31, అక్టోబర్ 2011, సోమవారం

ఏడు పక్కన ఎన్ని సున్నాలు?


ఏడు పక్కన ఎన్ని సున్నాలు?

నిన్న మొన్నటి వరకు అదొక నిద్రాణమయిన పల్లె.
ఉత్తరప్రదేశ్ లోని  భగ్ పత్ జిల్లాలో సున్హేడా వంటి అనేక గ్రామాలున్నాయి. కానీ ఈ పల్లెకి ఒక్కదానికే ఉన్నట్టుండి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఒక పసికందు కారణమంటే ఆశ్చర్యమే. ఈ వ్యాసం రాసే సమ యానికి ఇంకా ఆ శిశువు పుట్టనే లేదు. సున్హేడా గ్రామంలో సచిన్, పింకీ పావర్ అనే పుణ్య దంపతులకు ఈ అపురూపమయిన బిడ్డ జన్మించబోతోంది. వాళ్లకి ఈ ఏడాది జనవరి ఎనిమిదో తేదీన వివాహమయింది. పెళ్ళయిన నెల రోజులకే పింకీ నెల తప్పింది. స్తానిక ప్రాధమిక వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే కాకుండా ఆమెకు పట్టబోయే అదృష్టం గురించి కూడా ఆవిడ చెవిన వేశారు. అంతేకాదు లండన్ నుంచి కూడా యూ ఎన్ అధికారులు ఫోన్ చేసి పింకీకి పుట్టబోయే శిశువు ప్రపంచ జనాభాను ఏడువందల బిలియన్ మార్క్ ను దాటించే అపురూప శిశువు కానున్న విషయాన్ని ధృవ పరిచారు. బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూడా వాళ్లు అడిగి తెలుసుకున్నారని పింకీ మురిసి పోతూ నలుగురికీ చెప్పింది.
జనాభా విషయంలో రెండో స్తానంలో వున్న మన దేశానికి ఆ జనాభాకు సంబంధించే మరో  అపూర్వ గౌరవం దక్కబోతోందన్న మాట. అదేమిటంటే -  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లెక్క ప్రకారం ప్రపంచ జనాభా ఈ రోజు నుంచి ఏడు బిలియన్ మార్క్ దాటబోతోందట. ఈ రికార్డ్ దక్కడానికి కారణమయిన  బిడ్డ ఆ వూళ్ళో పుట్టబోతోందట. అదీ ఆడ శిశువు కావడం ఆకాశంలో సగం అని కీర్తి గడించిన ఆడంగులందరికీ గర్వకారణం.  అలా అని,  సీ ఎన్ ఎన్ – ఐ బి ఎన్ మీడియా తన వార్తాకధనాల ద్వారా ఊదరగొడుతోంది.


 ఏడు బిలియన్లు అంటే ఏడువందల కోట్లు. ఏడు పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఈ సంఖ్య వస్తుందన్నది ఆ ఫండ్ వాళ్లనే అడగాలి. పనిలో పనిగా మరో ప్రశ్న కూడా అడగాలి. ఏ లెక్క ప్రకారం లెక్కలు వేసి ఆ శిశువు పలానా  వూళ్ళో పలానా మహిళకు పుట్టబోతున్నట్టు తేల్చారన్నది తేల్చి చెప్పమని కూడా  అడగాలి.
అయితే ఈ ప్రశ్నకు జవాబుగా వాళ్లు చాంతాడంత గణాంకాలు ఉదహరిస్తున్నారు. భారత దేశంలో ప్రతి నిమిషానికి అక్షరాలా యాభయ్ ఒక్కమంది శిశువులు జన్మిస్తున్నారట. మళ్ళీ ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే నిమిషానికి పదకొండుమంది పిల్లలు పుడుతున్నారట. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం పుట్టబోయే ఆ ఏడు వందల కోట్ల ఒకటో బిడ్డ ఉత్తర ప్రదేశ్ లోని సున్హేడా గ్రామంలో పలానా తేదీన భూమిపై పడబోతున్నట్టు మీడియా కోడై కూస్తోంది.
“ఇదంతా బొత్తిగా ఉత్తిదే. మన దేశంలో చాలా గ్రామాలకు సరయిన రహదారులే లేవు. ఏ వూళ్ళో ఎప్పుడూ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో లెక్కలు తీయడానికి అవకాశాలే లేవు. అలాటిది ఏడువందల కోట్ల ఒకటో శిశువు పలానా రోజు పలానా వూళ్ళో పలానా వారికి పలానా సమయానికి  పుట్టబోతున్నదని చెబితే నమ్మడానికి చెవులో పువ్వులు పెట్టుకోలేద”ని  కొట్టిపారేసే ‘డౌటేహ’ మనస్కులు కూడా  లేకపోనూ లేదు.
ఏదిఏమయినా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడానికి చాలా కష్ట పడాలి. అంత సీను మనకెలాగూ లేదు. అందుకని కష్టపడకుండా మన వాళ్లకి మాత్రమే చేతయిన పద్దతిలో లభిస్తున్న ఈ గౌరవాన్ని ఎందుకు కాదనాలి? కాబట్టి అందరం కలసి ఆ అపూర్వ శిశువుకు ఆహ్వానం పలుకుదాం.
మేరా భారత్ మహాన్!
ఇప్పుడే అందిన వార్త (బ్రేకింగ్ న్యూస్ అనాలా!)
సందేహాస్పదులు అన్నంతా అయింది.
ఈ రోజు, అంటే  అక్టోబర్ ముప్పయ్ ఒకటో తేదీన ఏడువందల కోట్ల ఒకటో బిడ్డ పుట్టింది. కాకపొతే ఉత్తర ప్రదేశ్ లోని మరో వూళ్ళో. (ఎందుకయినా మంచిది 'అట' అని చేరిస్తే మంచిదేమో!) ఆ రికార్డ్ శిశువు పేరు నర్గీస్ 'అట' 
కాదు కాదంటోంది మరో ఛానల్. ఫిలిప్పీన్స్ లో ఈ శిశువు జన్మించిందని ఘంటాపదంగా చెబుతోంది. ఎవరెన్ని రకాలుగా చెబుతున్నా ఒక విషయం మాత్రం ఒకే విధంగా చెబుతున్నారు. రోజూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాయి కదా ఈ చానళ్ళు. అందుకే కాబోలు 'రెండు చోట్లా పుట్టింది ఆడపిల్లే!'  
31-10-2011           
Statistics show that 51 babies are born every minute in India and of these 11 babies are born in Uttar Pradesh AFP

కామెంట్‌లు లేవు: