27, జులై 2013, శనివారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయకో, రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట.

ఆయనకు కరిణీకం చేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. (పూర్తిగా వెండి తో తయారు చేసిన వీటిని 'విచ్చు రూపాయలు' అనే వాళ్ళు). అవేం చేయాలో తెలిసేది కాదు.  వస్తువులు అన్నీ గ్రామంలోనే  లభించేవి. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు,  శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట.


(మా వూళ్ళో మా ఇల్లు - ఇటీవలి చిత్రం) 

రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే  వేరే వూరు రైతు ఒకరు అటుగా  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితే  ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం వూరి మోతుబరుల్లో ఒకరయిన  శ్రీ బండి సత్యనారాయణ (బండి సత్యం)పూర్వీకుడు.


(శ్రీ బండి సత్యం బియ్యేతో నేనూ,  మా రెండో అన్నయ్య శ్రీ భండారు రామచంద్రరావు, రిటైర్డ్ సీజీఎం, ఎస్.బీ.ఐ., -ఇటీవలి చిత్రం)    


శ్రీ సత్యనారాయణ,  నేనూ (భండారు పర్వతాలరావు) మా వూరిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లం. నేను చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల్లో కుదురుకుపోయాను. బండి సత్యం, బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు. అది వేరే కధ.
అలాగే వేమిరెడ్డి వారికి ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేసుకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు.   ప్రస్తుతం వేమిరెడ్డి వంశం వాడయిన ఓబుల్ రెడ్డి( నరిసిరెడ్డి దత్తత కుమారుడు) చామర్తి వీరభద్ర రావు గారు, భండారు కామాక్షమ్మ గారు, భండారు రామకృష్ణయ్య గార్ల ఇండ్ల స్థలాలన్నీ రామయ్యగారివే. భండారు సీతారామయ్య గారు తన కూతురు రాజమ్మ గారిని, మా పెద్ద  మేనమామ, బెజవాడలో ప్రముఖ న్యాయవాది అయిన  కొండపల్లి శ్రీ రామచంద్రరావుగారికి  భార్య చనిపోతే,  రెండో సంబంధం ఇచ్చారు.   తరువాత కంభంపాడులోని పొలాలు, ఇళ్ళ స్థలం అమ్మేసుకున్నారు. ప్రస్తుతం మా ఇంటికి ఐ మూలగా ఓబులరెడ్డి ఇల్లున్న స్థలం రామయ్య గారిదే. ఓబులరెడ్డి పినతండ్రి కొడుకు పేరు కూడా ఓబులరెడ్డే. వేమిరెడ్డి కిష్టారెడ్డి ఏకైక కుమారుడు. మా మూడో తమ్ముడు భండారు వెంకటేశ్వర రావు (తదనంతర కాలంలో మా వూరు కరణంగా పనిచేశాడు, ఇంట్లో వెంకప్ప అని పిలిచేవారు)కు మంచి స్నేహితుడు. మాకు ఎదురిల్లు. తినడానికి, పడుకోవడానికి మినహా రోజంతా మా ఇంట్లోనే ఉండేవాడు. అసలు పేరు ఓబులరెడ్డి అయినా అందరు కోటిరెడ్డి (కోటయ్య) అనే వాళ్ళు. చదువు ఎలిమెంటరీ స్థాయి దాటకపోయినా, మంచి ఇంజినీరింగు స్కిల్స్ ఉండేవి. సొంతంగా ఇంట్లోనే రేడియోలు, టీవీలు తయారుచేసేవాడు. తాలూకా మొత్తంలో ఎక్కడా లేనప్పుడే మా వూళ్ళో కేబుల్ టీవీ నడిపేవాడు) దురదృష్టం. ఆ చిన్ననాటి స్నేహితులిద్దరూ (కోటయ్య, మా తమ్ముడు వెంకప్ప) చిన్న వయస్సులోనే కన్నుమూశారు. (మరో భాగం మరోసారి)

కామెంట్‌లు లేవు: