26, జులై 2014, శనివారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 6


వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి  పరిపాలనాదక్షుడు అనే మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐ..ఎస్. అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి,  గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు చాలామంది పనిచేసినా,  వారిలో ఎక్కువకాలం చెన్నారెడ్డి గారితో  వున్నది పరమహంస గారే.  రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్  ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ.ఆర్.వొ. గా,   సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. చెన్నారెడ్డి గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు - హషీం, సరోజినీ పుల్లారెడ్డి, రోడామిస్త్రీ వీరిలో ముఖ్యులు -  మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన్ని అంటిపెట్టుకునే తిరిగేవారు.  దాంతో,  సీఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది.


(మర్రి  చెన్నారెడ్డి) 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే  రెండోసారి పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు. (ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: