15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 3


గవర్నర్ నరసింహన్ గారు వీఐపీ సిఫారసు లేఖలపై ఆక్షలు విధించడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఇత్యాది కారణాల చేత తిరుమలలో రద్దీ తగ్గే అవకాశం, సామాన్య జనాలకు దైవ దర్శనం సులభంగా జరగగలదన్న ఆశాభావం జనాల్లో కలిగింది.  దానికి తోడు టీవీల్లో 'తిరుమలలో రద్దీ ఓ మోస్తరు' అని స్క్రోలింగులు, తిరుపతిలో దిగగానే హోటళ్ళలో వేచి వుండే పని లేకుండా కాఫీ పలహారాలు చేయడానికి సీట్లు దొరకడం ఇవన్నీ ఆశల్ని మరింత చిగురింపచేసాయి. కానీ పైన కొండ మీద పరిస్థితులు షరా మామూలే! పైన తిరగడానికి అనువుగా వుంటుందని కింద నుంచి ప్రైవేటు టాక్సీ తీసుకు వెడితే అణువణువునా ఆంక్షలే. మొక్కుబళ్ళు  తీర్చడానికి బయలుదేరితే ముందుకు పోవడానికి వీల్లేదని ట్రాఫిక్ పోలీసు చెయ్యి అడ్డం పెట్టాడు. ఓ యాభయ్ ఇవ్వండని మా డ్రైవర్ అడిగి తీసుకుని ఇవ్వడానికి వెడితే అతగాడు తన  పక్కన వున్నవాడి వైపు సైగ చేసాడు. అతడి కలెక్షన్ ఏజెంటు చేతిలో డబ్బు పడగానే 'అడ్డం పెట్టిన పోలీసు చెయ్యి' మా కళ్ళ ముందే కిందికి దిగిపోయింది. తల నీలాలు ఇవ్వడానికి ఎస్వీ గెస్ట్ హౌస్ వద్దకు వెడితే, అక్కడ క్షురకులు ఖాళీగానే వున్నారు కాని  కింద నుంచి టోకెన్ తెమ్మన్నారు. కారు లేకపోతే ఆ ఎండలో  ఇంతే సంగతులు. అంతకుముందే  డబ్బులు చేతిలో పడ్డాయి కాబట్టి పోలీసు కిమ్మనలేదు.



ముందే చెప్పినట్టు అందుబాటులో వున్న టెక్నాలజీని వాడుకుంటున్నారే కాని, యాత్రీకుల కోణం నుంచి కాదు. భక్తులు కొండ మీదకు రాగానే అన్నీ ఒకే  గొడుగు కింద - పదే పదే పది చోట్లకు తిరగకుండా వున్న కంప్యూటర్ల వ్యవస్థను సమర్ధవంతంగా యెందుకు ఉపయోగించుకోరో అర్ధం కాదు. రూము ఖాళీ చేసి డిపాజిట్ డబ్బు తిరిగి తీసుకోవాలంటే రిఫండ్ రసీదు ఇచ్చే కౌంటర్ ఒకటయితే, డబ్బు తీసుకోవాల్సిన కౌంటర్ మరొకటి. రెండు చోట్లా క్యూలో నిలబడాలి. లడ్డూ టోకెన్ తీసుకునే కౌంటర్ ఒకటయితే, వాటికి కావాల్సిన సంచీ కొనాలంటే మరో కౌంటరు కు వెళ్ళాలి. మళ్ళీ క్యూలో నిలబడాలి. తోడు లేకుండా వెళ్ళే వృద్ధుల కష్టాలు చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది.   యాత్రీకులకు సేవ చేయడం కోసం ఉద్యోగులను నియమిస్తున్నారో, ఉద్యోగులను నియమించడం కోసం ఉద్యోగాలు సృష్టిస్తున్నారో అర్ధం కాదు. ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త  మాల్తూసియన్   కొత్త ఉద్యోగాల సృష్టికి ఏనాడో ఒక సూత్రం చెప్పారు. " గొయ్యి తవ్వించు.  ఆ గోతిని పూడ్పించు". అంటే ఏమిటన్నమాట.  గొయ్యి తవ్విన వాడికి ఓ ఉపాధి. పూడ్చిన  వాడికి మరో ఉపాధి.అలావుంది. టీడీడీ వ్యవహారం.

(ఇంకా వుంది)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

గోవింద నామాలు మాత్రమే వినపడాల్సిన చోట "జై జగన్" అనే అప్రాచ్యపు కూతల్ని సహిస్తున్నప్పుడే, జగన్ అనే దున్నపోతు చెప్పు లేసుకుని పచార్లు చేస్తుంటే వాడి చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నప్పుడే అనుకున్నా ఇక తిరుపతి వెళ్ళఖ్ఖర్లేదని?!