14, మార్చి 2015, శనివారం

బడ్జెట్లు వరమా? భారమా?


(Published by 'SURYA' telugu daily in it's edit page on 15-03-2015, SUNDAY)

ఒక టీవీ ఛానల్ చర్చలో  నాతొపాటు పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు, గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాలపొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్తగా  పన్నులు వేస్తే,  పాత రేటుకు కొన్న సరకుల్నే  హెచ్చు ధరలకు  అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న కాలమది. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గ్యాస్  సిలిండర్  ధరలు, పెట్రోలు రేట్లు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీల  ఖరీదులు కొండెక్కి కూర్చున్నాయా లేదా తెలుసుకోవాలనే  ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు వున్న  లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


పొతే, ఈసారి మరో విశేషం ఏమిటంటే - రెండు తెలుగు రాష్ట్రాలు, మూడు రోజుల వ్యవధిలో మూడు బడ్జెట్లు.
పది జిల్లాల తెలంగాణా రాష్ట్రానికి లక్షా పదిహెను వేల  కోట్ల రూపాయల బడ్జెట్. పదమూడు జిల్లాల ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి లక్షా పదమూడు వేల కోట్ల  రూపాయల బడ్జెట్. 'ఇదేమిటి' అనే ప్రశ్న వస్తుందనుకున్నారేమో, మరునాడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 'వ్యవసాయం'  పేరుతొ ఇంకో  ప్రత్యెక బడ్జెట్ సభకు సమర్పించి మరో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కలిపి, బడ్జెట్  అంచనాల్లో, కేటాయింపుల్లో తానూ  తక్కువ తినలేదు అనిపించింది.
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలతో మొదలయిన బడ్జెట్ అంచనాలు కాలక్రమంలో పెరిగి పెరిగి లక్షల కోట్లల్లోకి చేరుకున్నాయి. ప్రతియేటా పెరుగుతూ  పోవడం తప్పనిసరిగా తయారయింది. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక కొలమానంగా పరిగణిస్తున్నాయి. బడ్జెట్ మొత్తం యెంత గొప్పగా వుంటే అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందని నమ్మే రోజులు వచ్చాయి.
వాస్తవానికి  ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే, ప్రతి ఏటా బడ్జెట్ పై గట్టి కసరత్తే చేస్తుంది. తమ విధానాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో  కేటాయింపులు చేస్తుంది. యెంత ఖర్చు చేయాలన్నా ఎంతో కొంత రాబడి వుండాలి. ఖజానాలో చేరే రూపాయలు తగ్గిపోయి పెట్టె ఖర్చు పెరిగిపోతే అదనపు ఆదాయ వనరుల అన్వేషణ తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం అప్పులన్నా చేయాలి. లేదా పన్నులన్నా వేయాలి. మొదటిది అంటే అప్పు దొరకడం కష్టం. దొరికినా సవాలక్ష నిబంధనలు. షరతులు. ఇక రెండో వెసులుబాటు పన్నులు వేయడం. ఇది  తేలికే కాని, రాజకీయ కోణాల దృష్ట్యా కొంత ఇబ్బందికర  వ్యవహారం. కాబట్టి, అంచనాలు పెంచుకుంటూ పోయి వాటికోసం  దొరికినంత అప్పులు చేయడం, విధి లేకపోతే పన్నులు వేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. దీనికి కూడా రానురాను ' రామ్ రామ్' చెబుతున్నారు. బడ్జెట్లో పన్నులు వేయడం అన్న పద్దతికి స్వస్తి పలుకుతున్నారు. ఏడాది పొడుగునా వేయగల వీలూ చాలూ  వున్నప్పుడు వాటిని బడ్జెట్లో చూపించి లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న నిర్ధారణకు ప్రభుత్వాలు  వచ్చేసాయి.
సరే! రెండు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు వచ్చే నెల నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి జమాలెక్కలు శాసన సభలకి సమర్పించి చేతులు దులుపుకున్నాయి. ప్రతి పక్షాలు కూడా తమ శక్త్యానుసారం ప్రభుత్వ పద్దుల్ని దులపరించి,  తమ విధి తాము అవధులు మించి నిర్వర్తించాయి. దేవుడు మేలు చేసి నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో జనం తమ తల రాత మారిస్తే అప్పుడు  ఆ పార్టీలు  ఇప్పుడు చెప్పిన వాటిని మరిచిపోయి,  కాదన్న వాటినే చేసి చూపిస్తాయి. పాత్ర  మారితే,  ప్రస్తుత ప్రభుత్వాలు కూడా మారిన పాత్రలో ఒదిగిపోయి ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్నే అక్షరం పొల్లుపోకుండా వల్లె వేస్తాయి. ఇదొక  విష చక్రభ్రమణం. ఎన్ని ఏళ్ళుగానో ఏటేటా మీఎదియాలో  చూస్తున్న, పత్రికల్లో చదువుతున్న సంగతులే ఇవి.           
బడ్జెట్ అంచనాలు లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పాలకుల కంటికి ఆనడం లేదు. మిగులు రాష్ట్రం అయిన తెలంగాణాలో అంచనాలు అధికంగానే కానవస్తున్నాయి. తరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా అంకెలు కొట్టొచ్చినట్టు పెద్దవిగానే కనబడుతున్నాయి. ప్రాధాన్యతల దగ్గరే పాలక ప్రతిపక్షాలకు శ్రుతి కుదరడం లేదు. 'అంకెల గారడీ' అని విపక్షాలు విమర్శిస్తుంటే వాటి మాటల్ని 'అవగాహనారాహిత్యం'గా పాలక పక్ష సభ్యులు కొట్టి పారేస్తున్నారు. 'చెప్పింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? సరయిన వనరులు లేకుండా  ఈ అరకొర కేటాయింపులతో ఏవి సాధిస్తారు' అని ప్రతిపక్షాల ప్రశ్న. 'మనసుంటే మార్గం  వుంటుంది' అని సర్కారు వారి షరా మామూలు జవాబు.  ఇటు ఈ రాష్ట్రంలో, అటు ఆ రాష్ట్రంలో ఇదే వరస. ఇదే బాణీ. ఎక్కడో ఎప్పుడో ఈ మాటలే తామే చెప్పినట్టు అనిపించినా అవి పట్టించుకోవు.  వినేవారికి చెప్పేవారు లోకువ అంటారు. కానీ ఈ నానుడి తిరగబడింది. తమ మాటలతో, తమ పధకాలతో జనాలను ఊహాలోకాల్లో తిప్పి చూపించేవారికి చూసే జనాలు లోకువ.
రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో బడ్జెట్ పై చర్చలు ఎలా సాగుతాయో తెలియదు కానీ, టీవీ ఛానళ్ళలో మాత్రం చర్చోపచర్చలు అనుదినం సాగిపోతూనే వున్నాయి. నిన్న ఉదయం కాబోలు 'అసలు బడ్జెట్ అంటే ఏమిటి?' అని ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అడిగారు. నిజానికి బడ్జెట్లు రూపొందించి, ఆమోదించే  సభలో ఆయన సభ్యుడు.
బడ్జెట్ అంటే కొన్ని ఆలోచనలు, ఆలోచనలకు తగ్గ అంచనాలు, అంచనాలకు తగిన కేటాయింపులు. అంతటితో బడ్జెట్ పని పూర్తి చేసామని చెప్పుకోవచ్చు. అయితే, కేటాయింపులకు అనుగుణంగా  ఆ నిధులను  సకాలంలో విడుదల చేసి  ఖర్చు చేస్తున్నారా అంటే  అవునని చెప్పడం ఏ ప్రభుత్వానికయినా కష్టమే. ఆర్ధిక సంవత్సరం ముగియవచ్చే తరుణంలో హడావిడిగా నిధులు ఇబ్బడిముబ్బడిగా విడుదల చేయడం, సకాలంలో వాటిని ఖర్చు చేయలేక మురగబెట్టడం ఓ ఆనవాయితీగా మారిపోయింది.  ఖర్చు చేయనిదానికి కేటాయింపులు చేయడం ఎందుకు? కేటాయింపులు చేయలేదని, లేదా సరిగా చేయలేదని ప్రశ్నించడం ఎందుకు? అటు చూసినా, ఇటు చూసినా, అటుఇటు చూసినా అంతా  రాజకీయమే!
బడ్జెట్ ప్రసంగం పేరుతొ ప్రతి ఆర్ధికమంత్రి యాభయ్, అరవై పేజీల పుస్తకం శాసన సభలో చదవడం రివాజు. మరో రెండు పేజీలు  అదనంగా జతచేసి, నిరుడు బడ్జెట్లో, కనీసం కొన్ని ప్రధాన రంగాలకు యెంత కేటాయించారు, వాటిల్లో యెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు జోడిస్తే - లక్షల కోట్ల బడ్జెట్లకు అంకెల అలంకారంతో పాటు కొంత విశ్వసనీయత దానికి అబ్బుతుంది.        
ఉపశ్రుతి:
చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు మహేంద్రనాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్హ్దిక మంత్రిగా వుండేవారు. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా, చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.  (14-03-2015)

(bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: