17, అక్టోబర్ 2015, శనివారం

నిత్య చైతన్యం అవసరం అంటున్న చంద్రబాబు గారు ఇది వినండి


‘నిధులిచ్చి వెళ్ళడం కాదు నిత్య చైతన్యం అవసరం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుఈరోజు విజయవాడలో చేసిన ఉద్బోధకు సంబంధించిన  స్క్రోలింగు  టీవీ తెరపై పరుగు తీస్తున్న సమయంలోనే ఇంగ్లండులో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి ఫోను చేశాడు. కాకతాళీయం కావచ్చు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రం తనకు అందిందని చెప్పాడు.
సాయికి మొదటి నుంచి స్వగ్రామం అంటే మక్కువ ఎక్కువ. నిజానికి హైదరాబాదులో ఉంటున్న మాకంటే ఇంగ్లండులో ఉంటున్న మా సాయికే మా వూరు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. ఎందుకంటె స్మార్ట్ విలేజ్ విదేశీ వాలంటీర్లలో వాడొకడు. మా ఊరుకు సంబంధించిన ఎమ్మార్వో ప్రతి గురువారం ఉదయమే మా ఊరుకు వచ్చి సాయంత్రం దాకా వుండి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిన్తుంటారు. ఆయనవద్ద  ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ వుంది. దాని సాయంతో మావాడు ఆయనతో నెట్ సంబంధం పెట్టుకుని అన్ని సంగతులు ఆరా తీస్తుంటాడు. ఆ అధికారి కూడా మా వాడు ఏది అడిగినా కాదనకుండా అన్ని సంగతులు చెబుతుంటాడు. దానికి కారణం వుంది. వూళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మావాడు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తుంటాడు. వూళ్ళో వాడు చదువుకున్న స్కూల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేర్వేరుగా మరుగు దొడ్లు కట్టించారు. ఫోను చేసినప్పుడల్లా తాజా పరిస్తితిని వూళ్ళో వాళ్ళతో చర్చిస్తుంటాడు. ఆ మాటల్లో తెలిసిందేమిటంటే   లావెట్రీలు అయితే కట్టించారు కానీ వాటిని సరిగా శుభ్రం చేసే వాళ్ళు లేరు. పేరుకు ఒక మనిషిని పెట్టారు. కానీ అతడు మండలం మొత్తంలోని అన్ని గ్రామాలను చూసుకోవాలి. పైగా అతడికి ఇచ్చేది కూడా స్వల్పం. దీనికి తోడు  అయిదారు మాసాలకోసారి చెల్లింపులు. అంచేత అతడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్తితి. అలాగే గ్రామంలో ఇతర సంక్షేమ పధకాలు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఏపనీ సకాలంలో పూర్తవడం లేదని మా వాడు గుర్తించాడు. దానితో వాడికి వాడే స్వయంగా పూనుకొని ఓ పరిష్కారాన్ని అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో వివరించాడు. డబ్బుకోసం పనులు ఆపవద్దనీ, అవసరమైన మొత్తం ఎంతో తెలియచేస్తే తాను సర్దుబాటు చేస్తాననీ, నిధులు విడుదల అయినప్పుడు తనకు తిరిగి ఇచ్చే విషయం ఆలోచించుకోవచ్చనీ వారికి చెప్పాడు. నిజంగా ఇది ఎంతో మంచి ఆలోచన. నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇతర ఎన్నారై శ్రీమంతులు కూడా ఈ విధమైన డబ్బు సర్దుబాటు కార్యక్రమానికి పూనుకుంటే ఏ మంచి పధకం కూడా నిధుల కొరతతో అరకొరగా మిగిలిపోదు.
ఇక ప్రభుత్వానికి చెప్పేదేమిటంటే స్మార్ట్ విలేజ్ పరిస్తితే ఇలా వుంటే ఆ హోదాకు నోచుకోని ఇతర గ్రామాల సంగతేమిటి?
ముఖ్యమంత్రి, అధికార సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నా కూడా ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగ మించవచ్చన్నది మావాడి మాటల్లో నాకు బోధపడింది. నిజంగా ఈ ఆలోచన గురించి విదేశాల్లో ఉంటూ జన్మ భూమికి ఏదో తపన వున్నవాళ్ళందరూ ఆలోచన చేయాలి. 
కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలవకూడదనే మనస్తత్వం కాబట్టి,  స్కూల్లో మరుగు దొడ్లను పరిశుభ్రం చేసే వాడికి బకాయిలు పెట్టకుండా పనిచేయించడానికి, అల్లాగే ఇతరత్రా కార్యక్రమాలకు మా సాయి  డబ్బు సర్దుబాటు చేసేవుంటాడు.
ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కనిపెట్టి ఆహ్వాన పత్రిక పంపారో ఏమో తెలియదు కానీ, తన పేరు మీద వచ్చిన  దాన్ని చూసుకుని వాడి సంతోషం అంతా ఇంతా కాదు.  
         

కామెంట్‌లు లేవు: