10, నవంబర్ 2012, శనివారం

మిత్రవాక్యం



ఐ. వెంకట్రావు, చీఫ్ ఎడిటర్, మహా టీవీ,
మాజీ ఎడిటర్, ఆంధ్ర జ్యోతి, మాజీ చైర్మన్, ప్రెస్ అకాడమి



అలనాటి సోవియట్ అనుభవాలు అంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా కేవలం ఒక సాధారణ వ్యక్తిగా తన అనుభవాలను గ్రంథస్తం చేయడం బాగుంది. ఈ పుస్తకానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టడం ఇంకా బాగుంది. ఇందులోనే  ఆయన కవి హృదయం కూడా  అర్ధమవుతుంది.
శ్రీనివాసరావు, నేనూ డెబ్బయ్యవ దశకంలో బెజవాడలో ఆంధ్ర జ్యోతిలో కలిసి పనిచేసాము. వాళ్ల అన్నగారు భండారు పర్వతాలరావు గారినుంచి చక్కని  సంభాషణా చతురతను  అందిపుచ్చుకుని వుంటారు. ఎక్కడవుంటే అక్కడ నవ్వుల వాన కురిపించడం వాళ్లకు వంశానుగతంగా లభించిన వరమేమో.
శ్రీనివాసరావు   జర్నలిస్టుగా కన్నా హాస్య  రచయితగా  మరింత బాగా రాణిస్తాడన్న అభిప్రాయం మాలో చాల మందికి వుండేది.  ఆరోజుల్లోనే  ఆంధ్రజ్యోతిలో ఆయన అనుదినం  రాసిన  నాలుగు పంక్తుల ‘వాక్టూన్లు’,  ఆ తరువాత ఆకాశవాణిలో సొంత గొంతుకతో  వారం వారం వినిపించిన ‘జీవన స్రవంతి’ దీనికి ప్రబల  తార్కాణం. ఆ వొరవొడే ఈ పుస్తకంలో కూడా తొంగి చూసింది. చదివించే గుణాన్ని  సుతారంగా ఈ రచనకు అద్దింది.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న రోజుల్లో నేనొకసారి వెళ్లాను. వున్నది కొద్ది రోజులే అయినా ఈ పుస్తకంలో రాసినవి అక్షర సత్యాలని అప్పటి రోజులను తలచుకుంటే అనిపిస్తోంది.
ఇన్నేళ్ళ తరువాత రాసినా వాటిల్లో తాజాతనం తగ్గకపోవడానికి ఆ రోజులకున్న ప్రత్యేకతే కారణం.
భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి నుంచి, దూరదర్శన్ నుంచి వృత్తిరీత్యా  పదవీ విరమణ చేసివుండవచ్చు.  కానీ,  ప్రవృత్తి రీత్యా ఆయనకు అక్షర సన్యాసం లేదు. అందుకే కాబోలు ఇప్పటికీ ఆయన అక్షర సాంగత్యాన్నే కొనసాగిస్తున్నారు.
ఆలస్యంగా అయినా ఈ  పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నందుకు ‘వయోధిక పాత్రికేయ సంఘం’ వారు అభినందనీయులు.


(సం) ఇనగంటి వెంకట్రావు 



కామెంట్‌లు లేవు: