26, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి సేతురా లింగా !


ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నేకోరగనేల? కోరితినిబో యాతండు రానేల?
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల?
ట్టెనుబో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్


కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో వివిధ పార్టీల పరిస్థితి. 
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి 
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే - 
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.


పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా - 
లోలోపల ఏదో తెలియని గుబులు వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి! 
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే! 
ఆ నాడు సర్కారు ఎక్స్ ప్రెస్ కాస్త  లేటుగా వచ్చి – నా  పెళ్ళి చూపులకు మీరు మరికాస్త ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో. 
అలాగే - భవనం వెంట్రామ్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు, సహాధ్యాయి అయిన   ఎన్‌. టీ. రామారావు గారిని  రాజభవన్‌కు ఆహ్వానించకపోయి వున్నా, లేదా వెంకట్రామ్‌ గారి సలహా మేరకు రామారావుగారికి  కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వున్నా  - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ పండితుడు. 
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించి  వుండేదే కాదు పొమ్మన్నాడు.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జగన్ మోహన రెడ్డి కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం కాకపోయినా ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ గా వేసివున్నా  రాష్ట్రంలో రాజకీయ పరిస్తితి మరో రకంగా వుండేదని ఇంకో పరిశీలకుడు అభిప్రాయపడ్డాడు.
కుంతి పడ్డ మధనం కూడా ఇలాటిదే.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది 
ఆదీ అంతం అంటూ లేని ఆ వేదాంతం చెప్పేదేమిటంటే -  
‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’
రోట్లో తలదూర్చిన తరువాత రోకటి పోటుకు వెరవకూడదు.

ఈ సూత్రం పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుంది.

(26-09-2013)

కామెంట్‌లు లేవు: