30, సెప్టెంబర్ 2013, సోమవారం

రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి!


ఏటా గోదారి వొడ్డున జరిగే సంతకు వెళ్లడం అచ్చయ్యకు  అలవాటు. ఒక ఏడాది కొత్తగా కాపురానికి వచ్చిన తన పెళ్ళాం  బుచ్చమ్మను కూడా వెంట తీసుకు వెళ్లాడు..
గోదారి నదిలో లాంచి షికారు చేయాలని బుచ్చమ్మ ఉబలాటం.
‘వామ్మో ఇంకేమైనా వుందా. రూపాయి టిక్కెట్టు. రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి’ అని  అచ్చయ్య  సన్నాయి నొక్కులు.
మరుసటి ఏడూ ఇదే కధ. లాంచి ఎక్కాలని బుచ్చమ్మ. వామ్మో రూపాయి టిక్కెట్టు వద్దని అచ్చయ్య.
ఇలా ఏండ్లు గడిచిపోతున్నాయి కాని బుచ్చమ్మ లాంచి షికారు కోరిక తీరకుండానే వుండిపోయింది.
మళ్ళీ  తిరుణాల రోజులు వచ్చాయి. అచ్చయ్య, బుచ్చమ్మను తీసుకుని వెళ్లాడు.
లాంచీ కనబడగానే బుచ్చమ్మ అడిగింది  మొగుడ్ని.
‘ నాకు డెబ్బయ్ ఏళ్ళు వచ్చాయి కాని,  లాంచి ఎక్కాలన్న చిన్నప్పటి కోరిక మాత్రం  తీరనే లేదు. ఈ ఏడాదన్నా ఎక్కిస్తావాలేదా!’
‘వామ్మో! రూపాయి పెట్టి ఆ లాంచి ఎక్కడం ఎందుకే. వొడ్డున కూర్చుని చూస్తే సరిపోదా! రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి!’ మళ్ళీ పాత పాటే కొత్తగా పాడాడు అచ్చయ్య.
లాంచీ నడిపే సరంగు మొగుడూ పెళ్లాల మాటలు విన్నాడు.
‘రూపాయి టిక్కెట్టు కొంటే మీ ఇద్దర్నీ లాంచి ఎక్కిస్తాను. కాని ఓ షరతు. తిరిగి వచ్చిందాకా మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు మెదపకూడదు. నోరు తెరిచారంటే ఓ రూపాయి ఎక్కువ వసూలు చేస్తాను’
ఇద్దరూ ఆ షరతుకు వొప్పుకుని లాంచీ ఎక్కారు. ఎక్కిన దగ్గరనుంచి మూగనోము పట్టారు. నోరు తెరిస్తే వొట్టు. భార్య పొరబాటున నోరు విప్పితే రూపాయి డబ్బులకు నీళ్ళు వొదులుకోవాలని  అచ్చయ్య  భయం.
వాళ్లని మాటల్లో పెట్టి మాట్లాడించాలని సరంగు విశ్వప్రయత్నం చేసాడు. బోటును నదిలో గింగిరాలు కొట్టించాడు. కానీ, ఇద్దరూ  కిమ్మిన్నాస్తి.
లాంచి దిగిన తరువాత సరంగు అచ్చయ్యను  అడిగాడు అంత మౌనంగా ఎలావున్నారని.
‘మధ్యలో బుచ్చమ్మ నదిలో పడిపోయింది. అప్పుడు అరచి చెబుదామనుకున్నాను. కానీ, రూపాయంటే రూపాయే!  రూపాయంటే మాటలా మరి’
సరంగుకు నోట మాట పడిపోయింది.

(ఈ ఇంగ్లీష్ కధని పంపిన మోచర్ల కృష్ణమోహన్ గారికి కృతజ్ఞతలు)

దిల్ మాంగే మోర్



రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
‘ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను’ అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
‘రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో’
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు’
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
‘పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.’
‘సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి’
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
‘ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను’
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
‘మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి’
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
‘రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా’
మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
‘దిల్ మాంగే మోర్’  

(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

మళ్ళీ జరిగిన నా పెళ్లి


అరవై ఎనిమిదో ఏట నాకీ సాయంత్రం మరో  పెళ్ళిచేశారు. అదీ మా ఆవిడ సమక్షంలో.
ఈ పుణ్యం కట్టుకుంది ఎవరో కాదు, మా మేనకోడలి మొగుడు రాంపా గారు. రాయడం, రాసిన వాటిని పుస్తకాలు వేయడం వాటిని బంధు మిత్రుల సమక్షంలో ఆవిష్కరించడం అన్నీ ఓ వేడుకగా జరుపుకోవడం ఆయనకో సరదా. కానీ ఈసారి ఆయనకు యెందుకు అనిపించిందో తెలియదు కాని  మాట మాత్రం ముందు  చెప్పకుండా తెలిసిన నలుగుర్నీ  పిలిచి  ఆయన తాజాగా రాసిన ‘కొస విసుర్లు’ ఓ పుస్తకాన్ని నాకు ఏకంగా  అంకితం ఇచ్చేసాడు. పుస్తకాలు అంకితం తీసుకోవడానికి నేను చిన్న సైజు భోజరాజును, కృష్ణదేవరాయల్నీ కాదు. అయినా నన్నే యెందుకు ఎన్నుకున్నట్టు. ఎన్నుకొనెనుబో, ఆ వేడుకను ఓ పెళ్లి మాదిరిగా జరిపి మా దంపతులతో ఏడడుగులు నడిపించి తన కావ్య కన్నికను నా చేతిలో పెట్టి సలక్షణంగా అంకిత మహోత్సవాన్ని నిర్వహించడం యెందుకు. యెందుకు అంటే ఏం చెబుతాం. రాంపా గారి తీరే అంత.


మొత్తానికి ఏమయితేనేం నాలుగు దశాబ్దాల క్రితం  తిరుపతిలో  జరిగిన నా గుళ్ళో పెళ్లిని  ఎవరు చూడలేకపోయారు కాని ఈ రోజు ‘నవ్య’ వారపత్రిక  సంపాదకులు జగన్నాధ శర్మ గారితో సహా రాతల్లో, గీతల్లో చేయి తిరిగిన చాలామంది రచయితలు, కార్టూనిస్టులు అయిన ఘనాపాఠీలు  సాక్షి సంతకాలు చేశారు. అంటే ఈ తతంగానికి ప్రత్యక్ష సాక్షులు అన్నమాట. ఎవరెవరని చెప్పుదు అందరినీ. కానీ వారిలో కొందరు ఎవరయా అంటే- సినీ ప్రముఖులు జనార్ధన మహర్షి, అల్లాణి శ్రీధర్, రచయితలు కవనశర్మ, జీ ఆర్ మహర్షి, పొత్తూరి విజయలక్ష్మి, చిల్లర భవానీ దేవి, శంకర నారాయణ, జేఎల్ నరసింహం, కార్టూనిష్టులు సుభానీ, సరసి, లేపాక్షి, బాచీ, అరుణ్, కృష్ణ, అన్వర్, పినిశెట్టి,  వరంగల్ నుంచి తీరిక చేసుకుని వచ్చిన క్షణం తీరుబడిలేని డాక్టర్ అంజనీదేవి.    
అప్పటి అసలు పెళ్ళికి ఫోటోలు ఎట్లాగు లేవు. ఈ పెళ్లి ఫోటోలన్నా రేపు పోస్ట్ చేస్తారేమో చూడాలి.
షరా మామూలుగానే, ఆవిష్కరణ కార్యక్రమం రాంపా స్టైల్ లోనే జరిగింది. స్టేజి మీద ఓ చిన్న సైజు  గిలక  బావి సెట్టింగు పెట్టారు.  అందులోనుంచి జగన్నాధశర్మ  గారు, సభికుల కరతాళధ్వనుల నడుమ  చేంతాడుతో ‘కొస విసుర్లు’ పుస్తకాన్ని లాగి బయటకు తీశారు.


ప్రసంగాలు లేవు కాని ముచ్చట్లు చెప్పమన్నారు. అవి కూడా ఓ మోస్తరు ఉపన్యాసాల మాదిరిగానే సాగాయి. కాకపొతే వక్తలు మరికాసేపు మాట్లాడితే బాగు అన్నట్టుగా పసందుగా వున్నాయి.  ‘నవ్వుల సాయంత్రం’  అన్న రాంపా ఉద్దేశ్యం నెరవేరినట్టే అనిపించింది.
వచ్చిన సభికుల పేర్లతో చీటీలు రాసి డ్రా తీసి ఎనిమిది మందికి రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలను గుర్తుకు తెస్తూ చిన్న చిన్న ఇత్తడి ఏనుగు ప్రతిమలను బహుకరించడం కొసమెరుపు.

(29-09-2013) 

28, సెప్టెంబర్ 2013, శనివారం

బాబోయ్ హెచ్చార్!


ఉద్యోగంలో చేరి రెండేళ్లు కావస్తోంది. ప్రమోషన్ సంగతి దేవుడెరుగు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అలా  అనుకుని, అడగాలనుకుని  హెచ్ ఆర్ మేనేజర్ దగ్గరకు వెళ్లాను. వెళ్ళి ముసిముసి నవ్వొకటి విసిరి మనసులో మాట బయట పెట్టేలోగా ఆయనే ఒక మందహాసం పారేసి కుర్చీలో కూర్చోబెట్టి బాంబు లాటి కామెంటు ఒకటి నా మొహం మీదే పేల్చాడు.
‘చూడండి సుందరరావు గారు మీరు ఆఫీసుకు రాకుండానే జీతం తీసుకుంటున్నారట’
నాకు నోటమాట రాలేదు. ఇదేమిటి ఇలా ఎదురు వచ్చాడు.
మేనేజర్ మళ్ళీ  అడిగాడు
‘చూడండి సుందరరావు గారు ఏడాదికి ఎన్ని రోజులు?’
ఓ పక్క వొళ్ళు మండుతున్నా నెమ్మదిగా జవాబిచ్చాను
365 లేదా కొన్ని సార్లు 366
‘అవునా! మరయితే రోజుకు ఎన్ని గంటలు?’
అందుకే అంటారు  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని. ఏం చేస్తాను? పని నాది కదా, ఓపక్క నోరు నొక్కుకుని  మరో పక్క నోరు తెరిచి చెప్పాను.
24 గంటలు’
‘అవునా! మరి మీరు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు?’
‘ఉదయం పది నుంచి  సాయంత్రం ఆరుగంటల దాకా. అంటే ఎనిమిది గంటలు’
‘అవునా! అంటే  ఏమిటన్న మాట. రోజుకు 24  గంటల్లో మీరు పనిచేసేది మూడో వంతు’
(అవునొరేయ్ అవును)  
‘ఏడాదికి  366 రోజుల్లో మూడో వంతు అంటే యెంత 122రోజులు అవునా!’
(అవునొరేయ్ అవున్రా!)
‘మీరు పనిచేసేది వారానికి అయిదు రోజులు. శనాది వారాలు ఆఫీసుకి  రారు’
‘అంటే ఏమిటన్నమాట. 52  ఆదివారాలు, 52 శని వారాలు. మొత్తం 104  రోజులు ఆఫీసు మొహం చూడరు’
‘సరే! ఇందాకటి  122 రోజులనుంచి ఈ 104  తీసేస్తే మిగిలినవి ఎన్ని?’
(నాబొంద నీ శ్రాద్ధం)  
అలా నీళ్ళు నమలడం కాదు. నేను చెప్పేది వినండి. ఇవికాక ఏడాదికి రెండువారాలు,  రోగం రొస్టు అంటూ సిక్  లీవులు.    ఆ 14 తీసేస్తే మిగిలేవి నాలుగు రోజులు’

ఇక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, జనవరి ఫస్ట్, దీపావళి పండుగలకి  ఎట్లాగు  రారు.
‘అంటే ఏమిటన్నమాట. మీరు సంవత్సరంలో ఒక్క రోజు కూడా పనిచేయడం లేదన్నమాట. అంటే ఏమిటి అర్ధం. ఆఫీసులో  ఏపనీ చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటున్నారన్న మాట. ఎట్లాగు వచ్చారు కదా!ఇప్పుడు చెప్పండి  నన్నేం  చెయ్యమంటారో.  పనిచేయని కాలానికి తీసుకున్న డబ్బుల్ని  ఇకనుంచి ఎన్ని వాయిదాల్లో మీ నెల జీతం నుంచి పట్టుకోమంటారో చెప్పి మరీ  వెళ్ళండి.’
తోక మాట: ప్రత్యేకంగా చెప్పేదేవుంది. ఇది కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎత్తిపోతే!

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

రాజకీయ ఊసరవెల్లులు


“అప్పుడలా అని ఇప్పుడలా మాట్లాడడానికి సిగ్గువేయడం లేదా!”
“అదేమాట నిన్ను నేనూ అడుగుతున్నాను. నిన్న గాక మొన్న నువ్వు మాట్లాడినదేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమిటి? రంగులు మార్చడం కాకపొతే ఇదేమిటి?”
“నేనూ అదే అనేది.  మీ అసలు రంగు బయట పడిందని అంటున్నాను”
ఈ సంభాషణ అనంతం. నిరంతరం సాగిపోతూనే వుంటుంది, జీవనది మాదిరిగా. (27-09-2013)



NOTE: Courtesy Image Owner 

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?


మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా?? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?

26, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి సేతురా లింగా !


ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నేకోరగనేల? కోరితినిబో యాతండు రానేల?
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల?
ట్టెనుబో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్


కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో వివిధ పార్టీల పరిస్థితి. 
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి 
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే - 
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.


పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా - 
లోలోపల ఏదో తెలియని గుబులు వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి! 
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే! 
ఆ నాడు సర్కారు ఎక్స్ ప్రెస్ కాస్త  లేటుగా వచ్చి – నా  పెళ్ళి చూపులకు మీరు మరికాస్త ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో. 
అలాగే - భవనం వెంట్రామ్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు, సహాధ్యాయి అయిన   ఎన్‌. టీ. రామారావు గారిని  రాజభవన్‌కు ఆహ్వానించకపోయి వున్నా, లేదా వెంకట్రామ్‌ గారి సలహా మేరకు రామారావుగారికి  కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వున్నా  - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ పండితుడు. 
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించి  వుండేదే కాదు పొమ్మన్నాడు.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జగన్ మోహన రెడ్డి కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం కాకపోయినా ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ గా వేసివున్నా  రాష్ట్రంలో రాజకీయ పరిస్తితి మరో రకంగా వుండేదని ఇంకో పరిశీలకుడు అభిప్రాయపడ్డాడు.
కుంతి పడ్డ మధనం కూడా ఇలాటిదే.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది 
ఆదీ అంతం అంటూ లేని ఆ వేదాంతం చెప్పేదేమిటంటే -  
‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’
రోట్లో తలదూర్చిన తరువాత రోకటి పోటుకు వెరవకూడదు.

ఈ సూత్రం పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుంది.

(26-09-2013)