1, నవంబర్ 2014, శనివారం

పక్షి ప్రేమ



అనగనగా ఓ బ్రూనై,  పేరు లాగే ఈ దేశం  చాలా చిన్నది. అయితే డబ్బులో మాత్రం మాలావు. ఆదేశపు రాజుగారు, అంటే సుల్తాను ప్రభువులవారు  మొత్తం ప్రపంచంలోనే సంపన్నుడయిన రాజు. రాచరికం ఇంకా సాగుతున్న  ఆ దేశంలో దేనికీ కొదవలేదు. ఎందుకంటె అక్కడ సముద్ర గర్భంలో ముడి చమురు నిక్షేపాలకు కొదవలేకపోవడమే. పెట్రోలుకు, డీసెలుకు  ఈ  క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) మూలాధారం. అది యెంత పుష్కలంగా లభిస్తుందంటే  వరసగా నాలుగు రోజులు ఎండ కాసిందంటే చాలు  నేల మీద పచ్చగడ్డి దానంతట  అదే అంటుకుని తగలబడిపోతుందట. అలాటి ప్రమాదాలు జరక్కుండా చూడడానికే  భగవంతుడు ఆ దేశంలో ఎప్పుడూ వానలు కురిపిస్తుంటాడు.
సరే! ఈ బ్రూనై కధ ఎందుకంటె అక్కడ ఓ తెలుగు కుటుంబం కాపురం ఉంటోంది. ఒక్కటే కాదు చాలా తెలుగు కుటుంబాలు, ఆ మాటకి వస్తే భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఆ దేశంలో నివసిస్తున్నారు. ముందు చెప్పిన కుటుంబంతో ముఖ పరిచయం లేకపోయినా ముఖ పుస్తక పరిచయం చాలా రోజులుగా వుంది. ధూళిపూడి రాం ప్రసాద్ గారు  కాకినాడ వాస్తవ్యులు.  డిజైన్ ఇంజినీరు. ఆఫ్ షోర్ క్రూడాయిల్ డ్రిల్లింగులో రాం ప్రసాద్ గారి పాత్ర కూడా ఎంతో కొంత వుండే వుంటుంది. వారక్కడ ఒకింట్లో అద్దెకు వుంటున్నారు. జన సాంద్రత తక్కువ కాబట్టి అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించరు. ఒకటి రెండు అంతస్తుల ఇళ్ళే ఎక్కువ. ఆయనది  పై పోర్షన్. ఇంటి యజమానులు కింద వుంటారు. మంచి మనుషులు కాబట్టి ఇంటి యజమాని కుటుంబంతో బాగా కలిసిపోయారు. ఇలా హాయిగా రోజులు గడుస్తున్న సమయంలో ఓ పక్షి జంట తమకు తాముగా ఆ ఇంటికి వచ్చి మంచి ముహూర్తం చూసుకుని  గృహ ప్రవేశం చేసింది.  మెట్లకింద, ట్యూబు లైట్  మీద జాగా చూసుకుని ఏకంగా ఓ  గూడుకట్టుకుని కాపురం పెట్టింది. చూస్తుండగానే పక్షి సంసారం పెరిగింది. గుడ్లు పెట్టడం పొదగడం జరిగిపోయింది. నల్లటి ఆకారంలో వుండే ఆ పక్షులు ఏజాతివో కూడా  రామప్రసాద్ గారికీ వారి భార్యకూ తెలవదు. మెట్లు ఎక్కేటప్పుడూ, దిగే టప్పుడూ వాటితో మొదలయిన అవినాభావ సంబంధం బాగా పెరిగిపోయింది. సంసారం పెరగడంతో గూడు సరిపోలేదు. గూడు పిల్లలకు ఇచ్చి తల్లి పక్షి, తండ్రి పక్షి ట్యూబ్ లైట్ పై కాలక్షేపం చేయడం చూసి రాం ప్రసాద్ దంపతులు ముచ్చట పడ్డారు.  పక్షులు కూడా  ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాయి. అసలు సమస్యల్లా 'స్వచ్ఛపరిసరాల' నినాదంతో వచ్చింది. పక్షులకు గూడంటూ దొరికింది కానీ వాటికి విడిగా లెట్రిన్ సౌకర్యం లేకపోవడంతో అవి యధేచ్చగా వున్నచోటునుంచే కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలెట్టాయి. అవి వేసే రెట్టలు ఇంటి యజమానురాలికి  చిరాకు తెప్పించాయి. మెట్ల నిండా రెట్టలు కనిపిస్తుంటే ఎవరికి మాత్రం కోపం రాదు. 'అదంతా ఎవరు శుభ్రం చేస్తారు' అని లా పాయింటు తీసి, ముందు ఆ పక్షి గూడును అక్కడినుంచి  తక్షణం తీసివేయాల్సిందే అని హుకుం జారీ చేసింది. పక్షుల మీద అకార  మమకారం పెంచుకున్న రామప్రసాద్ దంపతులు సుతారమూ దానికి వొప్పుకోలేదు. పక్షుల రెట్టల్ని శుభ్రం చేసే బాధ్యతను రామప్రసాద్ గారి భార్య స్వచ్చందంగా తలకెత్తుకోవడంతో సరిహద్దు వివాదం చల్లారి పోయింది.
కింద ఫోటోలో కనిపించేదే ఆ పక్షి గూడు. వాటిని ఎవరయినా గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి.





NOTE : Photo Courtesy Shri Dhulipudi Ramprasad



2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు ఏచిన్న విషయాన్నైనా ప్రపంచంలో, భారత దేశంలో ప్రస్తుత వార్తలకు జోడించి చాలా 'ఇంట్రెస్టింగ్'గా మలచగలరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత - ధన్యవాదాలు