4, ఏప్రిల్ 2013, గురువారం

తిరగేసిన తాతా మనుమడు కధ






న్యూ యార్క్ లో హడావిడిగా ఆఫీసుకు వెడుతున్న సమయంలో ఫోను మోగింది. నెంబరు చూస్తే ఇండియాది. తండ్రి మాధవయ్య నుంచి. ‘హలో’ అన్నాడు ఆనంద్ కారు డ్రైవ్ చేస్తూనే.
తండ్రి రెండే ముక్కలు మాట్లాడి ఫోను పెట్టేసాడు.  ఆనంద్ ఆందోళనగా బోస్టన్ లో వున్న తన అన్నతో  కనెక్ట్  అయ్యాడు. ఆ కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వున్నాడేమో  తమ్ముడితో అన్నాడు - ‘నాన్న నీకూ కాల్  చేసాడా? అంతా చెప్పాడా’.
‘అంతా ఏముంది. అంతా రెండు ముక్కల్లో చెప్పాడు. అమ్మకు విడాకులిస్తాడట. రేపే లాయర్ను కలుస్తాడట.  ఇండియాలో ఇదేం పొయ్యే  కాలం? ఇక్కడంటే డైవర్సులు  మామూలు. అయినా నలభై ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడీ వయస్సులో ఇవేం బుద్ధులు?’
‘సరే! ఇప్పుడేమి చేద్దాం’
‘చేసేది ఏవుంది. రేపే బయలుదేరి హైదరాబాదు వెడదాం. నాతో పాటు నీకు కూడా ఫ్లయిట్  టిక్కెట్లు బుక్ చేసాను. ఆ విషయం చెబుదాం అనుకుంటువుండగానే నువ్వే కాల్ చేసావు”
‘సరే రేపే వెడదాం! ఆ సంగతి నాన్నకు ఫోను చేసి ఇప్పుడే చెప్పేసెయ్. మేము ఇద్దరం వస్తున్నాం వచ్చేదాకా విడాకులు, లాయరు అంటూ హడావిడి చేయొద్దు’ అని నాన్నకు గట్టిగా  చెప్పు’
కట్ చేస్తే ఇక్కడ ఇండియాలో మాధవయ్య భార్యతో అంటున్నాడు.
‘పదేళ్లయింది పిల్లల్ని చూసి అని  నువ్వేం బెంగ  పడకు. ఎల్లుండి తెల్లారేకల్లా పిల్లలిద్దరూ మన కళ్ళ ముందు వుంటారు.’   
(ఇంగ్లీష్ వ్యాసదాతలకు, ఇమేజ్ ఓనర్ కు  షరా మామూలు కృతజ్ఞతలు)

కామెంట్‌లు లేవు: