15, సెప్టెంబర్ 2013, ఆదివారం

కోపం వచ్చినప్పుడు గొంతు యెందుకు పెరుగుతుంది?



గురువు గారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. పనిలో పనిగా జ్ఞానబోధ చేస్తున్నారు.
గురువు అడిగారు “ కోపం వచ్చినప్పుడు స్వరం యెందుకు పెరుగుతుంది? పక్కన వున్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గొంతు పెంచాల్సిన అవసరం యేముంటుంది?”
శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియక.
గురువుగారే చివరకు వివరించారు.
“ఇద్దరు వ్యక్తులకు ఒకరి మీద మరొకరికి పట్టరాని కోపం వచ్చినప్పుడు వారి హృదయాల నడుమ దూరం పెరుగుతుంది. ఆ దూరం కారణంగా  తాము చెప్పేది ఎదుటివాడికి వినబడదేమో అన్న అనుమానంతో  స్వరం పెంచుతారు. కోపం పెరిగిన కొద్దీ దూరం పెరుగుతుంది. దూరం పెరిగిన కొద్దీ మాటల్లో తీవ్రత పెరుగుతుంది”
గురువు గారు తాను చెప్పదలచుకున్నదాన్ని కొనసాగించారు. శిష్యులు మనసు పెట్టి వింటున్నారు.
“ఎప్పుడన్నా ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే తరహా గమనించారా! చాలా నెమ్మదిగా, మృదువుగా వారి సంభాషణ సాగుతుంది. ఎందుకంటే వారు మానసికంగా దగ్గరగా వుంటారు. అందువల్ల పెద్దగా అరిచినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం వారికి వుండదు.
“వారి నడుమ ప్రేమ మరింత బలపడిందనుకోండి. వారి నడుమ సాన్నిహిత్యం కూడా  మరింతగా పెరుగుతుంది. హృదయాలు మరింత దగ్గరవుతాయి. దాంతో వారి మధ్య మాటలు గుసగుసలాడుకున్నట్టుగా సాగుతాయి.
“అంటే  ఏమిటన్న మాట. కోపం లేకపోతే స్వరం పెరగదు. కోపం లేని వ్యక్తుల నడుమ సంభాషణ మాట్లాడుకున్నట్టుగా  వుంటుంది. పోట్లాడుకున్నట్టు వుండదు.
“వాదనలు చేసుకునేటప్పుడు దీన్ని మరింత గమనంలో పెట్టుకోవాలి. మీ మాటల్లో ప్రేమ తొణికిసలాడితే ఎదుటివాడి పలుకుల్లో కూడా పదును తగ్గుతుంది.
“వాదనల్లో వాడే పదాలతో హృదయాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడితే మీకు కోపం అనేదే రాదు. వచ్చినా ఎదుటి వ్యక్తిని శాశ్వితంగా దూరం చేసుకునేంతగా మీ  స్వరం పెరగదు”

గురువుగారు ఆనాటికి పాఠం ముగించారు. శిష్యులు తమ జీవితాలకు ఉపయోగపడే కొత్త పాఠం ఒకటి ఆనాడు  నేర్చుకున్నారు. (15-09-2013)

1 కామెంట్‌:

Rao S Lakkaraju చెప్పారు...

కొత్త సంగతి తెలుసుకున్నాను. బాగుంది.