11, డిసెంబర్ 2014, గురువారం

భూమంత్రం


యాభై ఏళ్ళకు పూర్వం అప్పటి కేంద్ర మంత్రి కే ఎల్ రావు గారి పుణ్యమా అని మా ఊళ్లకు కరెంటు వచ్చింది. వీధి  దీపాలే కాని,  బాగా కలిగిన కామందులు కూడా ఇళ్ళకు  కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి సంక్షేపించారు. ఆ రోజుల్లో అప్పుడే తండ్రి చనిపోయి ఇంట్లో పెత్తనం చేతికి వచ్చిన మా స్నేహితుడొకరు మొత్తం ఇంటిని  ఆధునికం చేసే పని మొదలు పెట్టాడు. పెంకుటిల్లు తీసి డాబాగా మార్చాడు. గోడలకు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న రంగులు వేయించాడు. కరెంటు కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబు లైట్లు, ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా గుండ్రటి అద్దాలు వున్న దీపాలు పెట్టించాడు.  నాలుగు బ్యాండ్ల  రేడియో కొన్నాడు. ఇంటి ముందు వసారాలో పేము కుర్చీలు వేసాడు. లోపల డైనింగ్ టేబులు, డెకొలాం మంచాలు, దోమతెరలు,  తిరగడానికి మోపెడ్ ఇలా చూస్తుండగానే వూళ్ళో వాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని కన్నుల ముందు ఉంచాడు. అంతా భేష్ అన్నారు. ఇంట్లో వాళ్ళయితే సంతోషం పట్టలేకపోయారు. ఇది ఇంటర్వెల్ ముందు కధ. ఇలాటివి ఇరవై రీళ్ళు వుండవు. షార్ట్ ఫిలిమ్స్. అలా చూస్తుండగానే ముగింపు తోసుకువస్తుంది. అదే జరిగింది. పొలాలు చూసి అప్పులిచ్చిన వాళ్ళు ఆ పొలాలమీదే కన్నేశారు. బాకీలు తీర్చడానికి వున్న ఆస్తి సున్నా అయింది. పూలమ్మిన చోట సామెత మాదిరిగా జీవితం తయారయింది. ఇంతే కావాలి, లేకపోతే ఏం చూసుకుని ఆ ఎగురుడు అని నలుగురూ నానా మాటలు అన్నారు. దాంతో నలుగురిలో తలెత్తుకుని తిరగలేక మొత్తం కుటుంబం ఓ రోజు వూరు విడిచి వెళ్ళిపోయింది.

ఇన్నేళ్ళ తరువాత ఇదెందుకు గుర్తుకు వచ్చింది అంటే -
కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్తితులు చూసి.
ఒకరి దగ్గర డబ్బుందని అంటున్నారు. మరొకరేమో 'డబ్బా అసలేలేదు ఎలానో ఏమిటో' అని పేద మాటలు చెబుతున్నారు. కానీ ఇద్దరి తరహా చూస్తె, పెట్టె ఖర్చులు చూస్తె, చేసే ఆలోచనలు చూస్తె ఆకాశాన్ని తాకుతున్నాయి. అవి నిజం కావాలంటే, వున్న డబ్బే కాదు  యెంత డబ్బున్నా ఏ మూలకూ చాలదు.
అందుకే కాబోలు ఇద్దరూ 'భూ మంత్రం' అందుకున్నారు.

చూద్దాం ఏం జరుగుతుందో!  
NOTE : Courtesy Image Owner       

కామెంట్‌లు లేవు: