26, ఆగస్టు 2012, ఆదివారం

నా బాధ ఎవరితో చెప్పుకోను?


నా బాధ ఎవరితో చెప్పుకోను?
దేశ జనాభా అక్షరాలా నూట పదికోట్లు 
ఇందులో ఇరవై  కోట్లమంది రిటైర్ అయికూర్చున్నారు 
[][][][]ముప్పయ్యేడు కోట్లమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు

మరో ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది.  (వీళ్ళు పనిచేస్తారంటే ఎవరో కాదు వాళ్ళే నమ్మరు)
[][]


కోటిమంది ఐ టి రంగంలోవున్నారు. వీళ్ళు పని చేస్తారు కాని మన దేశం కోసం చెయ్యరు. 


[]Error! Filename not specified.[][]

ఇరవై ఐదు కోట్ల మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
[][][]


కోటిమంది అయిదేళ్ళ లోపు వాళ్లు. 



[][]


పదిహేను కోట్లమంది నిరుద్యోగులు


[][][]


కోటీ ఇరవై లక్షలమంది ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. 

[][][][][][]

79,99,998 మంది జైళ్ళలో మగ్గుతున్నారు. 


ఇక మిగిలింది నువ్వూ, నేనూ -
 

నువ్వేమో ఇలా తీరి కూర్చుని కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేసుకోవడమో, వచ్చిన వాటిల్లో నచ్చిన వాటిని  స్నేహితులకు ఫార్వార్డ్  చేస్తూ ఎప్పుడూ  బిజీగా వుంటావు.
 

[][][][][][]

మిగిలింది నేనొక్కడిని. ఈ దేశ  భారం అంతా ఒక్కడినే మోయాలి. వ్చ్! ఖర్మ. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి?
 
[]
(నెట్లో సంచారం చేస్తున్న జోక్ కు తెలుగులో స్వేచ్చానువాదం)

24, ఆగస్టు 2012, శుక్రవారం

నిర్ణయరాహిత్యంతో రాష్ట్రానికి చేటు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం


నిర్ణయరాహిత్యంతో రాష్ట్రానికి చేటు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం  
 నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేన’ని మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుగారు అంటుండేవారు. అయితే,  నిర్ణయాలు వాయిదా వేయడం ద్వారా పరిష్కారం  దానంతట అదే  వొనగూడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఈ చిట్కా అన్ని సందర్భాలలో పనికిరాదు. పైగా ఈ వాయిదాల వ్యవహారం అసలు సమస్యను మరింత జటిలం  చేసే ప్రమాదం వుంటుంది.
ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న సాచివేత ధోరణి ఈ మాదిరిగానే వుంది.
వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో రాష్ట్ర వ్యవహారాలపై తమ కట్టు, పట్టు తప్పిపోయిందని గుంజాటన పడ్డ కాంగ్రెస్ అధిష్టానం,  ఆయన తదనంతర కాలంలో మళ్ళీ పూర్వ  పెత్తనాన్ని చలాయించాలని ఆత్రుత పడుతున్నట్టుగా అర్ధం అవుతోంది. స్తానిక నాయకత్వాన్ని పటిష్టం చేయడం వల్ల కలిగే లాభాలకన్నా నష్టాలు ఎక్కువ అనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నాయకులను తమ చేతలతో, వ్యాఖ్యలతో చిన్నబుచ్చుతూ మరోపక్క ప్రజల దృష్టిలో చులకన అవుతున్న విషయాన్ని విస్మరిస్తోంది. గత రెండు మూడురోజులుగా వస్తున్న వార్తలు, మీడియాలో వస్తున్న స్క్రోలింగులు దీన్నే ధృవపరుస్తున్నాయి.        
‘సీఎం ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశం. హస్తిన చేరుకున్న కిరణ్. సీఎం మార్పుపై మళ్ళీ  గుప్పుమంటున్న ఊహాగానాలు.”
“అంతకుముందే పీసీసీ అధ్యక్షుడు బొత్సపై వేటు. ఆ తరువాత  సీఎం మార్పు ఖాయం. సెప్టెంబర్ పదిలోగా  ప్రక్షాళన పూర్తి.”
“సీఎం కు అహ్మద్ పటేల్ అర్ధరాత్రి పిలుపు.”
“చిరంజీవికి పార్టీ పగ్గాలు?”
“సీనియర్ మంత్రులను తప్పించే క్రమంలో కామరాజు ప్లాన్.  వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్తవారికి అవకాశం
2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి. – ఏ ఐ సీ సీ కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టీకరణ
‘ధర్మాన రాజీనామా ఆమోదించే అవకాశాలు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇతర మంత్రులకు  స్వస్తి చెప్పే బాటలో అధినాయకులు
తీసుకోబోయే నిర్ణయాలు గురించి  ఇలా పలురకాలుగా అనుదినం వార్తలు వెలువడుతూ వుండడం పార్టీకి ఏవిధంగా లాభిస్తుందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి.
ఇలా రకరకాలుగా వదంతులు గుప్పుమంటుంటే ఖండించే నాధుడు వుండడు. అసలే అంతంత మాత్రంగా వున్న పాలన. నిర్ణయాలు తీసుకోవడం అసలే లేదు. అధవా తీసుకున్నా వాటిని తక్షణం అమలు పరిచే నాధులు లేరు. ఏం చేస్తే ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అనే సందేహం. ఠలాయించే నాయకులు లేకపోవడంతో మొరాయించే అధికారులు పెరిగిపోతున్నారు.
దిగిపోయేవాడే కదా అన్న భావన మరింత ప్రబలితే ఈ మాత్రం మాట వినే వాళ్ళుకూడా అధికారగణంలో మిగులుతారన్న ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో  పని చేసేవాళ్ళు ఎలాచేస్తారు. పని చేయించేవాళ్ళు యెలా చేయిస్తారు? ఎన్నాళ్ళు వుంటామో తెలియకుండా దోలాయమానంలోకి నెడుతుంటే ఏ ముఖ్యమంత్రి మాత్రం ఎన్నాళ్ళు కుదురుగా పాలన చేయగలుగుతాడు?
అర్ధరాత్రి అహ్మద్ పటేల్ ఫోను చేసి ముఖ్యమంత్రిని తన వద్దకు పిలిపించుకోవడానికి ఆయనకు వున్న అధికార హోదా ఏమిటి? అధిష్టానానికి దగ్గరగా మసలగలిగిన అవకాశం మినహా ఆయనకు వున్న అదనపు అర్హత ఏమిటి? ఆ మాటకువస్తే, కాఫీలు టీలు ఇచ్చే నౌకర్లు కూడా చనువుగా మసిలే వీలుంటుంది. కానీ,  పెత్తనం చేయడానికి అది అర్హత యెలా అవుతుంది?
అధిష్టానం దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో ఒక కార్యకర్త కావచ్చు. కానీ తెలుగు ప్రజల దృష్టిలో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.  అయన విషయంలో ఇలా  అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలు ఏమనుకుంటారు?  యన్టీఆర్ జీవించి వున్నట్టయితే ‘ఆంధ్రులు – ఆత్మ గౌరవం’ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేవారేమో.
ఇక, ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి చోటా మోటా నాయకుడు వెడుతూ వెడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రే 2014 ఎన్నికల దాకా కొనసాగుతారని మీడియాకు చెప్పడంలో పరమార్ధం ఏమిటి? దిగిపోతున్నారని వస్తున్న  ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడమా లేక  పరోక్షంగా ఆ వదంతులను సమర్ధించడమా? యేమని అర్ధం చేసుకోవాలి? ఈ వ్యాఖ్యలకు, ప్రకటనలకు యేమని అర్ధం చెప్పుకోవాలి?
ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, పదవి కోరుకుంటున్నవాళ్ళు,
పదవీ గండం వుందని భయపడుతున్నవాళ్ళు అంతా కట్టగట్టుకుని హస్తినలోనే మకాం వేసి అధినాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎదుర్కుంటున్న ఇబ్బందుల  పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్ళే తీరిక దొరకని  నాయకులందరూ ఇప్పుడు పదవీ లాలసతతో రాజధానిలో రోజులు రోజులు పొద్దుబుచ్చుతున్నారు.

పునశ్చరణ దోషం అయినా మరోమారు చెప్పక తప్పడం లేదు. ఈనాడు రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్త సమస్యలకు, రాష్టంలో ఏర్పడ్డ అన్ని గందరగోళాలకు కాంగ్రెస్ అధిష్టానం  అనుసరిస్తున్న అనిశ్చిత వైఖరే కారణం. సాగదీత ధోరణే మూల కారణం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల అభిమానం వున్నవారితో పాటు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు సయితం  కాంగ్రెస్ అధిష్టానాన్ని  కోరుకునేదొక్కటే. రాష్ట్రానికి సంబంధించి, అది తెలంగాణా విషయం కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి మార్పుకానివ్వండి, పీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కానివ్వండి – ఆ నిర్ణయాన్ని మీనమేషాలు లెక్కించకుండా తక్షణం తీసుకోవాలనే.   
ముఖ్యమంత్రిని మార్చదలచుకున్నారా తక్షణం మార్చండి. కనీసం ఆ వచ్చే కొత్త ముఖ్యమంత్రికి సాంతం కాకపోయినా  కొంతలో కొంతయినా నిర్వహణ స్వేచ్ఛ  ఇవ్వండి. తన మంత్రివర్గాన్ని తననే  ఏర్పాటు చేసుకోనివ్వండి.  రెండేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించండి. కట్టు తప్పి వ్యవహరిస్తాడన్న భయ సందేహాలు వుంటే పైనుంచి పట్టు బిగించండి. అంతే కాని కాళ్ళూ చేతులూ కట్టేసి, మరోపక్క అసమ్మతి పొగ  రాజేసి సొంత పార్టీ వారితోనే ఆటలాడుకునే  పద్ధతికి స్వస్తి  చెప్పండి. లేదా వున్న ముఖ్యమంత్రికే  గట్టి భరోసా ఇవ్వండి. మాటకు ఏమాత్రం విలువ లేని చిన్నాచితకా నాయకులు ప్రతి పది పదిహేను రోజులకు మీడియా ముందుకు వచ్చి  ముఖ్యమంత్రి పదవికి ధోకా లేదు అంటూ షరామామూలుగా చిలకపలుకులు  వల్లె వేయడం కిరణ్ కుమార్ రెడ్డి హోదాకు  ఎంతమాత్రం శోభస్కరం కాదు. స్తాయిలేనివాళ్ళు ఇలాటి పనికిమాలిన ప్రకటనలు చేసి, ప్రజల్లో పార్టీని పలచన చేసే బదులు ఆ ఒక్క ముక్కా అధినేత్రి నోటి నుంచే వస్తే అసమ్మతి అన్నది చప్పున చల్లారి వూరుకుంటుంది. కాంగ్రెస్ ఎన్ని అవకరాల పుట్ట అయినా అధిష్టానం పట్ల భక్తిప్రపత్తులు ప్రదర్శించడంలో ఆ పార్టీ వారిని మించిన వారు వుండరు. ఈ లక్షణం బాగా వొంటబట్టిన అసమ్మతి యోధులు మంత్రం వేసినట్టు మాయమయిపోతారు. తరచుగా నోరుజారేవారు, తోకలు ఝాడించే  వారు నోటికి తాళం వేసుకుంటారు. ఈ వాస్తవం కాంగ్రెస్ అధిష్టాన దేవతలకు తెలియదని కాదు. కాకపొతే, గిల్లికజ్జాలు పెట్టి, వొడ్డున నిలబడి  తమాషా చూడడం వారికి వినోదం. తమలో తాము పోట్లాడుకునేవాళ్ళు తమజోలికి రారని అదోమాదిరి నమ్మకం. (24-08-2012)    
              

23, ఆగస్టు 2012, గురువారం

అక్షర సత్యాలు




అక్షర సత్యాలు





చక్కటి గాలి కోసం కిటికీలు తెరుచుకోండి
ఏసీల వాడకాన్ని నిలిపివేయండి
ఇంధనాన్ని ఆదా చేసే సీ.ఎఫ్.ఎల్. బల్బులను, ఐ.ఎస్.. మార్కు ఫ్యాన్లనే వాడండి.
(ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో కరెంట్ కొరతపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన సలహాలు – ఆంధ్ర జ్యోతి మొదటి పేజీ వార్త – 23-08-2012)
(వ్యాఖ్య) నిజమే. ఇవన్నీ అక్షర సత్యాలే. కాని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నోటి నుంచి రావాల్సిన మాటలేనా అన్నదే సందేహం. (23-08-2012)  

20, ఆగస్టు 2012, సోమవారం

హనుమంతుడి టి.ఏ. బిల్లు


హనుమంతుడి టి.ఏ. బిల్లు
లంకలో  రామ రావణ యుద్ధం ముగిసింది. లంకేశ్వరుడి మరణం తరువాత రాముడు పుష్పక విమానంపై  అయోధ్యకు తిరిగివచ్చి ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కోలాహలంలో పాత టియ్యే బిల్లులు సకాలంలో క్లెయిం చేసుకోకపోతే ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయోధ్యలో అనుభవశాలి ఒకరు సలహా చెప్పడంతో  ఆంజనేయుడు ఎందుకయినా మంచిదని ముందుగానే తన బిల్లును సబ్మిట్ చేసాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలికను తేవడానికి వెళ్ళివచ్చినప్పటి ప్రయాణ భత్యం బిల్లు అది.
టియ్యే బిల్లు సెక్షన్లో పనిచేసే డీలింగ్ అసిస్టెంట్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా అలవాటు ప్రకారం మూడు కొర్రీలు వేశాడు.
హనుమంతుడు ఈ టూరుకు ముందుగా అప్పటి రాజయిన భరతుడి  లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదన్నది మొదటి అభ్యంతరం కాగా, అంజనీ సుతుడికి తన ఉద్యోగ హోదా రీత్యా విమానంలో (గాలిలో) ప్రయాణించే అర్హత లేదన్నది రెండోది. ముందస్తు అనుమతి తీసుకోకుండా గాలిలో యెగిరి వెళ్లి సంజీవని తీసుకువచ్చాడు. అందువల్ల అతడు సబ్మిట్ చేసిన బిల్లు నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. పోతే, అతడ్ని, సంజీవని మూలికను మాత్రమే తీసుకురమ్మని పంపారు. కానీ మొత్తం సంజీవని పర్వతాన్నే అంజనేయుడు తీసుకువచ్చాడు. పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సొంత నిర్ణయం ప్రకారం తెచ్చిన అదనపు బాగేజ్ అలవెన్సును మంజూరు చేయడానికి రూల్స్ ఒప్పుకోవని  రాసేసి  డీలింగు అసిస్టెంటు ఫైలును  మూసేశాడు.
“రామనామం తప్ప వేరేదీ రుచించని వాయునందనుడికి ఈ డీలింగ్ అసిస్టెంట్ వ్యవహారం సుతరామూ  రుచించలేదు. ముడతపడిన మూతిని మరింత ముడుచుకుని గబా గబా  వెళ్లి రామచంద్రులవారికే విషయం వివరించాడు. సాక్షాత్తు రాముడికే నమ్మిన బంటు అయిన తన విషయంలోనే ఇలా జరిగితే రామ పాలనను నమ్ముకున్న షరా  మామూలు జనం మాటేమిటని రాజును  నిలదీశాడు.
రాముడికి హనుమంతుడంటే ఎంతో ఇది. కానీ నియమనిబంధనలంటే కూడా ఇంకెంతో ఇది. ‘రూల్స్ ఒప్పుకోకపోతే రాజు మాత్రం ఏం చేస్తాడు? ఏం చెయ్యలేన’ని రాంబంటు మొహం మీదే చెప్పేసాడు.
పక్కనవున్న లక్ష్మణుల వారికి రాముడి వైఖరి చూసి వొళ్ళు మండింది. ఆరోజు పవన సుతుడు అమాంతంగా యెగిరి వెళ్లి సంజీవని తీసుకురాకపోతే తానీపాటికి స్వర్గంలో సభ తీరుస్తుండేవాడినన్న వాస్తవం గుర్తుకు తెచ్చుకుని మరింత మండి  పడ్డాడు.
ఆ కృతజ్ఞతతో లక్ష్మణుడు నేరుగా డీలింగ్ అసిస్టెంటుతోనే డీల్ చేసాడు.  ఏదోవిధంగా పని సానుకూలం అయ్యేట్టు చూడమని కోరాడు. బిల్లు శాంక్షన్ చేస్తే బిల్లు మొత్తంలో పది శాతం ఆమ్యామ్యా కూడా ఇస్తానని ప్రలోభపెట్టాడు.

అడుగుతోంది సాక్షాత్తూ రాజుగారి అనుంగు తమ్ముడు. పని చేయమంటోంది కూడా పుణ్యానికి  కాదు. ముట్టాల్సింది కూడా ముడుతున్నప్పుడు పనిచేయకపోవడానికి కారణం ఏముంటుంది కనుక.
డీలింగ్ అసిస్టెంటు మళ్ళీ ఫైల్  బయటకు తీసి  ఇలా తిరగరాసి పైకి పంపాడు.
‘కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఈ కేసును తిరిగి మరోమారు పరిశీలించడం జరిగింది.
‘హనుమంతులవారు ఈ టూరుపై  వెళ్ళిన సమయంలో భరతులవారు రాములవారి రాజ ప్రతినిధిగా రాజ్యం చేస్తున్నారు. అప్పటికి ఆయన పూర్తిస్తాయిలో రాజుగారి హోదాలో లేరు. రాములవారి ఆదేశం మేరకే ఆనాడు ఆంజనేయులవారు  ఈ అధికారిక పర్యటన మీద వెళ్లారు. శ్రీవారు స్వయంగా ఆదేశించారు కాబట్టి, అది కూడా అత్యంత జరూరుగా జరగాల్సిన రాచకార్యం కాబట్టి, ఈ పర్యటనకు మామూలుగా వుండే నిబంధనలు వర్తించవు. కాబట్టి ఈ బిల్లును యధాతధంగా ఆమోదించడమైనది. అలాగే ఆయన క్లెయిం చేసిన  ఎయిర్ ట్రావెల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడానికి ముందస్తు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించడం జరిగింది.
‘పోతే, అదనపు బాగేజీకి సంబంధించి చెల్లింపు విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని సయితం పునః సమీక్షించడం జరిగింది. హనుమాండ్లు గ్రూప్ ‘డి’ కేటగిరీ ఉద్యోగి కనుకన్నూ, మూలికలను గుర్తించగలిగే సామర్ధ్యం వుండడానికి అవకాశం లేదు కనుకన్నూ, పొరబాటున తప్పుడు మూలికను తీసుకువచ్చిన పక్షంలో మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి రావాల్సిన పని పడే అవకాశం వుందికనుకన్నూ, అలాటి ప్రయాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడే  అవకాశాలు లేకపోనూ లేవు కనుకన్నూ – ఈ అన్ని విషయాలను, ఖజానా భారాన్ని  సాకల్యంగా, సవివరంగా  పరిశీలించి, ‘ప్రజాప్రయోజనాల’ దృష్ట్యా ఈ బిల్లును పాసు చేయాలని సిఫారసు చేయడం జరిగింది.”
అంతే!  ఫైలు ఆఘమేఘాల మీద కదిలింది. అనేక విభాగాలు చుట్టబెట్టింది. బిల్లు ఆమోదానికి అందరూ ‘ఎస్’ అన్నవాళ్ళే. ‘నో’ అన్న వాళ్లు ఒక్కరూ లేరు. అందుకే ఒక్క రోజులోనే టియ్యే డబ్బులు హనుమంతుడి ఖాతాలో   పడ్డాయి.

(గమనిక: ‘నెట్’ సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్  ఆర్టికిల్ ‘ఏల్చూరి’ వారి  కంటబడింది. ఆయన పంపగా నా వద్దకు చేరింది. చదివి వూరుకోకుండా దాన్ని తెలుగులో గిల్లి చూసాను. అదే ఇది – భండారు శ్రీనివాసరావు - 20-08-2012)

18, ఆగస్టు 2012, శనివారం

ఔనంటారా! కాదంటారా!


ఔనంటారా! కాదంటారా!
మట్టే బంగారం అనుకునే  ఖరీదయిన చోట్ల   కోట్లు పోసి కట్టిన లంకంత కొంప
కానీ  కాపురం వుండేది మాత్రం  లింగూ లిటుకూ మంటూ ఓ  ముసలి జంట
రెక్కలొచ్చిన పిల్లలు  రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎక్కడో,  సుదూరంగా ఏ దేశంలోనో
‘అమ్మా నాన్నా ఓ పనమ్మాయి’
ఏదయినా సినిమా టైటిల్ గుర్తొస్తోందా!
బియ్యేలు, ఎమ్మేల  కాలం కాలగర్భంలో కలసిపోతోంది.  అంతూ పొంతూ లేని చదువులు అంగట్లో అమ్మకానికి సిద్ధం.
కానీ ఏం లాభం?
చదవేస్తే వున్న మతి పోయినట్టు పేరుకు పక్కన డిగ్రీలే కానీ మెదడులో అసలు జ్ఞానం  సున్నా.
బతుక్కు పనికొచ్చే పరిజ్ఞానం  మొత్తంగా గుండు సున్నా.
ఎక్కడ చూసినా రమ్యహర్మ్యాలను తలదన్నే కార్పొరేట్ ఆస్పత్రులు.
పెరిగిపోతున్న జబ్బులకు కొత్త పేర్లు పెట్టి డబ్బులు గుంజడం మినహా  నాడి  చూసి వైద్యం చేయగల నాధులే లేరు.
నెల జీతాలు అయిదంకెల్లో.
మనశ్శాంతి  మాత్రం అధః పాతాళంలో.
చంద్రుడి మీద కాలుమోపడం తెలుసు.  పక్కింటి వాడు మాత్రం పరాయి మనిషి. ఎవడి బాగోగులు వాడివే. ఎవడి గోల వాడిదే.
పుట్టుకతోనే పుట్టుకొస్తున్న  తెలివితేటలు అనన్యం.
స్పందించే హృదయమే  శూన్యం.
దేనికీ కొరతలేని జీవితాలు.
కానీ జీవితాలే వెలిసిపోతున్న రంగు కాగితాలు.
ఇవే ఈ నాటి నూతన జీవన సత్యాలు. (18-08-2012)

16, ఆగస్టు 2012, గురువారం

వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం మాస్టారు 

(తురగా జానకీరాణి గారు నాకు రేడియోలో సీనియర్ సహోద్యోగి. ఆకాశవాణిలొ చిన్నపిల్లల  ప్రోగ్రాము నిర్వాహకురాలిగా, రచయిత్రిగా, వక్తగా ఆమె తెలుసు. నాకు తెలియని ఆమెలోని మరో పార్శ్వం ఈరోజు ఫేస్ బుక్ లో ఆవిడ రాసిన సత్యం గారి జ్ఞాపకం.  చిన్నతనంలో నాట్యం నేర్చుకున్న సంగతి ఈరోజే తెలిసింది. ఫోనులో పలకరిస్తే తను ముప్పయ్యేడవ ఏట కూడా  రంగస్థలంపై  నర్తించిన సంగతి చెప్పారు.  ఆమె స్మృతులను  నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయంతోనే ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావు)   

“పంతొమ్మిది వందల నలభై ఏడు ,ఎనిమిది ప్రాంతాల్లో మాస్టారికి పంతొమ్మిది నాకు పన్నెండు. మదరాసులో పెదసత్యంగారి దగ్గర నుంచి కూచిపూడికి తిరిగి వచ్చేసిన రోజుల్లో బందరులో నాకు నాట్యం నేర్పించారు. మహిళా సేవా మండలిలో కొందరికి నేర్పుతూ నాకు ఉదయం పూట ఆరు గంటలకి వచ్చి స్పెషల్ క్లాసు తీసుకునేవారు.

“మా అమ్మమ్మ ఆయనగారికి కంచు గ్లాసులో కాఫీ ఇచ్చేది. అది త్రాగి గోడవారగా పెట్టేవారు.


“నేను అప్పటికే మదరాసులో పందనల్లూరు చొక్కలింగం పిళ్ళై గారి దగ్గర కొంత నేర్చుకొన్నాను. అందువల్ల నాకు ఒకే సారి కొన్ని అంశాలు నేర్పించారు. అలరింపు, అఠాణా స్వరజతి, భైరవి, కల్యాణి రాగాల్లో జతిస్వరాలు, కానడ తిల్లానా, వసంత రాగంలో స్వరజతి, మా వల్లకాదమ్మ దేవి యశోద, కొన్ని అరవ పాటల రికార్డింగులు, ఇలా ఎన్నో. ఆయనే నట్టువాంగం, గానం చేసేవారు. తేలికగా, లైట్ గా మాట్లాడేవారు.

“నాచేత బుట్టాయపేట హాలులోను, గుడివాడ, వడాలి మొదలైన కొన్ని పల్లెటూళ్ళలో ప్రదర్శనలిప్పించారు. మువ్వలు కొని వాటికి వెండి పూత పూయించి తోలు పట్కా మీద కుట్టించి ఇచ్చారు. అవి నా దగ్గరున్నాయి. బహుశ నేను ఆయనకు తొలి శిష్యురాలినేమో. ఆ తరువాత ఆయన మదరాసు వెళ్లి పోయారు. నేను మళ్ళీ చొక్క లింగం పిళ్ళై గారి దగరకి నేర్చుకోవడానికి వెళ్ళాను. నిజానికి ఆయన నాకు భరత నాట్యమే నేర్పారు.

“ఆ తరువాత ఆయన్ని రాజసులోచన మేడ మీద క్లాసులు నడుపుతుండగా చూసి వచ్చాను. ఇంకొక సారి ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి  భోపాల్ వరకు చేసిన ప్రయాణంలో ఆయన ఎందరెందరి గురించో  చెప్పారు. ఆ తరువాత తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం ఇచ్చినప్పుడు నేను స్టేజీ మీదకు వెళ్లి నాకు పన్నెండు, ఆయనకు పంతొమ్మిది ఏళ్ల వయస్సులో ఎంత గొప్ప గురు భావం ఉండేదో చెప్పినప్పుడు, అయన అలాగా’ అన్నారు. ‘ఇంకా ఎంతో చెయ్యాలని ఉందమ్మా’ అని కూడా  అన్నారు. ‘ఎప్పుడూ అమ్మ బాగున్నారా మామయ్యా బాగున్నారా’ అని అడిగేవారు. ఆ సాన్నిహిత్యం, అభిమానం నేను కలకాలం మదిలో నిలుపుకుంటాను. నేను కొంత వరకైనా దూరదర్శన్,  రేడియోలతో పాటు, రవీంద్ర భారతి రంగస్థలం మీద అనేక నృత్య రూపకాలకి, బృంద గీతాలకు దర్శకత్వం వహించగలిగానంటే అది ఆయన పెట్టిన భిక్షే. ప్రాతః స్మరణీయులు ఆ మహామనీషి.” 

తురగా జానకీరాణి

(16-08-2012)


15, ఆగస్టు 2012, బుధవారం

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు

(ఆరేళ్ళ క్రితం రాసిన వ్యాసం ఇది. అప్పటికీ ఇప్పటికీ మారింది ఏమయినా వుందా? ఇందులో మార్చాల్సింది ఏమయినా వుందా?)


- భండారు శ్రీనివాసరావు




దసరా,దీపావళి మొదలయిన పండగల సరసన చేరిపోయిన జాతీయ పర్వ దినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై  ఆరు.

మొదటి పండుగ మొదటిసారి జరుపుకున్నప్పుడు నేను నెలల బిడ్డని. రెండో పండగ తొలిసారికి నా వయస్సు నాలుగయిదేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి. 




నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై ఆరేళ్ళు  అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో ఇది ఒక లెక్కలోనిది కాదు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరి లో పాల్గొనే వాళ్ళం.


 ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఆ ఊరేగింపులో 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ రాష్ట్రాల ప్రసక్తి వుందో మాకు తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.జనగణమన చరణాలలోని - 'న' ను 'న' లాగా- 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.

అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?

'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే 'కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలనే రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా 'జనగణమన' పాడడం పోయి - అందులో తప్పులెన్నే రోజు వచ్చింది. జాతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది. పతాకావిష్కరణలు మొక్కుబడి తంతుగా  మారిపోయాయి. ఈ పండగల సమయాల్లో  నాయకుల తలల మీద కానవచ్చే 'గాంధీ టోపీలు' మిగిలిన రోజుల్లో అటకెక్కుతున్నాయి.  ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.




సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, భారత జాతి గర్వించ దాగిన గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై  ఆరేళ్లలో  కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు  బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, అప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.




జనానికి  జై!
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి. గిద్దెలు, సోలలు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంకా మైలు రాళ్ళని దాటలేదన్న సంగతి ఇక్కడ గమనార్హం.
దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లోనే పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను  దాటి ఒకే బాలట్ పేపరు ముద్రించిన అనేక గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని ఎన్నుకోగల స్తాయిని అందుకుని ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకున్న జనాభా కలిగిన  దేశం మనది.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.



'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము.

ఏ ఇంగ్లీష్ వారితో అహింసా మార్గంలో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీష్ భాషతోనే భావి భారత నిర్దేశకులయిన మన యువతీ యువకులు - కంప్యూటర్ రంగాన్ని దేశ దేశాలలో తమ కనుసన్నలతో శాసించగలుగుతున్నారు.
కానీ.....

అయితే , అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికొకటి   అడ్డం పడుతున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మారుస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ వాళ్ళ మంచితనం మంచులా కరిగిపోతోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవలక్షణాలు తలెత్తడం అతి సహజం. అయితే అది తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం అందరిదీ.

నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ప్రతి పంద్రాగస్టు నాడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఇది.
ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

13, ఆగస్టు 2012, సోమవారం

మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?


మనం ఎక్కడ వున్నాం లోపం ఎక్కడ వుంది ?

ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా  పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 


ఆగస్టు పదిహేనో తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్న శుభ సందర్భంలో అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన ‘అనుగ్రహ భాషణం’ ఇది. తెలుగుదనం కోసం, అనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం.
చిత్తగించండి.

“మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలు, మన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం.
“పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశ మే మొదటి వరసలో వుంది.
“ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభం? వీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే.
“ఈమధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది  కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు  ప్రచురించవన్న సంగతి అప్పుడే  అర్ధం అయింది.
“మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు,ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
“ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
“సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు.
“అదేమిటంటే.  విదేశీ వస్తువుల  మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై  వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము.
“ఈ మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను ‘జీవితంలో నీ లక్ష్యం ఏమిట’ని. ఆ అమ్మాయి బదులిచ్చింది. ‘ అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన  భారత దేశంలో జీవించాలని వుంది.’
“ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత  మనందరిమీదా  లేదంటారా. ఆ కర్తవ్యం  మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
“మరో విషయం. మనందరికీ  ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారు, వీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా  లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము.
“ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన  జన్మ హక్కు అనుకుంటాము.
“వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే.  కానీ మనమేం చేస్తున్నాము? ఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా?
“మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్ యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక.  సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడ తాము. ఏ షాపింగ్ మాలుకో, రెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదా, స్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు.
“లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లి, నేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని  నాకు బిల్లు పడకుండా చూడండి’ అని అడిగే ధైర్యం చేయం.
“వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు  మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసి, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!’ అంటూ హుంకరించం. లేదా ‘నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో’ అని ఆమ్యామ్యా పైసలు  చేతిలో పెట్టే తెగింపు చేయం.
“అలాగే, ఆస్త్రేలియాలోనో, న్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూ, తాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం.  వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి  బిన్ లో వేసికాని రాము. “టోకియోలో  పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా ? బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమా? విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే!  కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా?
“ఎందుకంటే, మనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే  కనిపెట్టి చూడాలని కోరుకుంటాం.
“వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని  తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి  మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే  సిబ్బందికి కూడా  మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది.
“ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి  సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని   ఆపగలవారు, అడ్డగలవారు  వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. ‘పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. ‘దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను  చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూ’ అంటూ   అని ధర్మపన్నాలు వల్లిస్తాం.
“మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడం? దానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను,సమాజాన్ని  క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరు? పక్కింటివాళ్ళు, ఎదురింటివాళ్ళు, మన  కాలనీవాళ్లు, వూళ్ళో వున్న పౌరులు, లేదా  మునిసిపాలిటీ, ప్రభుత్వం, ప్రభుత్వ అధికార్లు. అంతే. మనం  కాదు. ఈ వ్యవస్తలో  మనం మాత్రం  వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా,  కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ‘ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారా’ అని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతే, విమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని,  వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరం, ఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితే, అంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి.
“ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం.
“భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు  ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.”  (14-08-2012)