26, జులై 2013, శుక్రవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


భండారు  వీరేశం గారికి నలుగురు కొడుకులు. కూతుళ్ళ సంగతి వంశవృక్షం గాని, కోర్టు తీర్పులు కాని చెప్పడం లేదు.  కొడుకులు: రాజయ్య(రాజన్న).అప్పయ్య, రామలింగయ్య (లింగయ్య), బసవయ్య.
రాజయ్యగారికి కనకయ్య (ఈయనకు వీరేశలింగం అనే పేరు కూడా వుంది). రాజయ్య (రాజన్న) అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ అవివాహితులుగా, నిస్సంతుగా చనిపోయారని కోర్టు తీర్పులో వివరించారు. 

అప్పయ్యగారికి చాలాకాలం సంతానం లేదు. దానిపై ఆయన,  శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు.  ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయనే పర్వతాలయ్య -1 (కోర్టు తీర్పులో పర్వతాలు అనే వుంది). ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కమ్మ రైతు పెద్దలకు ఒకసారి  కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. అప్పుడు అంతా బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని వచ్చేవారట. పర్వతాలయ్య గారు  ఈక కలంతో ఏదో రాసుకుంటున్నారు.  ఏదో మాటామాటా వచ్చి ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని  అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట  పెరిగింది. సరసం విరసం అయింది. వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారట.  ఆ పళాన వెళ్లి,  అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో  పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా,  నాలికపైనా పొడిచారట.  కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా  తమ  పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట.  తరువాత బండ్లు కట్టుకుని పొరుగున వున్న నైజాంలోకి పారిపోయారుట. జరిగిన ఘోరం చూసి ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే,  ‘నా’ , ‘కా;  అనే అక్షరాలు రాశారుట. ‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా  చెబితే వాళ్ళు పగబట్టి  పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో  కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే  పోతారు. నాకేం తెలియదు. చీకటి.  ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు.  రామయ్య, లక్ష్మయ్య.  రామయ్యకు పన్నెండేళ్ళు.  అయినా,  ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’  అని తాసీల్దారు అడిగితే,  ‘చేస్తాన’ని దస్త్రం  తీసుకున్నాడట.   ఆరోజుల్లో కరిణీకం ఉద్యోగానికి  మేజరయి ఉండాలన్న నియమం  లేదన్నమాట.


(ఆరోజుల్లో గుర్రాలను వొదిలేస్తే అవి మేసినంత మేర కరణం గారి పొలాలని చెప్పుకునేవాళ్ళట. అలాటిది ఇవ్వాళ ఒక్కపూటలో పొలాలు, తోటలు తిరిగివస్తున్నారు) 


రామయ్యగారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.


తన తమ్ముడు లక్ష్మయ్యను ఆయన రాజయ్యకు దత్తు ఇచ్చారు.  లక్ష్మయ్య కొడుకు నాగభూషణం కాశీకి వెళ్లి అక్కడ గతించాడు.  అప్పుడు మళ్ళీ తన రెండవ  కొడుకు లక్ష్మీనారాయణను   ఆయన భార్య చుక్కమ్మగారికి దత్తు ఇచ్చారు. కొందరు బంధువులు  నాగభూషణం  మృతి విషయమై అనుమానాలు వ్యక్తం చేశారట. అవన్నీ తరువాత సమసిపోయాయి. (మరో భాగం మరో సారి)

కామెంట్‌లు లేవు: