12, మార్చి 2016, శనివారం

ఇదీ భారతం ........ఎక్కడికీ ప్రస్తానం ?


సూటిగా....సుతిమెత్తగా.....

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 13-03-2016, SUNDAY)

వెనుక ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే రోజుల్లో  తమిళనాడు లోని కుంభకోణంలో సెటిలయిన, తెలుగు తెలిసిన ఒక పెద్దమనిషి నుంచి ఫోనువచ్చింది.
‘దేశంలో ఎక్కడ ఏ లాలూచీ జరిగినా, ఆర్ధికపరమైన గందరగోళాలు చోటుచేసుకున్నా  ‘కుంభకోణం’ అంటూ మా వూరు పేరు ఎందుకు చెబుతారు? ఈసారి వార్తల్లో అల్లా చెప్పారంటే కోర్టులో కేసు వేస్తాను సుమా!’ అని సున్నితంగానే కాకుండా సూటిగా కూడా హెచ్చరించాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మళ్ళీ ఆ పదం వాడలేదు. కేసు వేస్తాడన్న  భయం వల్ల కాదు, అతగాడికి తన ఊరిపై వున్న వల్లమాలిన మమకారంవల్ల పెల్లుబికిన గౌరవంతో.
కానీ, పత్రికలో రాసేటప్పుడు తప్పడం లేదు. పత్రికల్లో ఆ పదం చదవకా తప్పడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఇతివృత్తం కుంభకోణాల మయం కనుక.
స్వతంత్ర భారత దేశంలో కూడా కుంభకోణాలకు కొదవేమీ లేదు. తాజాగా చెప్పుకుంటోంది లిక్కర్  కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్  లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారం.
లక్షాధికారుల ఇంట్లో పుట్టి, కోట్లల్లో పెరిగి, అత్యంత సంపన్నులలోఒకడిగా ఎదిగి, ఆ క్రమంలో అందిన చోటల్లా అప్పులు చేసి ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అని పాడుకుంటూ విదేశాలకు ఎంచక్కా ఎగిరిపోయిన విజయ్ మాల్యా గతంలోనూ, ఇప్పుడూ కూడా మీడియా వార్తలకు మంచి ముడి సరుకే.


సీబీఐ ఓ పక్క డేగకన్నుతో కనిపెట్టి చూస్తుంటే, విజయ్ మాల్యా ఒక మహిళతో కలిసి, విమానంలో అదీ  ఫస్ట్ క్లాస్ లో దర్జాగా  ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. నమ్మశక్యం కాకున్నా నమ్మక తప్పని పరిస్తితి. పైగా ‘నేను పారిపోలేదు,  విదేశీ ప్రయాణాలు తనకు కొట్టిన పిండే’ అంటూ ట్విట్టర్లో  ట్వీట్ చేస్తూ విలాసంగా అక్కడ  కాలక్షేపం చేస్తున్నాడు. పైపెచ్చు, తన మీద మీడియా కక్ష కట్టి విద్వేషపూరిత ప్రచారం చేస్తోందని  ఆవేదన వెలిబుచ్చాడు. గతంలో తన నుంచి మీడియా బాసులు పొందిన సేవలను, సత్కారాలను, కల్పించిన వసతులను వారు మరిచిపోయినా తనకన్నీ గుర్తున్నాయనే రీతిలో నిప్పులు చెరిగాడు. బ్యాంకులకు అక్షరాలా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినట్టు అభియోగాలను ఎదుర్కుంటున్న ఈ చిద్విలాస పురుషుడు విజయ్ మాల్యాకు ఈ నెల పద్దెనిమిది నాటికి తమ ఎదుట హాజరు కావాలని  ఈడీ పంపిన సమన్లను అతడేమాత్రం ఖాతరు చేస్తాడో వేచి చూడాలి.
ముందే చెప్పినట్టు మన దేశంలో కుంభకోణాలు కొత్తవేమీ కాదు. స్వతంత్రంతో పాటే ఇవి కూడా దేశంలోకి కుడి కాలు పెట్టాయి.           
1947 లో దేశానికి స్వాతంత్రం రావడం తరువాయి, ఏకంగా మొదటి అడుగు పడింది జీపుల కుంభకోణంలో.  భారత – పాకిస్తాన్ దేశాల నడుమ సంఘర్షణలకు కేంద్రం అయిన కాశ్మీర్  రాష్ట్రంలో సైనికదళాల కదలికలకు అక్కడి ఎగుడు దిగుడు మార్గాలు ప్రతిబంధకంగా ఉండేవి. దానితో  అందుకు తగ్గ  జీపులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పట్లో  ప్రధాని  నెహ్రూకు బాగా సన్నిహితుడయిన వీకే. కృష్ణమీనన్, బ్రిటన్ లో మన దేశం తరపున హై కమీషనర్ గా పనిచేస్తుండేవారు. ఎక్కడ, ఏ మీట ఎవరు నొక్కారో తెలియదు, చాలా తక్కువ నాణ్యత కలిగిన, నాసిరకం  జీపులు దేశంలోకి దిగబడ్డాయి. అదృష్టం ఏమిటంటే అప్పటికే సరిహద్దు సంఘర్షణలు ముగింపుకు వచ్చాయి. ఆ  జీపుల కుంభకోణాన్ని ఆరాతీయడానికి అనంత శయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక దర్యాప్తు సంఘం ఏర్పాటయింది. ఇప్పట్లా కాదు కనుక ఆయన త్వరత్వరగా దర్యాప్తు పూర్తిచేసి  వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అది ఇంతవరకు వెలుగు చూసిన దాఖలా లేదు. కాకపోతే  ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన పేరు కృష్ణమీనన్. ఆయన  దరిమిలా మొత్తం దేశానికే రక్షణ మంత్రి అయ్యారు. అదీ కొసమెరుపు.
1949 లోఉత్తరాది రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా వున్న రావు శివ బహదూర్ సింగ్ కేవలం పాతిక వేలు లంచం తీసుకుని  ఒక వజ్రాల గని లీజుని తనకు తెలిసిన  వ్యాపారికి కట్టబెట్టారు. పాతిక వేలు ఎటుపోయాయో తెలియదు కాని చట్టానికి దొరికిపోయిన మంత్రిగారు మాత్రం మూడేళ్ళు జైలు ఊచలు లెక్కబెట్టాడు. పాలక పక్షం  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు జైలు పాలు కావడం అదే మొదలు.
1951 లో ఎస్ ఏ వెంకట్రామన్ అనే మంత్రి  కేంద్రంలో పరిశ్రమల శాఖ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సైకిల్ విడి భాగాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకునేవారు. అలాటి ఒక  లైసెన్సును మంత్రి మహోదయులు తనకు తెలిసిన కంపెనీకి గుండు గుత్తగా  అప్పగించారు. ఫలితం, ఆరోపణలు, దర్యాప్తులు. చివరకు అసలు  వ్యవహారం బయట పడి ఆయన మూడేళ్ళు జైల్లో గడిపారు.
1956 లో దాల్మియా అనే వ్యాపార వేత్తకు అనేక వ్యాపారాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. దాల్మియా – జైన్ ఎయిర్ వేస్ కు ఆయన చైర్మన్. భారత  బీమా సంస్థ అనే ప్రైవేటు బీమా సంస్థకు  యజమాని. ఏదో డబ్బు అవసరం పడి ఆ సంస్థలో రెండు కోట్ల రూపాయల నిధులు ఆరగించారు. విషయం బయటకు పొక్కడం, విచారణ జరగడం, దాల్మియాను రెండేళ్ళు జైలుకు పంపడం చక చకా జరిగిపోయాయి. ఆ దెబ్బతో దేశంలో బీమా వ్యాపారాన్ని ప్రభుత్వం జాతీయం చేసి చేతులు దులుపుకుంది.
చేతులు దులుపుకుంది అని వూరికే అనలేదు, 1957 లో కాన్పూరులో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి వుండేవారు. వ్యాపారం అన్నాక డబ్బుల అవసరం తప్పదు. అందులో కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా వున్న టీ.టీ. కృష్ణమాచారి గారికీ, ఈ ముంద్రా గారికీ మంచి స్నేహం. మంత్రిగారు తలచుకుంటే ఎల్.ఐ.సి. (జీవిత బీమా సంస్థ) నుంచి ఋణం ఇప్పించడం ఏమంత కష్టం? అందులోను అది ప్రభుత్వ రంగ సంస్థ.  టీటీకే కార్యాలయం నుంచి ఫోను వెళ్ళగానే చిటికెలో ముంద్రా గారికి కావాల్సిన కోటి  రూపాయల ఋణం మంజూరు అయిపోయింది. కానీ కధ అయిపోలేదు.పైగా కొత్తగా కేసు  మొదలయింది.  ఫలితం షరా మామూలే. ముంద్రా ఇరవై రెండు నెలలు జైల్లో వున్నాడు. సిఫారసు చేసిన పాపానికి టీటీ  కృష్ణమాచారికి కృష్ణజన్మస్థానానికి వెళ్ళే ప్రమాదం రాలేదు కానీ,  మంత్రి ఉద్యోగానికి నీళ్ళు ఒదులుకోవాల్సివచ్చింది. 
1962 లో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆర్ధికపరమయిన నేరాల్లో ఇరుక్కుంటే చక్కటి జీవితాలు కూడా ఎలాటి భయంకరమయిన మలుపులు తిరుగుతాయో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. పేరు చూస్తే ఉత్తర భారతం అనిపిస్తుంది కాని జయంతి ధర్మతేజ అనే ఈ పెద్దమనిషి పదహారణాల తెలుగు వాడు. తన సొంత తెలివితేటలతో ఒక సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఇప్పుడుప్రభుత్వ రంగంలో వున్న భారత షిప్పింగ్  కార్పోరేషన్ ఆవిర్భావానికి పూర్వం, దేశ నౌకానిర్మాణ రంగం ధర్మతేజ గారి ఆధిపత్యంలోనే వుండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను  ధర్మతేజ తెలివితేటలు బాగా ఆకట్టుకున్నాయి. కేవలం రెండు వందల రూపాయల పెట్టుబడితో ఆయన సంస్థ ప్రారంభం అయిందని చెబుతారు. నెహ్రూ పుణ్యమా అని ఇరవై రెండు కోట్ల అప్పు పుట్టింది. ఇకనేం, ఆయన వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. కాలక్రమంలో ధర్మతేజ వ్యాపారంలో అనేక అధర్మ కోణాలు వెలుగు చూసాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని లండన్ లో అరెస్టు చేసి ఆరేళ్ళు జైల్లో ఉంచారు. ఆ పిదప ఆయన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగల లేదు. ఒకప్పుడు ఒక  వెలుగు వెలిగిన జయంతి ధర్మతేజ మసకబారి  కాలగర్భంలో కలిసిపోయాడు.       
1964 ప్రాంతంలో అవిభజిత పంజాబు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రతాప్ సింగ్ ఖైరాన్ అనే కాంగ్రెస్ నాయకుడు ఏకచత్రాధిపత్యంగా పాలిస్తుండేవాడు. ఎదురులేని పాలన అయినా ఎదురు దెబ్బలు మాత్రం తప్పలేదు. అధికారంతో పాటే సంక్రమించిన అవినీతి తెగులు దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశం అయింది. దాస్ కమీషన్ ఆయనపై అభియోగాలను నిర్ధారించడంతో  ఖైరాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
1971 లో నగర్ వాలా కేసు ఒక విచిత్రం. ఢిల్లీ లోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న చీఫ్ క్యాషియర్ కి  ఫోన్ వచ్చింది. ‘నేను ప్రధాని ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను’ అని అవతల నుంచి వినిపించింది. ఇవతల అధికారి భయంతో బిక్కచచ్చి పోయాడు కానీ, ప్రధాని తనకు ఫోన్ చేయడం ఏమిటని క్షణం కూడా సందేహించలేదు. “నగర్ వాలా అని నా తరపున ఒకతను వస్తాడు. అతడికి వెంటనే అరవై లక్షలు ఇచ్చి పంపేయండి’ చెప్పేసి అవతల ఫోన్ కట్టయింది. చెప్పినట్టే రుస్తుం సోరబ్ నగర్ వాలా గారు విచ్చేశారు. ఆయన ఒక మాజీ సైనికాధికారి. బ్యాంకు అధికారి అరవై లక్షలు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టాడు. అతగాడు లెక్కబెట్టుకోకుండానే డబ్బు జేబులో పెట్టుకుని దర్జాగా  వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద దుమారంగా, సంచలనంగా  మారింది. ప్రధాని పేరు వినరావడంతో  దర్యాప్తులు, విచారణలు ముమ్మరంగా సాగాయి. అయితే,  కధ మరీ సాగిపోకుండా ఆగిపోయింది, నగర్ వాలా ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.    
1974 లో పుదుచ్చేరికి చెందిన కొందరు వ్యాపారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిని కలిసి తమకు దిగుమతి లైసెన్సు ఇవ్వాలని కోరుతూ ఒక మహజరు అందచేసారు. దాన్ని గట్టిగా సిఫారసు చేస్తూ ఇరవై ఒక్కమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసారు. తీరా లైసెన్సులు జారీ చేసిన తరువాత తెలిసినదేమిటంటే ఆ సంతకాలన్నీ ఫోర్జరీవని.
మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అనే కాంగ్రెస్ నాయకుడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంటే అంతులేని అభిమానం. అంచేత ఇందిరా ప్రతిభా ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థను పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి తెచ్చి అంతులేని విరాళాలు సేకరించి పెట్టారని ఆయనపై అభియోగాలు వెల్లువెత్తాయి. ఫలితం ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన.  
రాజకీయ కుంభకోణాల్లో తలమానికం వంటిది బోఫార్స్ శతగ్నుల కొనుగోలు వ్యవహారం. ఇందిరా గాంధి హత్యానంతరం అత్యధిక మెజారిటీతో ప్రధాని పదవికి రాజీవ్ గాంధీని ఎన్నుకున్న ప్రజలే, ఈ కుంభకోణంతో మసకబారిన రాజీవ్ ని 1989 ఎన్నికల్లో ఓడించి  అధికారానికి దూరంగా పెట్టారు.
ఆర్ధిక కుంభకోణాల్లో జనం ఇప్పటికీ మరిచిపోలేనిది హర్షద్ మెహతా షేర్ల భాగోతం. సరళీకరణ ఆర్ధిక విధానాలు ఆరంభ దశలో ఉన్నకాలంలో అవకాశాలను అంది పుచ్చుకుని పైకి ఎదిగిన ఈ షేర్ సింగ్ అనతికాలంలోనే అడ్డదార్లలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశాడు. ఇతడి దెబ్బకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చిగురుటాకులా అల్లల్లాడిపోయింది. దాన్ని ఒడ్డున పడెయ్యడానికి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన ధనాన్ని 4,800 కోట్ల మేరకు వాడాల్సివచ్చింది.  
ఇలా చెప్పుకుంటూ పొతే  ఈ జాబితా చేంతాడు అంత అవుతుంది. నకిలీ స్టాంపుల తెల్గీలు,కృష్ణ యాదవ్ లు,  పశువుల దానా లాలూ యాదవ్ లు, షేర్ మార్కెట్లతో గోలీ ఆటలు ఆడుకున్న చేతన్ పరేఖ్ లు.......ఒకటా, రెండా..... ఎన్నెన్నో కుంభకోణాలు, ఒకళ్ళా, ఇద్దరా.... ఎందరెందరో మహానుభావులు,   తమ వికృత చేష్టలతో చరిత్రను సృష్టించి చరిత్రలో కలిసిపోయారు.
అయినా నేటి చరిత్ర చూస్తుంటే గత కాలము మేలు  అనే అనిపిస్తోంది కదూ.
ఉపశృతి : మాకు తెలిసిన బంధువుల కుర్రవాడు, ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, గ్రీన్ కార్డు హోదా సంపాదించుకుని, అక్కడే ఇల్లు కొనుక్కుని ఉంటూ మొన్నీమధ్య తల్లికి ఒంట్లో బాగాలేదని తెలిసి హడావిడిగా హైదరాబాదు వచ్చాడు. తల్లికి స్వస్తత చేకూరిన పిదప తిరిగి వెడుతుంటే పాత  పాస్ పోర్ట్ చెల్లదని అధికారులు అభ్యంతర పెట్టారు. వారికి నిబంధనలు ముఖ్యం కదా! తప్పదు. అతగాడు ప్రయాణం మానుకుని   తత్కాల్ పద్దతిలో పాస్ పోర్ట్ రెన్యూ చేయించుకుని తిరిగి వెళ్ళడానికి పడరాని పాట్లు పడ్డాడు. మరి చట్టం అందరికీ సమానమే అని చెప్పే కబుర్లు నేతిబీరకాయ చందమేనా? నేతాశ్రీలే చెప్పాలి. (12-03-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595  


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ. అప్పులన్నీ ఎగరగొట్టి ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ.