30, నవంబర్ 2015, సోమవారం

కాసింత కర్టెసీ


ఇప్పుడే ఒక ఛానల్ లో కింద వచ్చే  స్క్రోలింగు చూశాను. రాబోయే కార్యక్రమానికి చెందిన సమాచారం అది.
“సోనియా అమెరికా ఎందుకు వెళ్ళింది” అన్నది ఆ స్క్రోలింగు.
కాస్త మర్యాదగా “సోనియా అమెరికా ఎందుకు వెళ్ళారు” అని దాన్నే  మార్చి రాయొచ్చు. ఒకవేళ అది కుదరని పక్షంలో “సోనియా అమెరికా ఎందుకు వెళ్లినట్టు?” అని రాస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు.
“మోడీ పారిస్ వెళ్ళారు” అనడానికీ, “మోడీ పారిస్ వెళ్ళాడు” అనడానికీ వున్న తేడాను ఈ స్క్రోలింగులు రాసే వాళ్ళు గమనిస్తే బాగుంటుంది.
కాలేజీ రోజుల్లో మాకు ఇంగ్లీష్ గ్రామరు లెక్చరరు క్లాసులోకి రాగానే ‘లెస్ నాయిస్ ప్లీజ్” అనేవారు. ‘స్టూడెంట్లు ఎట్లాగో అల్లరి చేస్తారు. కాస్త తక్కువ గోల చేయండ’ని ఆయన వేడుకోలు.
అల్లాగే ఈనాటి మీడియా కూడా, వున్నపరిధుల్లో, పరిమితుల్లో కాసింత ‘కర్టెసీ’ చూపితే బాగుంటుందని భవదీయుడి సూచన.

ధైర్యం


ఇరుగుపొరుగు రాజ్యాల సైన్యాధిపతులు ఓ విందు సమావేశంలో కలుసుకున్నారు. ఆ ఇద్దరి నడుమ ధైర్యం గురించిన ప్రస్తావన దొర్లింది.
ఒకడన్నాడు.
“నేను నా సైనికులకు ఇచ్చిన శిక్షణ చాలా గొప్పది. నేను ఆదేశించానంటే చాలు మా సైనికులు మారుమాట లేకుండా శిరసావహిస్తారు. ఈ విషయంలో వారు చూపే తెగువకు, ధైర్యానికి సాటిరాగలవారు వుండరు. మాట వరసకి ఇదిగో ఈ ఏడంతస్తుల భవనం మీద నుంచి కిందకు దూకమన్నాననుకోండి.  మరో మాట చెప్పకుండా కిందికి దూకేస్తారు. వాళ్ళ ధైర్యం ఎలాటిదో మీకు మచ్చు చూపిస్తాను” అంటూ తన సైనికుల్లో ఒకడిని పిలిచి ‘కిందకు దూకు’ అన్నాడు. సైన్యాధిపతి చెప్పినట్టే అతగాడు కిందికి దూకేసాడు. గాయపడిన అతడ్ని మిగిలిన సైనికులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు. ఈ తతంగం ముగియగానే మొదటి సైన్యాధికారి మీసం మెలేస్తూ రెండో వాడివైపు చూసి, ‘చూసావుగా మా వాళ్ళ ధైర్యం’ అంటూ హేళనగా మందహాసం చికిలించాడు. చేసేది లేక  పక్క దేశపు సైన్యాధికారి కూడా  తన బంటుల్లో ఒకడిని పిలిచి ఆ భవనం పైనుంచి దూకమన్నాడు. అయితే అతడు ఆ ఆదేశాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఇంత ఎత్తు భవనం నుంచి దూకమనగానే దూకడానికి నాకేం మెదడు లేదనుకున్నావా’ అని ఎదురు ప్రశ్నించాడు.
అప్పుడన్నాడు రెండో సైన్యాధికారి.

“ఇలా పై అధికారికి ఎదురు చెప్పే ధైర్యం మీ వాళ్ళలో ఎవరికయినా ఉందా?”  

   
NOTE: Courtesy Image Owner  

27, నవంబర్ 2015, శుక్రవారం

కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన భారత రాజ్యాంగం

సూటిగా......సుతిమెత్తగా .....
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-11-2015, SUNDAY)

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక  పవిత్ర గ్రంధం. అటువంటి రాజ్యాంగం గురించి భారత పార్లమెంటు ఉభయ సభల్లో గడచిన వారం రెండు రోజులపాటు చర్చ జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని మోడీ ప్రభుత్వం, ‘రాజ్యాంగం పట్ల నిబద్ధత’ అనే అంశంపై రెండు రోజులపాటు ఈ  చర్చ నిర్వహించింది. రాజ్యాంగ రచనలో  అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు నోచుకున్నాయి. జాతి వ్యాప్తంగా ఈనాడు మీడియా చర్చలకు కేంద్ర బిందువుగా మారిన ‘అసహనం’ అంశం కూడా చట్ట సభల  ప్రసంగాల్లో చోటు చేసుకుంది. చర్చలు, సమాలోచనలే పార్లమెంటుకు అసలు సిసలైన ఆత్మ వంటిదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల పర్యవసానమేమో తెలియదు కాని, రాజ్యాంగంపై లోక సభలో జరిగిన చర్చ ఘాటుగానే సాగింది.
చర్చ సాగినంత సేపూ సభలోనే కదలకుండా కూర్చుని సభ్యుల ప్రసంగాలను నోట్స్ రూపంలో రాసుకున్న ప్రధాని నరేంద్ర  మోడీ, రెండు రోజుల చర్చకు సవివరమైన సమాధానం ఇచ్చారు. (వివరాలు శనివారం పత్రికల్లో రావచ్చు)
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి హిందీ సమానార్ధక పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడంలో అనువాద సంబంధ మైన కించిత్ పొరబాటు జరిగిందనే అభిప్రాయం కలిగేట్టు, తొలి రోజునే  కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ సభ్యుల నుంచి నిరసనలకు దారితీసింది.
“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అన్నారు రాజ్ నాథ్.
సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని, రాజ్ నాథ్ గుర్తుచేశారు.
“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని హోం మంత్రి వ్యాఖ్యానించారు.
“అంబేద్కర్ స్పూర్తితోనే మోడీ నాయకత్వంలోని  ఎండీయే ప్రభుత్వం ‘జన్ ధన్, స్వచ్చ భారత్, బేటీ పడావో’ వంటి పలు పధకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు.
భారత రాజ్యాంగ రచనను ఒంటి చేత్తో నిర్వహించిన అంబేద్కర్ ప్రతిభను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు శ్లాఘించారు. కాలపరీక్షకు తట్టుకుని నిలబడేలా  రాజ్యంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ దార్సనికతకు జాతి రుణపడివుంటుందన్నారు.
కేంద్ర హోంమంత్రి చేసిన ‘సెక్యులరిజం’ ప్రస్తావన పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఘాటుగానే స్పందించారు.
“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. ఇలాటివాళ్ళు  రాజ్యాంగానికి కట్టుబడి వుండడంపై చర్చ పెట్టడాన్ని మించిన హాస్యాస్పద అంశం వేరే ఏముంటుంది” అంటూ ఎద్దేవా చేసారు.
“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని గుర్తు చేస్తూ,  పాలక పక్షానికి ఓ  చురక అంటించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి వచ్చిన  అంబేద్కర్ లోని ప్రతిభను గుర్తించి రాజ్యంగ రచన వంటి గురుతర బాధ్యతను ఆయనకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే అని సోనియా ముక్తాయింపు ఇచ్చారు.
అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన  ప్రత్యేక చర్చను, పాలక, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తమ రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మళ్ళించుకునే రీతిలో, అంబేద్కర్ స్మృతిని వాడుకున్న తీరు నేటి స్వార్ధ రాజకీయాల తీరుతెన్నులకు అర్ధం పడుతోంది.
ఘర్షణాత్మక రాజకీయాలు ఒద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి  అవసరం అని ఇంకో పక్క  ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడ్డాయన్న వాస్తవం, చర్చల సరళిని గమనిస్తూ వచ్చిన వారికెవ్వరికయినా ఇట్టే బోధపడుతుంది.
అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ కొంత మేలే చేసింది. రాజ్యాంగం గురించి జాతి వ్యాప్తంగా మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి. భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు మరోమారు వెలుగు చూసాయి.
గత అరవై ఆరేళ్లుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది.
స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది.  1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం  299 కి తగ్గింది. కొందరు  ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్  సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు.

రాజ్యాంగ రచన అక్షరాలా  రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు.
1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన  1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు.
వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడం వల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. 
యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం   25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్,  448 అధికరణలు, అయిదు అనుబంధాలు.
ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు. 
తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత  పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రందాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది. (27-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image owner          

24, నవంబర్ 2015, మంగళవారం

ఏకపక్ష విజయంలో బహుముఖ కోణాలు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 26-11-2015, THURSDAY)
ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన  అతిరధ మహారధులెందరో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  దొరక్క, ఇండిపెండెంటుగా పోటీ చేసి కనుమూరి బాపిరాజు, ఆ పెను ప్రభంజనంలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచి బయటపడి, మొదటి సారి శాసన సభలో అడుగు పెట్టారు. సహజంగా హాస్య ప్రియుడయిన బాపిరాజు ఆనాటి హైదరాబాదు విలేకరులతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమాల్లో విసిరే ముష్టిఘాతాలకు విలన్లు కుదేలవడం తెలుసు. కానీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతూనే ఆయన కొట్టిన దెబ్బకు  మా అందరికీ కాళ్లూ చేతులూ విరిగిపోయాయి. నడుములు కుంగిపోయాయి. ఒకడికి కాలు పొతే, మరొకడికి కన్ను పోయినట్టయింది   మా పరిస్థితి. (ఇండిపెండెంటుగా గెలిచినా ఆయన కాంగ్రెసు మనిషే). ఎన్నికల్లో చావుదెబ్బ తినడం అంటే ఏమిటో చెప్పడానికి  బాపిరాజుగారు ఆ రోజుల్లో చెప్పిన భాష్యం అది. మళ్ళీ ఇన్నాల్టికి వరంగల్ ఉప ఎన్నిక ఫలితం రూపంలో అలాంటి రాజకీయ అద్భుతం చోటుచేసుకుంది. సుమారు ఏడాదిన్నర క్రితం కొంచెం అటూ ఇటూగా నాలుగు లక్షల మెజారిటీతో గెలుచుకున్న వరంగల్ లోక సభ స్థానాన్ని టీ.ఆర్.ఎస్. తిరిగి అంతకు మించిన మెజారిటీతో నిలబెట్టుకుని కొత్త రాష్ట్రంలో ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పింది.


అర్ధం చేసుకోవాల్సిన  విషయం ఏమిటంటే, ఏడాదిన్నర కాలంలోనే మెజారిటీ పడిపోయి ఓటమిని మూటగట్టుకునేంతగా కేసీఆర్ నేతృత్వంలోని టీ.ఆర్.ఎస్.  సర్కారు, తన  కొంగున కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు. అలాగని, ఇంత గొప్ప మెజారిటీ తెచ్చుకుని, ఎన్నికల బరిలో వున్నమొత్తం ఇరవైరెండు మంది ప్రత్యర్ధులకు  డిపాజిట్లు సయితం దక్కనంతగా ఘన విజయం సాధించే  అద్భుతమైన ఘన కార్యాలు ఈ ఏన్నర్ధం కాలంలో చేసిన దాఖలా కూడా ఏమీ లేదు. మరి ఎందుకిలా జరిగింది? ఎందుకిలా వచ్చిందీ ఫలితం?
ఎందుకంటే, ఘోరంగా ఓడిపోయిన వారిది ఎక్కువగా  స్వయంకృతాపరాధమే.      
‘తెలంగాణా ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే నిరుటి ఎన్నికల్లో గెలవలేకపోయామని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ,  ఆ విషయాన్ని మరోమారు తెలంగాణా ప్రజల ముందుకు తెచ్చి ఈ ఉపఎన్నికలో అయినా పోయిన పరువు నిలబెట్టుకోవాలని  ఢిల్లీ నాయకుల్ని సయితం వరంగల్ ప్రచారంలోకి దింపింది. తెలంగాణా బిల్లు లోకసభ ఆమోదం పొందే సమయంలో స్పీకర్ గా వున్న మీరా కుమార్ మొదలయిన వారితో అలనాటి అంశాలను మళ్ళీ చెప్పించి, ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నం చేసింది. మరో వైపు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సహజంగా తలెత్తగల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకులు చేసారు. నామినేషన్ సమయంలో అభ్యర్ధిని మార్చాల్సిన విషమ పరిస్తితి నుంచి కొంత బయట పడ్డట్టు మొదట్లో అనిపించినా చివరకు ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది.
మరోవైపు కేంద్రంలో అధికారంలోవున్న  బీజేపీ, పొరుగు రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ, గత ఎన్నికలల్లో కుదుర్చుకున్న పొత్తుకు కొనసాగింపుగా ఈ ఉపఎన్నికలో మరోమారు జతకట్టి పోటీ చేసాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో తమకూ కొంత వాటా వుందని నమ్ముతున్న బీజేపీ సహజంగానే ఆ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర సాయం లేకుండా కొత్త తెలంగాణా రాష్ట్రం మనుగడ కష్టం కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించడం వరంగల్ ఓటర్ల విధాయకం అని నమ్మచూపే పద్దతిలో ఆ పార్టీ ప్రచారం సాగింది. ఇక ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ నాయకత్వం, బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేసింది కాని, సైకిల్ గుర్తుకు ఓటువేయడానికి అలవాటుపడిన టీడీపీ కార్యకర్తల ఓట్లు ఏమాత్రం కమలం గుర్తుకు బదిలీ అవుతాయన్న  విషయంలో ఎవరి అనుమానాలు వారికి పోలింగుకి ముందర నుంచీ వున్నాయి. చివరాఖరుకు అవే నిజమయ్యాయా అన్నట్టు ఫలితం వెలువడింది. ఓటమిలో పాలుపంచుకున్న టీడీపీ నాయకత్వానికి మిగిలిన ఒకే ఒక ఉపశమనం ఏమిటంటే,  ఈ ఎన్నికల్లో సొంతంగా  అభ్యర్ధిని  నిలబెట్టకుండా, ఆ స్థానాన్ని మిత్ర పక్షం అయిన బీజేపీకి ఒదిలివేయడమే.  
ఇక వామపక్షాలు ఏకంగా ఒక ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి నిలిపాయి. వై.ఎస్.ఆర్. పార్టీకి తెలంగాణాలో బలం లేకపోయినా అభ్యర్ధిని నిలబెట్టింది. జగన్ మోహన్ రెడ్డి సభలకు భారీగా తరలివచ్చిన జనాలను అయినా ఓట్లుగా మలచుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.
ఇన్ని పార్టీలు రంగంలో వున్నప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి పాలక పక్షానికే ఉపకరిస్తుంది. అయితే ఇన్ని పార్టీలు ప్రచార పర్వంలో విసిరే ఆరోపణలకు, విమర్సలకు ఒంటరిగా జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా పాలక పక్షం నాయకులపై పడుతుంది. అందుకే ప్రచార సమయంలో ప్రతి అంశం వివాదాంశంగా మారి, మీడియాలో పలు రూపాల్లో రూపాంతరం చెంది, నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పేరుకుపోయి ఉన్నదేమో అని ప్రతిపక్షాలే నమ్మే స్థితి ఏర్పడింది. చివరికి ఈ నమ్మకమే వాస్తవ స్థితిని  సయితం  గుర్తించలేని పరిస్థితిలోకి వాటిని నెట్టి వేసింది. నిజానికి అధికారంలోకి  వచ్చిన రెండేళ్లలోపు వచ్చిపడే ఉపఎన్నికలు ఏ పాలకపక్షానికయినా తలనొప్పే. యెంత గొప్ప నాయకుడయినా అంత కొద్ది వ్యవధానంలో ప్రజలను మెప్పించడం కష్టం. అధికార పక్షంపట్ల ఎంతో కొంత అసంతృప్తి సహజం. కొండొకచో అది వ్యతిరేకతగా కానవస్తుంది. అయితే అది అసహనంగా మారి, అసంతృప్తిగా పరిణమించి,  కసిగా మారనంత కాలం పాలక పక్షాలకు  కలిగే ప్రమాదం ఏమీ వుండదు.
సాధారణంగా ఉపఎన్నిక, అందులోను పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నిక అంటే జనంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఒక్క స్థానంలో  గెలుపోటముల వల్ల అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. ఈ కారణాల వల్ల వరంగల్ ఉపఎన్నికను జనం ఆషామాషీగా తీసుకుంటారనే అభిప్రాయం కలిగిన మాట వాస్తవం. అయితే జనంలోని ఈ  నిర్లిప్తత తమ కొంప ముంచుతుందన్న ఎరుక కలిగిన రాజకీయ పార్టీలు తమ ప్రచార సరళిని ఉధృతం చేసే క్రమంలో, ఒకింత చెలియలి కట్ట దాటి వ్యవహరించాయి. మాటలు హద్దులు మించాయి. వ్యక్తిగత ఆరోపణలు మనస్సు చివుక్కుమనే రీతిలో సాగాయి.  రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల సమస్యలు వీటన్నిటినీ ప్రతిపక్ష పార్టీలు ప్రచారాస్త్రాలుగా మార్చుకుని టీఆర్ ఎస్ పై మూకుమ్మడి దాడికి దిగాయి. ప్రజల సమస్యలను ప్రచారంలో ఎత్తి చూపాయే కానీ, అంతకుమందు ప్రజల పక్షాన నిలిచి వారికోసం ఉమ్మడి పోరాటం చేయకపోవడం వల్ల, వారి ఆత్రుత అంతా అధికారంకోసమే అన్న అనుమానం కలగడం సహజం.   
వాస్తవంగా ప్రతిపక్షాలు ప్రచార పర్వంలో లేవనెత్తిన సమస్యలన్నీ పాలక పక్షం టీ.ఆర్.ఎస్. పార్టీకి మింగుడు పడని విషయాలే. ఇలాటి  ఏ అంశం అయినా సమాధానం చెప్పుకోవాల్సిందే. సంజాయిషీ  ఇచ్చుకోవాల్సిందే. అంచేతే  ప్రభుత్వానికి గుణపాఠం చెప్పితీరాలనే కసి కలగకపోయినా,  ఈ మాత్రం వ్యతిరేకత చాలు, నిరుడు టీ.ఆర్.ఎస్. పార్టీకి వచ్చిన భారీ మెజారిటీని గణనీయంగా తగ్గించడానికి అనే నమ్మకం కలిగింది ప్రతిపక్షాలకు. విజయం మీద నమ్మకం లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకత పట్ల నమ్మకం పెంచుకున్న ప్రత్యర్ధులు మెజారిటీ తగ్గించగలిగితే, అదే ఓ మోస్తరు గెలుపు అనే అభిప్రాయానికి వచ్చారు. చివరికి గెలుద్దామని రంగంలో దిగిన పార్టీలు, మెజారిటీ తగ్గించడం, రెండో, మూడో స్థానం దక్కించుకోవడం ఎల్లా అనే మీమాంసలో పడిపోయినట్టయింది.
టీ.ఆర్.ఎస్. కి ఇంతటి అపూర్వ ఘన విజయం లభించడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు కొంతవరకు కారణం అయివుండవచ్చు కానీ, అసలయిన కారణం తెలంగాణా ప్రజల్లో ఇంకా అడుగంటని  భావోద్వేగం. కొడిగట్టని తెలంగాణా వాదం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే, ఒకరకంగా  టీ.ఆర్.ఎస్. పాత్ర రాజకీయంగా పరిమితమయిపోయింది. మిగిలిన రాజకీయ పార్టీల్లో అదీ ఒకటయిపోయినట్టే లెక్క. ఈ లెక్క తెలిసిన మనిషి కాబట్టే, కేసీఆర్ ‘బంగారు తెలంగాణా’ నినాదం ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే టీ.ఆర్.ఎస్. పని ముగిసిపోయినట్టు కాదనీ, కష్టపడి ఎన్నో త్యాగాలతో  సంపాదించుకున్న తెచ్చుకున్న తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మలచుకోవాలంటే టీ.ఆర్.ఎస్. ఆవశ్యకత ఇంకా ఉందన్న అభిప్రాయం జనాల్లోకి చేరేలా ఆయన చేసిన ప్రయత్నం ఈ ఉపఎన్నికలో బాగా పనిచేసింది. అదే జనాలను ఇంత  పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలకు రప్పించి వుంటుందని నమ్మే వాళ్ళు వున్నారు.   
అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్ళు  ఇవన్నీ షరా మామూలు ఆరోపణలుగా భావించే రోజులు వచ్చాయి. అధికారంలో వున్నపార్టీ అధికారాన్ని వాడుకోవడం తనకున్న సహజ హక్కుగా భావించే రోజులివి. అధికారంలో వున్నప్పుడు తాము చేసిన నిర్వాకం అదే కనుక ఏ పార్టీ అయినా  మాటవరసకు మాత్రమే  ఇలాటి ఆరోపణలు చేస్తుందే తప్ప అందులో ఎంతమాత్రం నిజాయితీ లేదని వాటికీ తెలుసు. అధికార వినియోగం తప్ప దుర్వినియోగం అనే మాటే రాజకీయ పార్టీలు ఒప్పుకోని కాలంలో మనం జీవిస్తున్నాం. అధికారంతోటి, డబ్బుతోటి, ప్రలోభాల తోటి గెలుపు సాధ్యం అయ్యేటట్టయితే, వరంగల్ తో పాటే  ఫలితం వెలువడిన  మధ్య ప్రదేశ్ ఉపఎన్నికలో అధికార బీజేపీ  పార్టీ ఎందుకు ఓడిపోతుందన్న  ఎదురు ప్రశ్న సిద్ధంగానే వుంది.
అయితే ఒకటి మాత్రం నిజం.
ప్రజలు కచ్చపట్టి పాలకపక్షాలను ఓడించిన సందర్భాలు ఎరుగుదుం. కానీ కసిబూని ప్రభుత్వాన్ని గెలిపించిన ఏకైక సందర్భం మాత్రం ఒక్క వరంగల్ ఉపఎన్నికేనేమో! 
పాలక పక్షాన్ని ఓడించాలని ప్రతిపక్షాలు అనుకుంటాయి. అలా అని ప్రజలు కూడా అనుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే వుంటుంది.
టీ.ఆర్.ఎస్. పార్టీకి  ప్రజలిచ్చిన వ్యవధానంలో ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం మిగిలే వుంది. నిరుడు ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని పాలించమని ఇచ్చిన తీర్పు కంటే , తెలంగాణా కల సాకారం అయిన తరువాత కట్టబెట్టిన ఈ ఘన  విజయం టీ.ఆర్.ఎస్.కూ, ఆ పార్టీ అధినేతకూ మరింత ప్రియమైనదీ, అత్యంత విలువయినదీ. ప్రజలపట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను మరింత పెంచే విజయం కూడా ఇది.
విజయం వినయం పెంచాలి. అపజయం అనేది విజయం కోసం చేసే మరో ప్రయత్నానికి నాంది కావాలి. రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే.
(25-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595

NOTE : Courtesy Image Owner  

21, నవంబర్ 2015, శనివారం

సమాజంపై టీవీ ప్రభావం

(నవంబర్, 21, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం)

సూటిగా.........సుతిమెత్తగా.......

ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్ళల్లో, వీధుల్లో, మాటల్లో, చర్చల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా  హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు, సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి, అక్కడినుంచి ఎకాయెకిన ఇంటిల్లిపాదీ మెదళ్ళలోకీ  జొరబడుతోంది. విశ్వవ్యాప్తంగా అల్లుకుపోయిన టెలివిజన్ చానళ్ళ వల్ల మంచి ఏమీ జరగడం లేదా అంటే పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్తితి. 
పదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. మీ ఈఅభివృద్దికి కారణం  ఏవిట’న్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి అంశానికి సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా (అలనాటి) దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  తద్వారా పొందిన మానసిక వికాసం  తరువాత జీవితంలో తమకు అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్  ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు  ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. పిల్లల మీద  ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం అన్న అంశంపై  వారు పరిశీలన  జరిపారు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో,
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట.  అరగంటపాటు హోం వర్క్ చేసుకుని, ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 
ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీఓ గంట ఆటలకీరెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ (ఆలోచించే సామర్ధ్యం)  పెరుగుతుందన్నారు. సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు.  కొత్త భాషలు, సరికొత్త  పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీల  వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు, టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారనిదౌర్జన్యకారులుగా తయారవుతున్నారనిచదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు.
ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను అదుపుచేసే విధానం వుండాలన్నారు. పిల్లలు చూసే టీవీ  కార్యక్రమాలపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
భారత రాజ్యాంగంలోని  యిరవై ఒకటవ అధికరణం ప్రజలందరికీ  జీవించే హక్కు ఇచ్చింది. రైట్  టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగాగౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు కల్పిస్తోందని , గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం  రాజ్యాంగంలోని   ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ అనేక టీవీ ఛానళ్ళు  దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు, ఆరోగ్యం, విద్య – ఈ అంశాలమీద  చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సమయం సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  ఆకర్షణీయమయిన టీవీ ప్రకటనలు చూసే పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. వాటిని చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలుసంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో,  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా అలవాటు పడిపోయారో సులభంగా  అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన,  ఈ నాడు  ప్రయివేటు టీవీ   ఛానళ్ళు కుటుంబంలో ప్రతిఒక్కరికీ  కావాల్సిన కార్యక్రమాలను నేత్రానందంగా  తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీదీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు, చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలు  కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే, తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
అలా అని టీవీ చానళ్ళ వల్ల ఎలాటి ప్రయోజనాలు లేవనే నిర్ధారణకు రావడం కూడా సబబు కాదు. సమకాలీన రాజకీయాలపట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెరగడానికి టీవీలు దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం అక్కడక్కడా అరుదుగా కానవచ్చిన టీవీలు ఈనాడు తామరతంపరగా దేశం నలుదిక్కులా అల్లుకుపోయాయి. ఇంతటి విస్తృతి కలిగిన ప్రసార మాధ్యమం కాబట్టే టీవీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేకుండా పోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోను కలిపి వేల సంఖ్యలో టీవీ నెట్ వర్కులు పనిచేస్తున్నాయి. పలు దేశాల్లో టీవీ చానళ్ళ సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టే దశను దాటిపోయింది. బహామాస్, అంటార్కిటికా, ఆండోరాలలో మాత్రమే ఒకే ఒక టీవీ ఛానల్ చొప్పున వుంది. మనదేశం సంగతి, అందులో రెండు తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర లేదు. దేశంలో రెండేళ్ళ నాటి గణాంకాల ప్రకారం 1148 టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. వీటిల్లో వందకు పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమెరికాలో సగటున రోజుకు సుమారు నాలుగు గంటలు టీవీ చూస్తుంటే మన దగ్గర రోజుకు టీవీ చూసే సమయం సగటున దానికి రెట్టింపు ఉంటోంది. జనాభా ఎక్కువ కావడం, వారిలో సరయిన పని లేని వాళ్ళ సంఖ్య  కూడా ఎక్కువగా వుండడం అందుకు కారణంగా చెబుతున్నారు. మనకంటే జనాభా ఎక్కువ వున్న చైనాలో సగటున టీవీ చూసే సమయం కొంచెం అటూ ఇటూగా రెండున్నర గంటలేనట. ఇదో వైచిత్రి. (21-11-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595