16, ఆగస్టు 2014, శనివారం

ప్రత్యేకతలతో సాగిన ప్రధాని ప్రసంగం


(17-08-2014 - ఆదివారం సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో ప్రతియేటా ప్రతి ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట బురుజులపై నుంచి  పంద్రాగస్త్ట్ ప్రసంగాలు చేస్తూ వస్తూనే వున్నారు. ఇది కొత్తవిషయమేమీ కాదు. కానీ ఈసారి  ప్రధాని హోదాలో తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన తరువాత నరేంద్ర మోడీ  చేసిన ప్రసంగంలో అనేకానేక  విలక్షణ  లక్షణాలు  కానవచ్చాయి. గతంలోని జవహర్ లాల్ నెహ్రూ సాదాసీదా రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. విచిత్రం ఏమిటంటే మోడీ  మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా నెహ్రూ ప్రస్తావన తీసుకురాకపోవడం. పైపెచ్చు ఆయన కాలంలో ఏర్పడ్డ  ప్రణాలికా సంఘానికి కాలం చెల్లి పోయిందంటూ  ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రతిపాదన తెర మీదకు తీసుకు రావడం. మళ్ళీ అదే సమయంలో మహాత్మా గాంధీ,  వల్లభాయ్  పటేల్ వంటి కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్లు సంస్మరించుకోవడం. అంతే కాకుండా భారత దేశం ఇంతవరకు  సాధించిన అభివృద్ధిలో మునుపటి  ప్రభుత్వాల  పాత్ర వుందంటూ ప్రసంశల వర్షం కురిపించడం.




ప్రధానమంత్రి ప్రసంగంలో మాత్రమే కాకుండా ప్రసంగించిన తీరులో కూడా వైవిధ్యం కనబరిచారు. దశాబ్దాల తరబడి ప్రజా ప్రతినిధులను ప్రజలనుంచి వేరు చేస్తున్న సెక్యూరిటీ విధానాలకు స్వస్తి చెప్పి, బుల్లెట్ ప్రూఫ్ అద్దాల అడ్డుగోడలను తొలగించారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్నది తమలో ఒకడే అనే భావన జనాల్లో కలిగేలా తన వేషధారణ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. అధికారులు రాసి ఇచ్చిన ప్రసంగం ప్రతిని వల్లె వేసే పాత పద్దతికి భరతవాక్యం పలికి ఆశువుగా ప్రసంగించడం మరో విశేషం. 'ప్రధాన మంత్రిగా కాదు, ప్రజాసేవకుడిగా మీముందుకు వచ్చాను' తరహా మాటలతో ప్రజానీకం మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
ప్రధానమంత్రిగా తన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు  వివరించే సంప్రదాయాన్ని ఒక పక్క పాటిస్తూనే, ప్రధాని హోదా కలిగి వ్యక్తి  -  స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భాలలో చేసే అధికారిక సందేశ ప్రసంగంలో  ఇంతటి అత్యల్ప స్వల్ప విషయాలను కూడా ప్రస్తావిస్తారా  అని పరిశీలకులు ముక్కు మీద వేళ్ళు వేసుకునే రీతిలో -   'కుటుంబాల్లో ఆడపిల్లల్ని  ఆడామగా తేడా లేకుండా వారిని ఎలా పెంచాలి?'  అనే అంశాలను కూడా జోడించడం  మరో ప్రత్యేకత. మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ, 'ఆడశిశువులను గర్భంలోనే చిదిమివేసే దుష్ట సంస్కృతికి మంగళం పాడాల'ని ఆయన తలితండ్రులకు విజ్ఞప్తి చేసిన తీరు  మరీ   ప్రత్యేకతను సంతరించుకుంది.  ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని, శారీరక ఆరోగ్యాన్ని  వారి విద్యార్జనతో ముడిపెడుతూ 'ప్రతి పాఠశాలలో మరుగు దొడ్ల సౌకర్యం' ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఒక్క ఏడాదికాలంలో ఈ కార్యక్రమాన్ని  అమలుచేయడానికి వీలైన రోడ్ మ్యాప్ కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.  ఇందుకోసం ప్రతి పార్ల మెంటు సభ్యుడు తన నియోజకవర్గం అభివృద్ధి నిధులనుంచి తగిన మొత్తాలను ఖర్చు  చేయాలని సూచించారు. ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చూపే శ్రద్ధను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చూపితే 'పరిశుద్ధ భారతం'గా దేశాన్ని  తయారుచేయడం అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చిన్న చిన్న అంశాలు కూడా ప్రధాని స్వతంత్ర దినోత్సవ సందేశంలో  చోటుచేసుకోవడం సహజంగానే ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక విమర్శనావకాశాన్ని అందించినట్టయింది.
'అతి సాధారణ అంశాలకు పరిమితం అయిన ప్రధాని ప్రసంగంలో దార్శనికత కొరవడింద'ని కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ  ప్రభ్రుతులు పెదవి విరిచారు. 'ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తే పధకాలను  అమలుచేసేది ఎవరు,  పర్యవేక్షించేది ఎవర'ని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి  ఆక్షేపించారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, బీజేపీయేతర   రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం మోడీ ప్రసంగం, మంచి  ఉత్సాహాన్ని ఇచ్చి వుంటుంది. సమాఖ్య స్పూర్తిని గౌరవించాలన్న ఆయన పలుకులు వారికి కర్ణపేయంగా వినబడివుంటాయి. ప్రభుత్వాలకు   మెజారిటీ వున్నాకూడా  అందరినీ కలుపుకుపోతూ ఏకాభిప్రాయాన్ని సాధించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుని   సత్ఫలితాలను  సాధించవచ్చని  మోడీ   చెప్పారు. తద్వారా  కేంద్రం అత్తగారి పెత్తనానికి  తన హయాంలో  కాలం చెల్లిపోయినట్టే అన్న అభిప్రాయం  కలిగించారు. అధికారమనేది  రాజకీయాలకు వేదిక కాదనీ, జాతి నిర్మాణ సాధనకు అది ఒక మార్గమనీ మోడీ హితవు పలికారు.
'నేను పనిచేస్తాను, మీరూ పనిచేయండి' అని ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం  చేసారు. నూటపాతిక కోట్లమంది జనం చేయీ చేయీ కలిపి పనిచేస్తే  ప్రపంచంలో భారత దేశానికి ఇక తిరుగే ఉండదని అన్నారు.
కొంత రాజకీయ కోణం ప్రధాని  ప్రసంగంలో కానవచ్చినప్పటికీ, మొత్తం మీద ప్రజలను ఆకట్టుకునే రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. మోడీ ప్రసంగిస్తున్నప్పుడు వినవచ్చిన చప్పట్లే  దీనికి  నిదర్సనం.
యావత్ ప్రపంచం గుర్తింపు పొందే విధంగా బ్రాండ్ ఇండియా తయారుచేయాలన్న మోడీ లక్ష్యం నెరవేరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తె ప్రజలకు కావాల్సింది ఇంకా  ఏముంటుంది.  

కామెంట్‌లు లేవు: