20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఎందరో మహానుభావులు – వారిలో ఒకరికి నా నమస్కారం


సెప్టెంబరు  ఇరవై – ఈ రోజున అనేకమంది పుట్టివుంటారు. వాళ్ళల్లో కొందరు పెట్టి పుట్టినవాళ్ళు వుంటారు. వాళ్ళని గురించి తెలిసిన విషయాలను తెలియని వారికి చెప్పే అనేక వ్యాసాలు గట్రా అనేక పత్రికల్లో వస్తుంటాయి. కొందరికి అలాటి ప్రచారం దొరకదు. ఎందుకంటె ప్రచారం కోసం వాళ్ళు ఏపనీ చేయలేదు కనుక.
ఈ రెండో బాపతు మనిషి ఒకాయన కూడా ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే రోజున పుట్టాడు. మాతామహుల గ్రామం కంభంపాడులో పుట్టినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం ఖమ్మం జిల్లా వల్లభి. పుట్టిన తరువాత అక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడో తెలవదు కానీ ఖమ్మం, హైదరాబాదు ఆపైన ఇంగ్లండు, ఇలా చదువుల నిమిత్తం, అలాగే ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు  గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలి పాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతి పాఠాన్ని ఆయన ఒంటపట్టించు కున్నాడు.  జీవితాంతం దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. ‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ  తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు  వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపే ‘శ్రీమంతుడు’  డాక్టర్ అయితరాజు పాండు రంగారావు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.  

(డాక్టర్ ఏపీ రంగారావు)
      


కామెంట్‌లు లేవు: