30, ఏప్రిల్ 2012, సోమవారం

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు


 డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు 
ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి  సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టిసెట్లో  వెనుక హీరో’ అనో హీరోయిన్ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.
ఇంతకీ ఈ సీట్ల గొడవ ఎత్తుకోవడానికి కారణం లేకపోలేదు.
ఆస్ట్రేలియాలో స్కై స్కానర్’ అనే ఓ వెబ్ సైట్ సంస్థకు ఏమీ తోచకతోడికోడలు పుట్టిల్లు ఎక్కడో తెలియక – తరచుగా విమానాల్లో ప్రయాణించేవారు  ఏ సీటు అంటే బాగా మక్కువ పడతారో లెక్కలు తేల్చడానికి ఏకంగా ఓ సర్వే చేపట్టింది. దానాదీనా తేలిందేమిటంటే చాలా ఎక్కువమంది గాలి తిరుగుబోతులు’  తాము ప్రయాణించే విమానాల్లో ‘6-A’ నెంబరు కలిగిన సీటును కోరుకుంటారట.
విమానం ఆగగానే ఆలశ్యం లేకుండా దిగిపోయేందుకు ఆ సీటు అయితే బాగా వుంటుందన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే టాయిలెట్లు కాస్త దూరంలో వుండడం కూడా 6-A’ నెంబరు సీటు కోరుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అలాగే, విమానం ముందు భాగంలో ఎడమవైపు వరసలో వుండే సీట్లు కూడా చాలామంది కోరుకునే సీట్లని ఈ సర్వే తేల్చింది.
పోతే ఎవ్వరూ కూడా  అంతగా ఇష్టపడని సీటు ఒకటి వుందని ఈ సర్వేలో తేలింది. అదేమిటంటే విమానం వెనుక భాగంలో రెండు సీట్ల నడుమ వుండే ‘31-E’ సీటట.
6-A’ నెంబరు సీటుకు డిమాండు వుందని తేలడంవల్ల గిరాకీని  బట్టి రేట్లు పెంచే సంస్కృతి కలిగిన విమానయాన సంస్తలు ఆ సీటుకు  ‘ప్రీమియం’  చార్జీ వసూలు చేసే అవకాశం లేకపోనూలేదని ఈ సర్వే చేసిన స్కై స్కానర్’ ట్రావెల్ ఎడిటర్  శామ్ బాల్డ్ విన్ మహాశయులవారు హెచ్చరిస్తున్నారు.
లాభం లేనిదే వ్యాపారి వరదను సయితం  లెక్కచేయకుండా ప్రయాణం పెట్టుకోడని సామెత.
కాబట్టి, సర్వేల్లో అసలు మతలబు ఇదన్నమాట.
సర్వేజనా సుఖినోభవంతు! (30-04-2012)

29, ఏప్రిల్ 2012, ఆదివారం

కప్పల గోల



కప్పల గోల
‘మనసు భద్రం తమ్ముడూ!’ అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ ‘మనిషి గతి ఇంతే!’
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.
మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
‘నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను’
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో ‘కప్పల బేరం’ కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
‘మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
‘రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే!’ పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. (29-04-2012)

26, ఏప్రిల్ 2012, గురువారం

కష్టాల కడలిలో కాంగ్రెస్‌


కష్టాల కడలిలో కాంగ్రెస్‌  (SURYA DAILY- Dated. 26-04-2012)

రోగనిర్ధారణలో కేంద్ర ఆరోగ్యమంత్రి వైఫల్యం?
కేరళ మూలికా వైద్యుని ప్రవేశం!
ఇంతకీ రోగ నిర్ధారణ జరిగినట్టేనా?
వయలార్‌ రాకతో అనుమానాలు
ఇంతలోనే ముంచుకొచ్చిన ఉప ఎన్నికలు
కాంగ్రెస్‌ ఆశలపై ఎన్నికల నియమావళి నీళ్ళు
తోడైన అంతర్గత కుమ్ములాటలు
పుణ్యకాలం రెండేళ్ళే! 





రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా ఉందన్న సంగతి అధిష్ఠానానికి ఇన్నాళ్లకు తెలిసివచ్చినట్టుంది. కేంద్రంలో స్వయంగా ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని పట్టి పీడిస్తున్న జబ్బేమిటో ఆనవాలు పట్టలేక పోయారు. ఇక ఇంగ్లీష్‌ వైద్యంతో పని కాదనుకున్నారో యేమో కానీ హఠాత్తుగా ఢిల్లీ నుంచి కేరళ మూలికా వైద్యుడు వయలార్‌ రవిని రోగనిర్ధారణ కోసం పంపారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో అదే ఢిల్లీ నుంచి వయలార్‌ మహాశయులు హైదరాబాదు రావడం లేనిపోని అనుమానాలకు బీజం వేసింది. నేడో రేపో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్నంతవరకు ఊహాగానాలు గుప్పుమన్నాయి.

అయితే, వీటితో సంతోషపడ్డవారూ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయ్యో యెట్లా అనుకున్న వారూ అదే కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం, బలహీనత ఇదే సుమా అని విశ్లేషించిన వాళ్ళూ లేకపోలేదు.వచ్చారు, చూశారు, వెళ్లారు అన్న తరహాలో వయలార్‌ వారి రాష్ట్ర పర్యటన ముగిసింది. పోతూ పోతూ షరా మామూలు తరహాలోనే, ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షుడికీ నడుమ ఎలాటి విభేదాలు లేవని మీడియాకు నొక్కి వక్కాణించి మరీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అధినాయకురాలికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నివేదిక రూపంలో అందచేశారని భోగట్టా. ఇంతకీ ఆయన అయినా రోగనిర్ధారణ చేశారా అన్నది సమాధానం దొరకని ప్రశ్నే.ఈలోగా పులిమీది పుట్రలా పద్ధెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉపఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఎంతో కొంత వ్యవధానం ఉంది, ఏదో ఒక మేరకు సర్డుకోలేకపోతామా అని కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలపై, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్న ప్రకటన బిందెడు నీళ్ళు గుమ్మరించింది.

ప్రజాపథం పేరుతొ, లేదా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల పేరుతో సర్కారు డబ్బులు వెదజల్లకుండా ఈ నియమావళి మోకాలొడ్డింది. నిజానికి ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీల మీద కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వెసులుబాటు ఇదొక్కటే. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధానం ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి, చోటా మోటా నాయకులను చేరదీసి పోలింగు బూత్‌ల పరిధుల్లో కోరుకున్న విధంగా ఓటింగు జరిగేలా చూసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వీలు, సాళ్ళు ఇతర పార్టీలకు లేవు. కానీ, ఎన్నికల నియమావళి పుణ్యమా అని ఇప్పుడా వెసులుబాటు లేకుండా పోయింది. రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేవిధమయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనుకున్న వ్యవధిలో జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు బాగా వాయిదా పడిపోవడంతో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నెలల తరబడి కొనసాగాల్సి వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి అయినా ఏమిచేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. అన్నింటికీ ఎన్నికల కమిషన్‌ లక్ష్మణ రేఖలు. మండే ఎండా కాలం. చిన్నా చితకా పనులు చేయాలన్నా అడ్డుకొంటున్న ఆంక్షలు. జనాలకు అవసరమయిన పనులు చేసిపెట్టలేని అశక్తత. ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు అదే వాతావరణం పునరావృతమవుతోంది. ఎండలు మం డుతున్నాయి. దాహార్తితితో జనం ఎండుతున్నారు. అభివృద్ధి కార్యక్ర మాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిన పరిస్థితి. ఆనవాయితీకి భిన్నంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌కు, ఎన్నికల నోటిఫికేషన్‌కు నడుమ వ్యవధి కాస్తా ఇరవై అయిదు రోజులకు పెరిగింది. సాధారణంగా ఇది వారం, పది రోజులకు మించి ఉండదు.

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సుమారు వంద కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేసిన విషయం ఫిర్యాదుల రూపంలో ఎన్నికల కమిషన్‌కు చేరడమే ఇంత ముందుగా షెడ్యూల్‌ ప్రకటించడానికి కారణంగా చెప్పుకుంటున్నారు.
ఉప ఎన్నికలు జరిగి తీరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా అసలు జరుగుతాయా లేదా అన్న విషయంపై చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే లోగా ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ఏమైనా ఖాళీలు ఉంటే, వాటిని భర్తీ చేయడం అన్నది సంప్రదాయమే కాని నిబంధన కాదని, ఎన్నికలకు వెనుకంజ వేసే ప్రభుత్వం ఏదో ఒక కారణం చూపి వాటిని వాయిదా వేయించడానికే ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రతిపాదన ఇందులో భాగమేనని కూడా వార్తలు వెలువడ్డాయి. కాని ఈ వదంతులను పటాపంచలు చేస్తూ అనుకున్న దానికంటే కొంత ముందుగానే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం ఆయా పార్టీల వారిని నివ్వెర పరచింది. ఉప ఎన్నికలు ముందు నుంచి ఊహించినవే కాబట్టి, అందరూ వాటికి సంసిద్ధంగానే ఉన్నారనుకోవడం పొరబాటు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న పార్టీలు, ముఖ్యంగా పాలక పక్షం, ఏదో ఒక కారణంతో పోలింగ్‌ వాయిదా పడాలనే కోరుకోవడం సహజం. కానీ, ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నిఅన్నట్టుగా ఎన్నికల తరుణం ముందుకు తోసుకు వచ్చింది.

అసలే ప్రతికూల వాతావరణం. పైపెచ్చు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వాటికి తోడు, ఈ సారి కాంగ్రెస్‌ పని అయిపోయినట్టే అని వెలువడుతున్న ఎన్నికల సర్వేలు. ఇవన్నీ కాకుండా, పోటీ చేసే అభ్యర్ధులను కూడా సకాలంలో ప్రకటించలేని దుస్థితి, వెరసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయింది.ఈ నేపథ్యం ఇట్లా ఉంటే, ఇవన్నీ సరిపోలేదన్నట్టు- రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు, సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరంలో ధర్నా చేయడం, మరో వైపు పార్లమెంటులో అధికార పక్షానికే చెందిన సభ్యులు తెలంగాణ కోసం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి, నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌కు గురికావడం- ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మరింత ఇరకాటంలో పడేసాయి.

రామాయణంలో పిడకల వేటలా ఉప ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకోవాలో లేదో అని పార్టీలో చెలరేగిన మీమాంస పార్టీని అతలాకుతలం చేసింది. ఒక రోగం అయితే ఏదో వైద్యం చేసి సరిదిద్దవచ్చు. అనేక రోగాలాయే. ఒకదానికి చేసే చికిత్స మరో దానికి వికటిస్తుంది. క్షయ, షుగర్‌ వ్యాధులతో సతమతమయ్యే రోగికి ఒక రోగ నిదానానికి చేసే చికిత్స మరో వ్యాధికి పొసగదు. క్షయ రోగానికి పుష్టీ బ్రాండ్‌ ఆహారం తీసుకోవాలి. కానీ, షుగర్‌ వ్యాధి కూడా ఉన్నప్పుడు అలాటి ఆహారం తీసుకోవడం కుదరని పని.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్తితి ప్రస్తుతం ఈ రెండు వ్యాధులు సోకిన రోగి మాదిరిగా ఉంది. వైఎస్సార్‌ అభివృద్ధిని ఖాతాలో వేసుకోవాలంటే, మరో వైపు ఆయన హయాంలో జరిగినదంటున్న అవినీతి మరక అంటుకుంటుందని భయం. వైఎస్‌ చేసిన అభివృద్ధిని వదలుకుంటే ప్రజలు కాదంటారని సంకోచం. ఇన్ని సంకటాల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన సాగుతోంది.

పాలన సాగుతోందని అంటే దానికి కూడా అభ్యంతర పెట్టేవాళ్ళు ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారు. కొంతమందికి వైయస్సార్‌ పనికిరాడు. ఆ మేరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవసరం వారికి ఉంది. అదీ ఎంతవరకు? మరొకరికి అధిష్ఠానం అవకాశం ఇచ్చేవరకు. ఇస్తే, మరుక్షణం నుంచి వారి విధేయతలు మారిపోతాయి. ఎందుకంటే నేటి రాజకీయాల్లో విధేయతలు, విశ్వాసాలు అన్నీ కుర్చీలకే పరిమితం. అవకాశం రావాలే కానీ, ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న అధినాయకులతోనే- ముఖ్యమంత్రి పదవి కోసం బరిలోకి దిగడానికి అలాటివాళ్ళు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు కారణం ఉంది.

మంత్రి అనిపించుకోవాలన్నా, ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్నా ఇక మిగిలిన పుణ్య కాలం రెండేళ్ళే! ఆ తరువాత ఏదో మహాద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ వరసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడం కల్ల. అందువల్ల, ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరాలన్నా, ఆ దరిమిలా పది కాలాలపాటు మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలన్నా ఉన్న వ్యవధి ఈ రెండేళ్ళే అన్న వాస్తవం మూడు రంగుల కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటారు. మరి కుర్చీ ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనేమో!


(25-04-2012)

22, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!


ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!

ఈనాడు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీ 'ఈనాడు' దినపత్రిక మెయిన్ ఎడిషన్ ఐదో పేజీలో ప్రచురించిన వార్త ఆధారంగా -






వివరాలకు ఈ కింది 'లింక్' పై నొక్కండి.













12, ఏప్రిల్ 2012, గురువారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా! – భండారు శ్రీనివాసరావు


రాజకీయుల నాలుకకు  నరం వుంటుందా!భండారు శ్రీనివాసరావు
అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దివంగత రాజశేఖర రెడ్డి గురించి కూడా ఇదే రకమయిన అయోమయం చోటుచేసుకుంటు న్నట్టు అనుదినం వార్తలు తెలుపుతున్నాయి. కొందరికి ఆయన కనబడుతుంటే మరికొందరికి ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి కూడా కనబడుతున్నారు. నిజానికి, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఆజాత శత్రువు ఏమీ కాదు. ఆజన్మ శత్రువులకు కూడా కొదవేమీ లేదు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సయితం  ఆయనతో తీవ్రంగా విభేదించిన కాంగ్రెస్ నాయకులున్నారు. అలాగే ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని వేనోళ్ళ పొగిడి రాజకీయ లబ్ది పొందినవాళ్ళు కూడా వున్నారు.  తెలుగు దేశం హయాంలో రాష్ట్రంలో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తన పాద యాత్రతో నూతన  కొత్త జవసత్వాలు కట్టబెట్టి అనేక ఏళ్ళ తరువాత అందని పండుగా మారిన అధికారాన్ని  తమ  పార్టీకి అందించాడని  కొన్నేళ్లపాటు ఆయనను విడవకుండా కీర్తించిన వందిమాగధుల స్వరాలు కూడా  క్రమంగా మారిపోతూ వుండడమే విచిత్రం. ఆయన చనిపోయిన వెంటనే సీను హఠాత్తుగా మారిపోలేదు  కాని క్రమంగా మారుతూ వచ్చింది.  వైయస్సార్ కుమారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసి వేరు కుంపటి పెట్టి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన వరస అపజయాల దరిమిలా కాని కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. లక్షల కోట్ల లెక్కలో జగన్  మోహన రెడ్డి అవినీతి గురించి తాము  చెబుతున్న లెక్కలు జనాలకు పట్టకపోవడం వారికి వింతల్లో వింతగా అనిపిస్తూ వుండవచ్చు. ఇందుకు నెపం ఎవరిమీదనో మోపాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన చనిపోగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందా అన్నట్టు ఆ తరువాత  అధికార పీఠం ఎక్కిన వారు ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారికి నచ్చడం లేదు. ఆ విధంగానే, ఆయన పాలన అంతా అవినీతిమయం అంటున్న  వారికి ఆయన చేపట్టి అమలు చేసి చూపిన సంక్షేమ కార్యక్రమాల వూసు పట్టడం లేదు. దాని ఫలితమే బడుగు బలహీన వర్గాలన్నీ వైయస్సార్ పేరుతొ పెట్టిన పార్టీ వెంట నడవడానికి దోహదం చేసింది. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనకేం చేసుకున్నాడో, తన కొడుక్కేం చేసుకున్నాడో మాకనవసరం. మాకేం  చేశాడన్నదే మాకు ప్రధానం’ అని మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి రాజధానిలో బార్బర్ గా పనిచేస్తున్న నరేష్ చెప్పాడు. వైయస్సార్ పుణ్యమా అని తన చెల్లెలు ఇంజినీరింగు పూర్తిచేసిందని, తనకూ ఈ మాదిరి సాయం లభించి వుంటే పదో తరగతి కూడా పూర్తి చేయకుండానే  చదువు మధ్యలో  మానేయాల్సిన దుస్తితి తప్పేదని అంటూ, చెల్లెలు ఇంజినీరుకాగానే వూళ్ళో తమ స్తాయి పెరిగిందనీ, అందరూ తమ కుటుంబాన్ని గౌరవంగా చూస్తున్నారనీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆరోగ్య శ్రీ కింద  గుండె ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళు, ఏ పార్టీ జెండా పట్టుకోకుండానే ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లు, నెలనెలా పెన్షన్ క్రమం  తప్పకుండా అనుకుంటున్న వృద్ధులు – వీరంతా  వూరూరా నోటిమాటగా చేసిన ప్రచారం కోట్లు ఖర్చు  పెట్టి చేసే ప్రభుత్వ ప్రచారాన్ని మించి పోయింది. ఇది గమనం లోకి తీసుకోకుండా పార్టీలోని వైయస్సార్ ప్రత్యర్ధులు చేసిన తప్పుడు ప్రచారాన్ని  నమ్మి కొంతా, పధకాల మీద తమ  పట్టు పోతోందన్న  ఉక్రోషంతో కొందరు అధికారులు చేసిన నిర్వాకం వల్ల కొంతా  మొత్తం మీద ఏదయితేనేం వైయస్సార్ సంక్షేమ పధకాలను  అటకెక్కి స్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వైయస్సార్ మరణం తరువాత ఈ పధకాలను అప్పటి మాదిరిగానే కొనసాగించివున్న పక్షంలో ఈనాడు జగన్ మోహన రెడ్డి  ఆ పధకాలను గురించి క్లెయిం చేసుకునే అవకాశం దక్కివుండేది కాదు. ఆ పధకాల వల్ల మేలు పొందిన వారి అభిమానం కాంగ్రెస్ పట్ల చెక్కు చెదరకుండా వుండేది. వైయస్సార్ బొమ్మ గురించి ఈనాడు ఇంతగా పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడాల్సిన అవసరం వుండేది కాదు.  కారణాలు ఏవయినా కాంగ్రెస్ నాయకత్వం ఈ బంగారు అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. దాని ఫలితమే,  దరిమిలా  కడప, కోవూరు ఉపఎన్నికల  ఫలితాల్లో ప్రస్పుటమయింది కూడా.
అయినా ఇప్పటికీ,  రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం గురించి  పార్టీ వర్గాల్లో  గుంజాటన సాగుతూనే వుంది. ఈ మధ్య ఢిల్లీలో అధిష్టాన దేవతలు రాష్ట్ర నాయకులకు అభ్యంగన స్నానం చేయించి, చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి, చేయాల్సిన హిత బోధలు చేసి సాగనంపిన పిమ్మట   ఇది క్రమంగా శ్రుతి మించి ఆరున్నొక్క రాగంగా మారుతోంది.
కాంగ్రెస్ లో అవలక్షణాలకు చక్కని పేర్లు పెట్టుకుంటూ వుంటారు. కార్యకర్తల స్తాయిలోనే కాకుండా అధినాయకుల స్తాయిలో కూడా మాటలు విసురుకుంటూ దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనే నామకరణం చేసుకుని వారిలో వారే సంతృప్తి పడుతూ వుంటారు. పోటీ లేనప్పుడు, ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా గొడవలు పడ్డా వచ్చే ప్రమాదం లేకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. ఏదో అధికారంలో వున్న పార్టీ కదా ఇప్పుడే  వొదిలేయడం ఎందుకు, కొన్నాళ్ళు ఆగితే పోలా అనుకునేవాళ్లకు  కాంగ్రెస్ లో ఏమాత్రం కొరత లేదు. అలాగే వై యస్సార్ వీరవిధేయులు పార్టీ విడిచి వెళ్ళిన తరువాత కూడా, మరి  కొందరు ఇంకా మఠం వేసుకు కూర్చుని ‘మనసు ఒక చోటా మనువు మరో చోటా’ అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తార్కాణం కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా  వెల్లడిస్తున్న ‘కోవర్టు’ల వ్యవహారమే.
త్వరలో జరగనున్న పద్దెనిమిది ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్తితి ఎలావుంటుందో ఎవరూ చెప్పలేరు. పోలింగుకు ఒక్క రోజు ముందు జరిగే ఏ సంఘటన అయినా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది. కాని ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దీనాతిదీనంగా వుండడం గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. వైయస్సార్ మరణానంతరం లభించిన  మూడేళ్ళ పై చిలుకు అధికార సమయాన్ని కాంగ్రెస్ వారు పూర్తిగా వృధా చేసుకున్నారు. నిష్క్రియాపరత్వానికి ఒక ఉదాహరణగా చరిత్రలో నిలచిపోతారు. (11-04-2012)
                                                          

7, ఏప్రిల్ 2012, శనివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు)


మార్పు చూసిన కళ్ళు 
(అలనాటి మాస్కోలో మా అనుభవాలు)
ప్రధాని గారూ! మీరు బూట్లెక్కడ కొన్నారు?  
ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి, పత్రికలో పడిన ఓ జోక్ ను  రష్యన్ యాసలో తెలుగులో చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజానికి అది జోకేమీ కాదు. అది ఆ దేశ ప్రధానమంత్రి  కోసిగిన్ గురించిన వార్త. ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఓ పత్రికలో వేసారు. బూట్లు సాక్సు వేసుకుని ఫోటోలో కానవస్తున్న ప్రధాన మంత్రికి ఆ పత్రిక పాఠకుడు రాసిన బహిరంగ లేఖను  నా రష్యన్ మిత్రుడు  జోకుగా చదివి  వినిపించాడు.
‘అయ్యా! ప్రధాని గారు. బూట్లు, సాక్సు కోసం గత ఆరు మాసాలుగా నేను తిరగని దుకాణం లేదు. మీరు ఎక్కడ కొన్నారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.’ ఇదీ ఆ ఉత్తరం సారాంశం.
నేను మాస్కో వెళ్ళిన  కొత్తల్లో ఆఫీసులో ఎవ్వరూ, జోకుల సంగతి అటుంచి అసలు  అవసరం అయినదానికంటే ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాటిది ఏకంగా దేశ ప్రధాని గురించీ, ఆయన వేసుకున్న బూట్లూ సాక్సూ గురించీ అలా బహిరంగ లేఖ రాయడం, దాన్ని గురించి ఆఫీసుల్లోనే బహిరంగంగా చర్చించుకోవడం – ఇదంతా  చూస్తుంటే  నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సోవియట్ రష్యాలో నిత్యావసర వస్తువుల కొరత గురించి ఒక సాధారణ పౌరుడు ఏకంగా ప్రధానమంత్రిని ఉటంకిస్తూ వ్యంగ్యంగా నేరుగా  పత్రికకు ఉత్తరం రాయడం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వెళ్ళిన నాకే అబ్బురం అనిపించింది. అందులో అది షరా మామూలు దేశమేమీ కాదు. ఇనుపతెర దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం.
మంచిదే! గోర్భచెవ్ ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ప్రజలు  గాఢంగా కోరుకుంటున్న వాక్స్వాతంత్రం పూర్తిగా ఇచ్చేసినట్టే లెక్క. నిజానికి అక్కడివారికి జీవించడానికి ఏమేమి కావాలో అక్కడ అన్నీ వున్నాయి. పైగా అవన్నీ కారు చౌకగా. లేనిదల్లా మనసులో మాట బయట పెట్టగలిగిన స్వేచ్చ ఒక్కటే. అదొక్కటీ దొరకడమే వారికి అబ్బురంగా అనిపించి వుంటుంది.
ఇలా మొదలయిన మార్పు ‘మార్పు’ అన్న పదానికంటే గొప్పగా మార్పు చెందడమే నేను చూసిన మార్పు.
మార్పు అన్నది తెలవకుండా డెబ్భయ్ ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా సాగిన సోవియట్ వ్యవస్థలో కనబడని మార్పులు కనీ కనబడకుండా  చోటు చేసుకుంటున్నాయన్న మాట. (07-04-2012)
      

3, ఏప్రిల్ 2012, మంగళవారం

‘Struggles’ not ‘Sacrifices’


‘Struggles’ not ‘Sacrifices’

(Published in The Hans India, Daily News Paper, Dt.30th March,2012)

It is very sad that many emotive students over separate statehood are ending their lives. Will such acts help Centre respond quickly and fast? Certainly not!

It is true that no movement in the world over succeeded without students’ active participation. Even our own freedom struggle is no exception. Thousands of students who got attracted to the call of Mahatma gave up their studies mid-way. But, those days were different from today. The ‘cause’ may be as important as ‘freedom’ to Indians as now to Telanganites. Yet, in our changed civil society the entire world is fast emerging as a ‘big village’ and it is being accepted by every one of us.

Opportunities opened up, world geographic boundaries disappeared, and we are witnessing colonization all over the world. This is evident from the thousands of Indians' migration to either America or UK or Australia or Canada or New Zealand for greener pastures.

In that race, even no less Telanganites are lagging behind, unlike in the past when the first revolt was raised in 1969.

All these changes should not dampen or deter people of the region’s aspirations to stake claim for separate statehood. What pains me today is a youngsters ending life while bright future lies ahead of them. Unlike in the past, today’s parents are more concerned and care their children. The competitive spirit among the present day parents indeed more that of in their children. As a result, the parents end up with utmost joy and satisfaction if they ensure their children put their foot best forward in the respective chosen careers. If such a ‘dream’ of a ‘parent’ has to end halfway is what more painful.

In that context, I make an appeal to the students community of all regions, particularly Telangana. Competitive examinations are the round-corner and in the recent past you made every Telugu proud topping, if not grabbing, maximum number of distinctions in several all-India common entrance tests. Especially, the Osmania University, which was in ‘dock’ for some time had performed exceedingly well to bring back its old glory. Once again the University students are in great demand world over and the ‘campus’ recruitment bazaars are held with regularity.

I do understand, how ‘dear’ the aspiration to achieve separate statehood for Telangana  to you as well to mine. Anything and everything could be achieved through struggles and not sacrifices.


Hence, I once again sincerely appeal to all the entire students community to restrain from ending their lives and instead take part building constructive Telangana. Hope my voicing is reaching out to them…..!!!

1, ఏప్రిల్ 2012, ఆదివారం

మాస్కోలో చలిమంటలు


మాస్కోలో చలిమంటలు

ముందు గొయ్యి వెనుక నుయ్యి అనే సామెత ఒక రోజు మాకు అనుభవంలోకి వచ్చింది. ఆ రాత్రి మేము భోజనం చేసి టీవీ లో మహాభారతం కేసెట్ వేసుకుని చూస్తుంటే పై అంతస్తులో వున్న జస్వంత్ సింగు గారి భార్య ఫోను చేసి ఓ కబురు చెవిలో వేసింది. వినగానే యెగిరి గంతు వేయాల్సిన విషయం కాదు కానీ నిజంగానే  ఇంటినుంచి గంతు వేయాల్సి వచ్చింది. ఇంతకీ  ఆవిడ అందించిన సమాచారం ఏమిటంటే- రేడియో మాస్కో భవనం అంటే మేముంటున్న అపార్ట్ మెంటు లో అగ్నిప్రమాదం జరిగిందట. మంటలను ఆర్పేందుకు సిబ్బంది వచ్చారట. పైకి నిచ్చెనల మీదుగా వచ్చి కిటికీ తలుపు మీద కొట్టినప్పుడు వాటిని తీస్తే మమ్మల్నిజాగ్రత్తగా  కిందకు దింపుతారట. ఇదెక్కడి గోలరా అనుకుంటూ ఆదరాబాదరాగా పిల్లల్ని లేపుతుంటే మళ్ళీ ఫోను. కంగారులో వున్నపలాన  కిందికి  దిగేయకండి. బయట గడ్డకట్టే చలి. వీధిలోకి పోయేటప్పుడు యెలా వెడతామో ఆ మాదిరిగా  అన్ని ఉన్ని దుస్తులు   వేసుకుని, కోట్లూ టోపీలు ధరించి   సిద్ధంగా వుండండని  మరో హెచ్చరిక.
ఒకవైపు నిప్పంటుకున్నదని భయపడాలా లేక పెళ్ళికి వెడుతున్నట్టు తయారు కావాలా. ఏదయితేనేం భయపడ్దంత ఏమీ జరగలేదు. ఆ భవనంలో ఎక్కడో ఏదో చిన్నపాటి అగ్గి రాజుకుని పొగ రావడం, దాన్ని పసికట్టిన అలారం దగ్గర్లో వున్న  ఫైర్ స్టేషన్లో మోగడం, వాళ్లు హడావిడిగా  రావడం జరిగింది. బహుశా అప్పుడప్పుడలా వూహించని  దుర్ఘటనలు సంభవిస్తే యెలా సంసిద్ధంగా వుండాలో పౌరులకు నేర్పే ప్రక్రియలో భాగంగా అలా చేసారో కూడా తెలియదు.





ఎవరెడీ


ఆ రోజు ఏమీ జరక్కపోయినా మాస్కో జీవితంలో మరో కోణం మాకు దృగ్గోచరమయింది. పౌరుల ప్రాణాల పట్ల అక్కడి పాలకులు తీసుకుంటున్న శ్రద్ధ ఈ సంఘటన రూపంలో మరోమారు ఆవిష్కృత మయింది.