29, నవంబర్ 2012, గురువారం

రష్యా చూడలేకపోయా!






సిటీబ్యూరో, న్యూస్‌లైన్: ‘అప్పట్లో సోమియట్ రష్యాది ఒక క్రమబద్ధ జీవితమని విన్నా. అదో ఐరన్ కంట్రీ అని తెలుసు. ప్రపంచంలో రష్యా, అమెరికాలు రెండు కూటములని వినేవారం. అలాంటి రష్యాకు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా వెళ్లే అవకాశం వచ్చింది. ఆమె రెండు రోజులు ఆగమనడంతో ఆగిపోయా. రష్యానే చూడలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చారు తమిళనాడు గవర్నర్ రోశయ్య. బుధవారం రవీంద్రభారతిలో భండారు శ్రీనివాసరావు రచించిన ‘మార్పు చూసిన కళ్లు’ (అలనాటి మా మాస్కో అనుభవాలు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ... ‘అప్పట్లో రష్యాలో ఏం జరిగినా సెన్సార్ అయి తెలిసేవి. అక్కడ చాలా పెద్ద మార్పులే జరిగాయి. అప్పట్లో జర్నలిస్టులు ఎక్కడో ఉండేవారు. వారికి తెలుగు, ఇంగ్లీషులో... జరిగిన విషయాలు రాసుకొని తీసుకెళ్లి ఇచ్చేవారం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్టింగరింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత సందుసందుకు విలేకరులు వచ్చేశారు. వార్తల సేకరణలో పోటీ పెరిగి కొంత సమాచారం వేగంగా ఇచ్చేసి, తిరిగి సవరించుకునే పరిస్థితులున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వృత్తి రీత్యా అక్కడికి వెళ్లిన శ్రీనివాసరావు గొప్ప దేశంలో చోటు చేసుకున్న మార్పులను గుర్తు చేస్తూ పుస్తకం రాయడం మంచి పణామం’ అన్నారు. ప్రముఖ పాత్రికేయిడు జి.ఎస్.వరదాచారి మాట్లాడుతూ... ‘రష్యాలో చోటు చేసుకున్న మార్పులు వింటూ ఉంటే సమయం తెలియదు. ఇంతకు ముందే శ్రీనివాసరావు పుస్తకం తెచ్చి ఉంటే బాగుండేది’ అన్నారు. 

ప్రసార భారతి మాజీ సీఈఓ కె.ఎస్.శర్మ మాట్లాడుతూ శ్రీనివాసరావు పుస్తకం చదవుతుంటే ఆయన అనుభవాలు అందరికీ అనుభవంలోకి వస్తే ఎంత బాగుండు అని పిస్తుందన్నారు. మహా టీవీ సీఈఓ ఐ.వెంకట్రావు మాట్లాడుతూ... అలనాటి సోవియట్ యూనియన్ అనుభవాలంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను అన్నారు. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తిగా మహత్తరమైన అక్కడి అనుభవాలను వివరించారన్నారు. ది హిందు హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్‌కుమార్ మాట్లాడుతూ పుస్తకంలోని ఇంగువ కథ వింటూ ఉంటే నవ్వొస్తుందన్నారు. 

ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి.అమర్ మాట్లాడుతూ... ‘శ్రీనివాసరావు స్ఫూర్తితో రోశయ్య ఆర్థిక మంత్రి ఉండగా ఆయన ఆపార రాజకీయ అనుభవాల గురించి పుస్తకం తెస్తే బాగుంటుందనుకొంటున్నా. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీడియాలో సీరియస్‌నెస్ పోయింది. జర్నలిజంలో రాణించాలనుకునే వారికి సీనియర్ జర్నలిస్టుల అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి’ అని చెప్పారు. రచయిత శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రేడియో మాస్కోలో తెలుగు న్యూస్ రీడర్ ఉద్యోగం కోసం రష్యా వెళ్లే అవకాశం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ర ష్యా వెళ్లిన న్యూస్ రీడర్‌ని నేనొక్కడినే. అమెరికాకు ఎదురొడ్డి నిలిచిన సోవియట్ల శకం -కనురెప్పల కిందే నలిగిపోయింది. రష్యాలో పెద్దపెద్ద మార్పులే జరిగాయి’ అన్నారు. కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి జి.సన్యాసిరావు, ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్ డి.వెంకట్రామయ్య పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: