ్లకు కాబోలు నేను రేడియో విలేకరిగా 1975 లో హైదరాబాదులో పాదం మోపాను.  ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టిన వేళావిశేషం ఎట్టిదో కానీదానితో నా అనుబంధం నేటికీ కొనసాగుతూనే వస్తోంది.
”హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగాక్లబ్ ఉపాధ్యక్షుడిగాక్లబ్ కార్యదర్శిగావివిధ హోదాల్లో అనేక దశాబ్దాలపాటు ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.
“వార్తా పత్రికల్లో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించి విలేకరులకు ప్రెస్  క్లబ్ తో సాన్నిహిత్యం ఎక్కువఎందుకంటె  మోస్తరు విలేకరుల సమావేశాలకు అదే నెలవు. పగలు విధి  నిర్వహణ కారణంగా ప్రెస్  క్లబ్ కి వెళ్ళే విలేకరులకు సాయంత్రం కాలక్షేపాలకు కూడా అదే విడిది.
”ప్రెస్ క్లబ్   బషీర్ బాగ్ ప్రాంతంలో వున్నప్పుడు నేను పనిచేసే ఆకాశవాణి కేంద్రం దానికి కూతవేటు దూరంలో లేదా నడిచి వెళ్ళగలిగేంత దాపులో  వుండడం కూడా క్లబ్ తో నా అనుబంధం బలపడడానికి దోహదం చేసి వుంటుంది. చిన్నపాటి విలేకరుల సమావేశాలే కాకుండా ముఖ్యమంత్రులువిదేశీ అతిధులుప్రముఖ క్రీడాకారులుఉన్నతాధికారులతో మీట్  ది ప్రెస్ పేరిట జరిగే సమావేశాలు కూడా ప్రెస్ క్లబ్ లోనే జరిగే సాంప్రదాయం కారణంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనతి కాలంలోనే నగరంలో ఒక ముఖ్యమైన లాండ్ మార్క్ హోదాను సముపార్జించుకుంది.
“అనేక మంది ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే తొట్టతొలి మీట్ ది ప్రెస్ అక్కడే జరిగేది. నాకు తెలిసి దాదాపు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక సందర్భంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ని సందర్శించి విలేకరులతో మాటామంతీ సాగించిన వాళ్ళే.


“అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. కపిల్ దేవ్క్లైవ్ లాయడ్అజహరుద్దీన్ఎం.ఎల్. జయసింహఎంపైర్ రామస్వామి వంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు హైదరాబాదు ప్రెస్ క్లబ్ ని సందర్శించడం నాకెరుక. క్లబ్ తరపున నిర్వహించిన సార్క్ మీడియా టోర్నమెంటు క్లబ్ చరిత్రలో ఒక ముఖ్యమైన పుట. చెన్నైలోని అమెరికన్  ఎంబసీ సహకారంతో హైదరాబాదులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై  ఒక సదస్సు నిర్వహించడం జరిగింది.
“సదస్సు అనగానే తటాలున ఒక విషయం గుర్తుకు వస్తుంది.
“క్లబ్ స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భం పురస్కరించుకుని రజతోత్సవాలు జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. అప్పుడు కార్యదర్శి ఎం.ఎస్. శంకర్. నేను వైస్ ప్రెసిడెంటుని. ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందుకు వచ్చి సహాయ హస్తం అందించే వ్యక్తి జ్వాలా నరసింహా రావు. మా ముగ్గురికీ ఒక ఆలోచన వచ్చింది. ఎన్నికల సంస్కరణలపై ఒక సదస్సు నిర్వహించిఆనాడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనరుగా వున్న శేషన్ తో కీలక ప్రసంగం ఇప్పిస్తే యెట్లా ఉంటుందని. అనుకున్నదే తడవుతన ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్ళిన జ్వాలా పనిగట్టుకుని వెళ్లి శేషన్ ని కలిసి విషయం ఆయన చెవిన వేసాడు. తరువాత కొద్ది రోజులకే శేషన్ హైదరాబాదు వచ్చి రాజభవన్  గెస్ట్  హౌస్ లో  విలేకరుల సమావేశం పెట్టారు. అది కాగానే వెళ్లి ఆయన్ని కలవాలని మా ప్లాను. అయితే ఆరోజు విలేకరుల మీద ప్రత్యేకించి ఫొటోగ్రాఫర్ల మీద ఆయన  విశ్వరూపం ప్రదర్శించడం చూసి మేమే సంకోచించి ఆయన్ని కలవాలనే ఉద్దేశ్యం  విరమించుకోవాలనుకున్నాం. ఇంతలో ఒక అధికారి వచ్చి
శంకర్ ఎవరుశేషన్ గారు రమ్మంటున్నారు అని పిలిచాడు. ముగ్గురం తటపటాయిస్తూనే లోపలకు వెళ్లాం. బయట చూసిన మనిషికీలోపల మమ్మల్ని ఆయన పలకరించిన తీరుకూ హస్తిమ శకాంతరం తేడా కనిపించింది. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, కూర్చోబెట్టి  వివరాలు అడిగి తెలుసు కున్నారు. అప్పటికే  గదిలో వున్న ఒక వ్యక్తిని చూపెడుతూ, ‘నాకు ఇంగ్లీష్  నేర్పిన గురువుగారు అంటూ మాకు పరిచయం చేసారు. పేరు వినగానే మాకు అర్ధం అయిందిహిందూ ఆంగ్ల దినపత్రికలో వారం వారం నో యువర్ ఇంగ్లీష్ శీర్షిక రాసేది ఆయనే అని.
“మా సదస్సుకు రావడానికి దాదాపు అంగీకరించినట్టే మాట్లాడారు.
“ఈలోగా అనుకోని పరిణామం సంభవించింది. శేషన్  బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. పత్రికలు విషయం పేర్కొంటూ , ‘న్యాయస్థానం శేషన్ ని నోరు మూసుకోమందని అభివర్ణించాయి. దాంతో  శేషన్ ప్రసంగం లేకుండానే ప్రెస్ క్లబ్ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది.
“రవీంద్రభారతిలో కవి సమ్మేళనం బాధ్యత సీనియర్ సభ్యుడు డి. వెంకట్రామయ్య భుజాన వేసుకుంటేఉర్దూ ముషాయిరా నిర్వహణను మరో సీనియర్  మోహన్ దివాకర్ తన భుజస్కంధాలకు ఎత్తుకున్నాడని నాటి విషయాలను  సోమశేఖర్ గుర్తు చేసుకున్నాడు.  అప్పట్లో జనం  ఘనంగా చెప్పుకునే కలర్ టీవీని ఈసీఐఎల్ వాళ్ళు క్లబ్ కి కానుకగా ఇవ్వడంఓసారి క్లబ్  కు వచ్చిన స్టేట్ బాంక్ సీజీఎం శ్రీ పురోహిత్ అక్కడికక్కడే క్లబ్ కి  కావాల్సిన ఫర్నిచర్ ని విరాళంగా ప్రకటించడం మరి కొన్ని జ్ఞాపకాలు. అలాగే క్లబ్ సోమాజీ గూడాకు మారినప్పుడుఓసారి కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు  టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే రోజుల్లో స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోను చేసి టెన్నిస్ టేబుల్ విరాళంగా ఇవ్వడానికి వీలు పడుతుందా అని అడిగాను. దానికి ఆయన జవాబుగా, ‘అక్కడ (క్లబ్ లో ) ఎంతసేపు వుంటారని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి వస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయనఉద్దేశ్యం వేరు.  మేము అడిగినవన్నీ అదే రోజు క్లబ్ కి చేర్పించేసారు.
“ఎంపీ రవీంద్రనాథ్ములుగు సోమశేఖర్ఎమ్మెస్ శంకర్దేవులపల్లి అమర్వల్లీశ్వర్నగేష్ కుమార్ మొదలయిన వారితో కలిసి అనేక కార్యవర్గాల్లో పనిచేసే అవకాశం నాకు లబించింది. ఒక ఏడాది క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఏడాది కార్యవర్గ సభ్యుల సహకారంతోక్లబ్ లో సభ్యుడే ప్రధానం (Member is supreme) అనే నినాదంతో  చేయగలిగిన కొన్ని మంచి పనులు చేసి చూపించడం జరిగింది. వాటిని పేర్కొంటే స్వోత్కర్ష అవుతుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రవాహం వంటిది. దానిమీద ఎవరిదో ఒకరి ముద్ర వేయాలని ప్రయత్నించడం వృధా. ఒక వేళ వేయాలని అనుకున్నా సాగే ప్రవాహంపై అది నిలవదునిలబడదు.
“అందుకే ఒక మాట. ప్రెస్ క్లబ్ ఈనాడు ఇంతటి ఉచ్ఛస్థితిలో వుందంటే దానికి కారణం సభ్యులుగాహితైషులుగా ఉంటూ వస్తున్న ఎందరో మహానుభావులు.
“వారందరికీ వందనాలు.(16-03-2016)

కామెంట్‌లు లేవు: