6, మార్చి 2015, శుక్రవారం

స్మృతుల మననంలో స్నేహితులు


'ఒక్క నిమిషం! గవర్నర్ గారు ఇప్పుడే వచ్చారు'
అన్నాడు తుల్జానంద్ సింగ్. తమిళనాడు గవర్నర్ రోశయ్య గారి వ్యక్తిగత కార్యదర్శి. 
'పది నిమిషాలు తీసుకోండి. పరవాలేదు' అన్నాన్నేను.
మామూలుగా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇచ్చిన అప్పాయింట్ మెంట్ సమయానికి ఇవతలవాళ్ళే సిద్ధంగా వుండాలి. అలాంటిది ఒక్క నిమిషంలో పిలుస్తానంటే 'పది  నిమిషాలు ఆగండి' అనడం ఒక రకంగా ఇబ్బందే. సింగ్ కాకుండా వేరెవరయినా అయితే వేరేవిధంగా భావించేవారు. కాకపొతే తుల్జానంద్ హైదరాబాదులో పాత తరం, కొత్త తరం జర్నలిష్టులందరికీ సుపరిచితుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి కార్యదర్శిగా పనిచేసిన వాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులకి సన్నిహితంగా మెలిగినవాడు. అన్నింటికీ మించి స్నేహధర్మం తెలిసినవాడు.
కాసేపు ఆగమనడానికి కారణం వుంది. ఈరోజు రోశయ్యగారిని కలవాల్సింది నేను కాదు. 'మేము'. ఈ 'మేము'లో నాతోపాటు మరికొందరు వయోధిక పాత్రికేయులు వున్నారు. వారికి ఆటో పట్టుకుని, అమీర్ పేటలోని రోశయ్య గారి 'గోకుల్ భవన్' చేరుకోవడానికి కొంత టైం పట్టేట్టు వుంది. మొత్తం మీద వాళ్లు వచ్చేసారు. అందరం ఒకేసారి రోశయ్య గారి గదిలో అడుగు పెట్టాం. చేతికర్ర సాయంతో నడిచివస్తున్న వీ. హనుమంతరావు గారిని అయన వెంటనే గుర్తుపట్టారు. పట్టి అన్నారు. 'హనుమంతరావు గారికంటే నేనే ఏడెనిమిదేళ్లు వయస్సులో చిన్నవాడిని' అని.
పెద్దవాళ్ళు కలుసుకున్నప్పుడు యెంత చిన్నవాళ్ళు అయిపోతారో అప్పుడు చూసాను. పాత విషయాలు వారి మాటల్లో దొర్లాయి. సాధారణంగా రాజకీయ నాయకులు కాస్త సమయం 'మించుతోంది' అనిపించినప్పుడు ఆ భావం వారి మోహంలో కనబడుతుంది. కానీ రోశయ్యగారు హాయిగా మాట్లాడుతూ పోయారు. కాసేపు కూర్చుని  హనుమంతరావు గారిని వెంటబెట్టుకుని మళ్ళీ నేనూ, మరో వయోధిక పాత్రికేయుడు వరదాచారి గారు, వీళ్ళందరికీ 'దండలో దారం' అయిన లక్ష్మణరావు గారు ఇళ్లకు మళ్ళాము. హోలీ పండగ  నాడు రంగులు చల్లుకోకపోయినా వారి మొహాల్లో ఒకరకమైన  సంతృప్తి ఛాయలు ఇంద్రధనుసు రంగుల్లా మెరిసాయి.

           

ఒక వయస్సులో వున్నవారికి కావాల్సింది నిజానికి ఇలాటి ములాఖత్తులే. (06-03-2015)

కామెంట్‌లు లేవు: