31, అక్టోబర్ 2011, సోమవారం

ఏడు పక్కన ఎన్ని సున్నాలు?


ఏడు పక్కన ఎన్ని సున్నాలు?

నిన్న మొన్నటి వరకు అదొక నిద్రాణమయిన పల్లె.
ఉత్తరప్రదేశ్ లోని  భగ్ పత్ జిల్లాలో సున్హేడా వంటి అనేక గ్రామాలున్నాయి. కానీ ఈ పల్లెకి ఒక్కదానికే ఉన్నట్టుండి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఒక పసికందు కారణమంటే ఆశ్చర్యమే. ఈ వ్యాసం రాసే సమ యానికి ఇంకా ఆ శిశువు పుట్టనే లేదు. సున్హేడా గ్రామంలో సచిన్, పింకీ పావర్ అనే పుణ్య దంపతులకు ఈ అపురూపమయిన బిడ్డ జన్మించబోతోంది. వాళ్లకి ఈ ఏడాది జనవరి ఎనిమిదో తేదీన వివాహమయింది. పెళ్ళయిన నెల రోజులకే పింకీ నెల తప్పింది. స్తానిక ప్రాధమిక వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే కాకుండా ఆమెకు పట్టబోయే అదృష్టం గురించి కూడా ఆవిడ చెవిన వేశారు. అంతేకాదు లండన్ నుంచి కూడా యూ ఎన్ అధికారులు ఫోన్ చేసి పింకీకి పుట్టబోయే శిశువు ప్రపంచ జనాభాను ఏడువందల బిలియన్ మార్క్ ను దాటించే అపురూప శిశువు కానున్న విషయాన్ని ధృవ పరిచారు. బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూడా వాళ్లు అడిగి తెలుసుకున్నారని పింకీ మురిసి పోతూ నలుగురికీ చెప్పింది.
జనాభా విషయంలో రెండో స్తానంలో వున్న మన దేశానికి ఆ జనాభాకు సంబంధించే మరో  అపూర్వ గౌరవం దక్కబోతోందన్న మాట. అదేమిటంటే -  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లెక్క ప్రకారం ప్రపంచ జనాభా ఈ రోజు నుంచి ఏడు బిలియన్ మార్క్ దాటబోతోందట. ఈ రికార్డ్ దక్కడానికి కారణమయిన  బిడ్డ ఆ వూళ్ళో పుట్టబోతోందట. అదీ ఆడ శిశువు కావడం ఆకాశంలో సగం అని కీర్తి గడించిన ఆడంగులందరికీ గర్వకారణం.  అలా అని,  సీ ఎన్ ఎన్ – ఐ బి ఎన్ మీడియా తన వార్తాకధనాల ద్వారా ఊదరగొడుతోంది.


 ఏడు బిలియన్లు అంటే ఏడువందల కోట్లు. ఏడు పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఈ సంఖ్య వస్తుందన్నది ఆ ఫండ్ వాళ్లనే అడగాలి. పనిలో పనిగా మరో ప్రశ్న కూడా అడగాలి. ఏ లెక్క ప్రకారం లెక్కలు వేసి ఆ శిశువు పలానా  వూళ్ళో పలానా మహిళకు పుట్టబోతున్నట్టు తేల్చారన్నది తేల్చి చెప్పమని కూడా  అడగాలి.
అయితే ఈ ప్రశ్నకు జవాబుగా వాళ్లు చాంతాడంత గణాంకాలు ఉదహరిస్తున్నారు. భారత దేశంలో ప్రతి నిమిషానికి అక్షరాలా యాభయ్ ఒక్కమంది శిశువులు జన్మిస్తున్నారట. మళ్ళీ ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే నిమిషానికి పదకొండుమంది పిల్లలు పుడుతున్నారట. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం పుట్టబోయే ఆ ఏడు వందల కోట్ల ఒకటో బిడ్డ ఉత్తర ప్రదేశ్ లోని సున్హేడా గ్రామంలో పలానా తేదీన భూమిపై పడబోతున్నట్టు మీడియా కోడై కూస్తోంది.
“ఇదంతా బొత్తిగా ఉత్తిదే. మన దేశంలో చాలా గ్రామాలకు సరయిన రహదారులే లేవు. ఏ వూళ్ళో ఎప్పుడూ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో లెక్కలు తీయడానికి అవకాశాలే లేవు. అలాటిది ఏడువందల కోట్ల ఒకటో శిశువు పలానా రోజు పలానా వూళ్ళో పలానా వారికి పలానా సమయానికి  పుట్టబోతున్నదని చెబితే నమ్మడానికి చెవులో పువ్వులు పెట్టుకోలేద”ని  కొట్టిపారేసే ‘డౌటేహ’ మనస్కులు కూడా  లేకపోనూ లేదు.
ఏదిఏమయినా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడానికి చాలా కష్ట పడాలి. అంత సీను మనకెలాగూ లేదు. అందుకని కష్టపడకుండా మన వాళ్లకి మాత్రమే చేతయిన పద్దతిలో లభిస్తున్న ఈ గౌరవాన్ని ఎందుకు కాదనాలి? కాబట్టి అందరం కలసి ఆ అపూర్వ శిశువుకు ఆహ్వానం పలుకుదాం.
మేరా భారత్ మహాన్!
ఇప్పుడే అందిన వార్త (బ్రేకింగ్ న్యూస్ అనాలా!)
సందేహాస్పదులు అన్నంతా అయింది.
ఈ రోజు, అంటే  అక్టోబర్ ముప్పయ్ ఒకటో తేదీన ఏడువందల కోట్ల ఒకటో బిడ్డ పుట్టింది. కాకపొతే ఉత్తర ప్రదేశ్ లోని మరో వూళ్ళో. (ఎందుకయినా మంచిది 'అట' అని చేరిస్తే మంచిదేమో!) ఆ రికార్డ్ శిశువు పేరు నర్గీస్ 'అట' 
కాదు కాదంటోంది మరో ఛానల్. ఫిలిప్పీన్స్ లో ఈ శిశువు జన్మించిందని ఘంటాపదంగా చెబుతోంది. ఎవరెన్ని రకాలుగా చెబుతున్నా ఒక విషయం మాత్రం ఒకే విధంగా చెబుతున్నారు. రోజూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాయి కదా ఈ చానళ్ళు. అందుకే కాబోలు 'రెండు చోట్లా పుట్టింది ఆడపిల్లే!'  
31-10-2011           
Statistics show that 51 babies are born every minute in India and of these 11 babies are born in Uttar Pradesh AFP

గాడిద తెలివి


గాడిద తెలివి



అనగనగా ఓ గాడిద. తన యజమాని దగ్గర ఏళ్లతరబడి  గాడిద చాకిరి చేసి చేసి కొన్నేళ్లకు ముసలిదయిపోయింది. అది  బాగా వున్నన్నాళ్ళు  దానితో అడ్డమయిన చాకిరీ చేయించుకున్న యజమాని, గాడిద  ముసలిది కాగానే దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు. అసలు గాడిదలంటేనే జనాలకు చులకన. ఇక పని చేయలేని, పనికి పనికిరాని గాడిదలను కనుక్కునేదెవరు?

రోజులు బాగాలేని ఆ గాడిద ఓ రోజు ఇంటి దగ్గరలోని  పాడుబడ్డ బావిలో పడిపోయింది.  దానితో పని లేదనుకున్న ఆ గాడిద యజమానికి   దాన్ని  బావిలోనుంచి  పైకి లాగి కాపాడడం అన్నది  డబ్బు దండగ వ్యవహారం  అనిపించింది. పెద్దగా ఆలోచించకుండానే అతడికి ఉభాయతారకమయిన ఉపాయం తట్టింది. పాడుపడ్డ ఆ బావిని  పూడ్చాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ వస్తున్నా ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.  ఇప్పడా బావిని మట్టితో పూడ్చేస్తే  ఆ పని  పూర్తిచేసినట్టూ  అవుతుంది. దానితో పాటే  ఆ ముసలి గాడిదను కూడా  అందులో పూడ్చిపెట్టినట్టూ  అవుతుంది.  అలా ఆలోచించి  అతగాడు ఆ పని మొదలు పెట్టాడు. పైనుంచి కూలీలు తట్టలతో మట్టిని  తన మీద పోస్తున్నప్పుడు కానీ బావిలో చిక్కుకుపోయిన  గాడిదకు అసలు  విషయం   అర్ధం కాలేదు. తను ఎట్లాగో  పనులకు పనికిరాదు. అందువల్ల బావిని పూడ్చే నెపంతో యజమాని తనను వొదుల్చుకోవాలని చూస్తున్నాడు. చావు ముంచుకు రాబోతున్న విషయం అర్ధం చేసుకున్న  గాడిద మరణ  భయంతో  గట్టిగా  వోండ్ర పెట్టసాగింది. అయితే, తనది కేవలం  అరణ్య రోదన అన్న విషయం కూడా దానికి త్వరలోనే బోధపడింది. ఇక తనకు చావు తప్పదు అని నిర్ణయించుకున్న తరవాత   ఆ  గాడిదకు వున్నట్టుండి చావు  తెలివి పుట్టుకొచ్చింది. తట్టల కొద్దీ  మట్టి  పైనుంచి తన మీద పడ్డప్పుడల్లా  గాడిద వొళ్ళు దులుపుకుంటూ కింద పేరుకుపోతున్న మట్టి కుప్పల మీదకు యెగిరి దూకడం మొదలు పెట్టింది.  కూలీలు పోస్తున్న మట్టితో ఆ పాడుపడ్డ బావి నిండిపోసాగింది. మట్టి మీద పడ్డ ప్రతిసారి దాన్ని దులుపుకుంటూ మట్టి కుప్పల మీదకు దూకుతూ  పైకిరావడం ఆ గాడిదకు అంత శ్రమ అనిపించలేదు. పైనుంచి  ఇదంతా  చూస్తున్న యజమానికి ముందు జరుగుతున్నదేమిటో  అర్ధం కాలేదు. అతడికి  అర్ధం అయ్యేటప్పటికల్లా ఆ గాడిద పైకే వచ్చేసింది. బతికి బయట పడ్డ గాడిద బతుకు జీవుడా అని ‘కొరగాని యజమాని  కొలువుకు’  ఓ దండం పెట్టి  తన దారి తాను  చూసుకుంది.
నీతి: తెలివి మనుషుల సొత్తు కాదు. అడ్డగాడిదలకు కూడా తెలివితేటలుంటాయి. (30-10-2011)


NOTE: Courtesy owner of the image used in this blog. 

25, అక్టోబర్ 2011, మంగళవారం

మహాభారత యుద్ధం కవుల కల్పనా? - భండారు శ్రీనివాసరావు

మహాభారత యుద్ధం కవుల కల్పనా? - భండారు శ్రీనివాసరావు  



తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!

కురుక్షేత్ర రణక్షేత్రంలో  మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధ సారం ఎరిగించిన తరువాత ఎరుకన బడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం  ఇదే.
ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన మహా యుద్ధంలో విజయం సాధించిన  యుధిష్టురు
డికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక  అక్షౌహిణుల  సైన్యం నిహతమయింది.  శవాల గుట్టల నడుమ గెలిచిన పక్షాన  బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే  యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని  పక్షంలో మిగిలింది  కేవలం ఏడుగురు మాత్రమే. అటు కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది  నలుగురే నలుగురు.  అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన  విశ్వకేతు.  ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురు సార్వభౌముడు   దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ  ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల  యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన  ఏడు అక్షౌహిణుల పాండవ దండుకు   సైన్యాధ్యక్షుడు  పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా,  ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.
         
ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక మహా సంగ్రామాలలో దేనిలో కూడా ఈ స్తాయిలో మానవ హననం జరిగిన దాఖలాలు లేవు. అయినా కానీ, వీటి  జాబితాలో మహాభారత యుద్ధానికి చోటు దొరకకపోవడానికి కారణం ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషించే  క్రమంలో రూపుదిద్దుకున్నదే ఈ వ్యాసం.

ప్రధమ ప్రపంచ సంగ్రామం , ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. కానీ మహాభారత యుద్ధం అలా కాదు. కురుక్షేత్రం రణక్షేత్రంగా భారత యుద్ధం  ఒక్కచోటనే  ఏకధాటిగా పద్దెనిమిది దినాలు సాగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న ఏ ఒక్క రాజు కూడా తిరిగి తన దేశాన్ని చేరలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా మళ్ళీ  ఇంటికి వెళ్ళలేదు. రణరంగంలో మరణించిన వారందరి కర్మకాండలు యుద్ధభూమిలోనే జరిపిన దాఖలాలు వున్నాయి. భర్తలు వీర మరణం పొందిన కారణంగా వైధవ్యం పొందిన రాణులందరికి హస్తినాపురంలోనే ఆశ్రయం కల్పించారు. అంటే ఏ ఒక్కరు తమ దేశం చేరుకోలేదని అర్ధం.  యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.
సాధారణంగా చక్రవర్తులు  ఇలాటి మహాయుద్ధాలు తలపెట్టినప్పుడు తమకు కప్పం కట్టే సామంత రాజులను, ఇతర మిత్ర దేశాల అధినేతలను సాయం అర్ధించడం పరిపాటి. ఆ సందర్భాలలో సామంతరాజులు, మిత్రదేశాల మహారాజులు చక్రవర్తి కోరికమేరకు అతడు సాగించ బోయే యుద్ధంలో పాల్గొనడానికి తమ  యావత్తు సైన్యాన్ని  వెంటతీసుకుని యుద్ధం జరిగే దూర ప్రాంతాలకు వెడతారు. తమ చక్రవర్తి  విజయం సాధిస్తే సరేసరి. లేకపోతే తమ రాజ్యాలకు తిరిగి రావడమన్న పరిస్తితి సాధారణంగా తలెత్తదు. 
ఆ పరిస్థితుల్లో ఆయా సామంత రాజుల రాజ్యాల్లో ఏమి జరుగుతుంది ? ఎన్నాళ్ళు గడిచినా  యుద్ధానికి వెళ్ళిన రాజు ఆచూకీ లేదు. అతడి సైన్యం జాడ లేదు. ఎన్నేళ్ళు గడిచినా వారిని గురించిన సమాచారం లేదు.   తిరిగి వస్తారో రారో తెలియదు.
కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధాన్నే తీసుకుందాము. కౌరవ పాండవ పక్షాల తరపున అనేకమంది సామంత రాజులు, మిత్ర దేశాల వారు, వారి సమస్త సైన్యాలు పద్దెనిమిది రోజులపాటు జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. అరివీర భయంకరంగా సాగిన ఈ మహా సంగ్రామంలో లక్షలాది సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజులు, సైనికులు  పాల్గొన్న ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యేనాటికి బతికి బట్ట కట్టిన వారి సంఖ్య ఇరువైపులా కలిపి అక్షరాలా పన్నెండుమంది అంటే  ఓ పట్టాన నమ్మడం కష్టమే. కానీ జరిగిందదే.

అనేక దేశాల రాజుల్ని, సైనికులను మూకుమ్మడిగా బలిగొన్న ఈ యుద్ధం ముగిసిన తరువాత ఆ యా దేశాలలో పరిస్థితులు ఏవిధంగా మారి వుంటాయి ? రాజులు  లేని ఆ రాజ్యాలలో స్తితిగతులు ఏవిధంగా తయారయివుంటాయి ? ఈ ప్రశ్నలకు జవాబులు వూహించడం కష్టమేమీ కాదు.
రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు. పైగా  కప్పం కట్టమని చక్రవర్తి తరపున  వొత్తిడి చేసేవారూ లేరు. అసలు చక్రవర్తే లేడు. లేడన్న విషయం కూడా  చాలాకాలం వరకు జనాలకు తెలియనే తెలియదు. అది వేరే విషయం. 
దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది. తాము ఎవ్వరికీ బానిసలం కామన్న ఎరుక వారికి కలుగుతుంది.
ఈ పరిణామాల ఫలితంగా ఆ చిన్ని చిన్ని  రాజ్యాల్లో పెను మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటాయి. యుద్ధానికి వెళ్లి తిరిగి రాని రాజు స్తానంలో  రాజ్యాధికారం స్వీకరించిన కొత్త  రాజుకు కొత్త ఆలోచనలు ముప్పిరిగొనడం కూడా సహజం. రోజులు గడిచేకొద్దీ  తాను సర్వ స్వతంత్రుడిని అన్న భావన ఆ రాజులో  ప్రబలమవుతుంది. తరాలు గడిచేకొద్దీ నూతన తరం రాజుల  ఆలోచనలు మరింత మారుతాయి. తాతల కాలంలో తాము ఒక చక్రవర్తికి  సామంతులం అని గుర్తు చేసుకోవడం  కూడా వారికి  ఇష్టం వుండదు. పైపెచ్చు, అటువంటి చారిత్రిక  ఆధారాలు కనబడితే వాటిని ధ్వంసం చేయడానికి కూడా  వెనుకాడరు. పాత చరిత్రను సమాధి చేసి కొత్త సంస్కృతికి స్వీకారం చుడతారు. ఈ విధంగా చరిత్ర లోని వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి.
మామూలుగా ఏదయినా యుద్ధం జరిగి అది ముగిసినప్పుడు రెండు రకాల పరిణామాలు చోటుచేసుకోవడానికి వీలుంది. కొన్ని సందర్భాలలో చాలాకాలం వరకు స్తబ్ధత నెలకొంటుంది. జరిగిన పరిణామాలను చూస్తూ ఏర్పడ్డ విభ్రమ  నుంచి తేరుకోవడానికి ఎంతో వ్యవధి అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాలలో మార్పులు వూహాతీతంగా ప్రచండ వేగంతో చోటుచేసుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగింది ఇదే.
కౌరవ పాండవ మిత్రదేశాలలో ముందు స్తబ్ధత నెలకొంది. సమాచారం అందక పోవడం వల్ల అలా జరిగివుంటుంది. రాజు లేడు. అతడి సైన్యం లేదు. జనాలకు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్తితి.
అయితే, కొద్ది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముందు చెప్పినట్టు పాత తరం స్తానంలో కొత్త తరం రంగ ప్రవేశం చేస్తుంది. ఆ తరం క్రమంగా మునుపెప్పుడో మహా భారత యుద్ధంలో పాల్గొన్న తమ  పూర్వీకుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే పనిలో పడుతుంది. ఒకానొక  కాలంలో తాము వేరెవ్వరికో కట్టుబానిసలుగా బతికామన్న  చేదు నిజాన్ని నిలువులోతున పూడ్చిపెడుతుంది. ఈ  క్రమంలో అసలు చరిత్ర మరుగున పడుతుంది. పాత  చరిత్రకు కొత్త భాష్యం ఆవిష్కృతమవుతుంది.

యుద్ధాలు జరిగినప్పుడు భౌతిక నష్టాలు మాత్రమే ప్రస్పుటంగా కానవస్తాయి. ఏ యుద్ధం గురించి చెప్పాల్సి వచ్చినా ముందు దానివల్ల వాటిల్లిన ధన, ప్రాణ నష్టాలు గురించే పేర్కొనడం కద్దు. కాని కొన్ని యుద్ధాలవల్ల కలిగే కష్టనష్టాలను రానున్న తరాలు కూడా అనుభవిస్తాయి. హిరోషిమా, నాగసాకీ  ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఆనాటి ఆటంబాంబు పేలుడు కలిగించిన   అణు ధార్మిక ప్రభావం దుష్పరిణామాలను ఆ తరువాత అనేక తరాలు చవిచూడవలసి వచ్చింది. నిజానికి అప్పుడు వాడిన అణుబాంబులు ఇప్పటివాటితో పోలిస్తే నాసిరకమైనవనే చెప్పాలి. అల్పమయిన ఆ అణుబాంబులు మానవాళికి  కలిగించిన నష్టం మాత్రం అనల్పం.
ఈ ప్రస్తావన ఎందుకంటె -
మహాభారత యుద్ధంలో ఇరు పక్షాల  యోధులు అనేక మహిమాన్విత  అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. అవి విడుదలచేసిన అపారమైన శక్తి ప్రభావం  మానవాళిపై పడిందనుకోవాలి. బహుశా ఆ కారణంగానే మనుషులకు మాత్రమే వరంగా లభించిన మానసిక సున్నితత్వం  వారిలో అడుగంటి పోయిందని అనుకోవాలి. నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి.  కలియుగంలో తలెత్త నున్న   వైపరీత్యాలకు, వైకల్యాలకు అప్పుడే బీజం పడి వుండాలి.

మహాభారత యుద్దానంతరం  కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి.  దీనిని గురించిన ప్రసక్తి  కధాచరిత సాగరంలో కూడా వుంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని కలపిరార్ కాలంఅంటారు. చరిత్రకు అందని రాజులు పాలించిన కాలం అని అర్ధం. దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.    
మహాభారత యుద్ధంలో  చోళులు, పాండ్యులు పాల్గొన్నట్టు కొన్ని ప్రాచీన గ్రంధాలలో వుంది. చోళ రాజుల్లో ఒకరు మహా  భారత యుద్ధ  సమయంలో పాండవుల కోసం ఏర్పాటుచేసిన వంటశాల నిర్వహణ బాధ్యతలు చూసేవాడని ప్రతీతి. యుద్ధసమయంలో పాకశాలను నిర్వహించడం అంటే కేవలం వంటచేసే వాళ్లని అర్ధం కాదు. నిజానికి చోళ రాజు తన సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్ళింది యుద్ధంలో పాండవులకు సాయపడానికి. అయితే యుద్ధ వ్యూహంలో భాగంగా కర్తవ్య విభజన చేసే సమయంలో చోళ రాజుకు వంట శాలను ఆజమాయిషీ చేసే  బాధ్యత మీద పడింది.
యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం ముగిసిన తరువాత ఆయా రాజ్యాలలో ప్రబలమయిన శక్తులుగా ఎదిగిన వారందరూ నిజానికి ఆ రాజ్యాలకు సాధికారిక, వంశానుగత  ప్రభువులు కాదు.  వారిలో చాలామంది దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పూర్వ చరిత్రను పూడ్చిపెట్టే  క్రమంలో వారు అనుసరించిన విధానాల ఫలితంగానే  మహాభారత యుద్ధ ప్రసక్తి  ప్రపంచ చరిత్రల్లో నమోదు కాకపోవడానికి  కారణమయివుంటుంది. కాకపొతే అనేక దేశాల చరిత్రల్లో ఒక గొప్ప యుద్ధం జరిగినట్టు మాత్రం పేర్కొన్నారు కానీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

ఈ  సమరంలో  కౌరవ పాండవ సేనలతో పాటు వారి తరపున అనేకమంది రాజులు, సామంత రాజులు వీరోచితంగా పోరాడి వీరస్వర్గం అలంకరించారు. వారితో పాటు వారి సైన్యాలు కూడా ఈ యుద్ధంలో తమ శాయ శక్తులా పోరాడాయి. ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు. వందిమాగధులు సరే సరి. వీరికి యుద్ధంలో కత్తి పుచ్చుకుని పోరాటం చేయాల్సిన అవసరం వుండదు. వారి పనల్లా, ఏరోజుకారోజు సూర్యాస్తమయం తరువాత యుద్ధరంగం నుంచి అలసి సొలసి శిబిరాలకు  తిరిగొచ్చే   సైనిక దళాలను తమ  కళాకృతులతో ఉత్సాహ పరచడమే. యుద్ధంలో పాల్గొనే అవసరం లేనందువల్ల ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు. కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు.  వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు. పరాజిత సైన్యానికి చెందిన వారందరూ  ఆయుధాలతో సహా  విజేత పరమవుతారు.  అయితే ఈ విషయంలో  అస్త్ర శస్త్రాలలో అస్త్రాలకు మినహాయింపు వుంది. ఎందుకంటె  అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.
యుద్ధం ముగిసిన తరువాత ఒంటరిగా మిగిలిన కళా కారుల బృందాలు ఆదరించే నాధుడు లేకపోతే   తిరిగి ఇంటి మొగం పట్టకతప్పదు.కానీ  స్వదేశం చేరగలమనే  నమ్మకం లేని ప్రయాణం. తమను వెంట తీసుకుని యద్ధానికి వచ్చిన తమ రాజే  శాత్రవుల చేతిలో మరణించాడు. గమ్యం అగమ్యం. అందుకే తిరుగు ప్రయాణంలో  మార్గ మధ్యంలో ఏదయినా వసతి దొరకిన చోట ఆగిపోతారు. అక్కడి స్తానికులు ముక్కూ మొగం తెలియని వాళ్లు. అలాటిచోట  ఆశ్రయం సంపాదించాలంటే  వారికి తెలిసిన విద్య ఒక్కటే. తాము దూరప్రాంతంలో  చూసిన దానికి  తమ  కళారూపాలతో ఒక రూపం కల్పించి, దానిని రసవత్తరంగా  ప్రదర్శించి ప్రజల మెప్పు, తద్వారా వారి నుంచి తమకు కావాల్సిన  సాయాన్ని పొందడమే వారికి కనిపించిన దారి. అందులోను  తాము ప్రత్యక్ష సాక్షులుగా వున్నది ఏదో సాదా సీదా వ్యవహారానికి కాదాయె. అరివీర భయంకరంగా సాగిన మహాభారత యుద్ధాన్ని దాపున వుండి గమనించే అవకాశం దక్కిన వాళ్ళాయె.  ఈ ప్రదర్సనల వల్ల  లోక ప్రసిద్దులయిన  కురు వంశపు రాజులు  పరస్పరం తలపడ్డ  మహా సంగ్రామ  విశేషాలను నలుగురికీ తెలియచెప్పి తృణమో పణమో సంపాదించు కున్నట్టూ  వుంటుంది. అలాగే,  తమనీ, తమ  కుటుంబాలనీ  బహుకాలం పోషించిన ప్రభువుల రుణం తీర్చుకున్నట్టూ  వుంటుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ బృందాలలోని
నాట్యకత్తెలు గజ్జె కట్టారు. కవులు, పండితులు  పాటలు  కట్టారు. విదూషకులు తమదయిన  ధోరణిలో చూసినదానికి హాస్యాన్ని జత కట్టారు.  సహజంగా కళాకారులు కాబట్టి తాము చూసిన దానిని వర్ణించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకోవడం సహజం.
నిజానికి  వీరిలో కొందరికి మహాభారత యుద్ధం ఎలా ముగిసిందో  తెలవదు. ఎవరు గెలిచారో తెలియదు. యుద్ధంలో తమ రాజు మరణించగానే , ఇక అక్కడ వుండి చేసేదేమీ లేదు కాబట్టి వారు యుద్ధభూమిని వొదిలి పెట్టి  ఇంటి మొగం పట్టిన వాళ్లు వీళ్ళు. 
మార్గమధ్యంలో తమని ఆదరించి ఆశ్రయం ఇచ్చేవారు తటస్తపడగానే - మహా భారత యుద్ధం జరిగింది మీకు తెలుసా ?’ అని సంభాషణ మొదలు పెట్టేవాళ్ళు. కానీ, అప్పటికి యుద్ధం ఇంకా  కొనసాగుతూనే  వున్న సంగతి వారికి తెలియదు. తమను వెంట తీసుకువచ్చిన రాజు యుద్ధంలో చనిపోయాడని మాత్రమే వారికి తెలుసు.  ఉదర పోషణ కోసం ఒక గొప్ప యుద్ధం ఎలా జరిగిందో వర్ణించి చెప్పేవారు. యుద్ధాలు, పోరాటాలు  మొదలయిన విషయాలు గురించి  తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో వుంటుంది. అదే నిరాశ్రయులయిన కళాకారులకు  భుక్తికి మార్గమయింది. జనాలను మరింతగా  ఆకర్షించడం కోసం తమకు తెలిసిన విషయాలకు రంగులు అద్దేవారు. ఆ విధంగా (ఆ నాటి భరత ఖండపు) దేశ దేశాల్లో మహాభారత యుద్ధానికి సంబంధించిన రకరకాల కధలు విభిన్న రూపాల్లో ప్రచారం లోకి వచ్చాయి. ఒక గొప్ప యుద్ధానికి సంబంధించిన సమాచారం రకరకాల రూపాల్లో  అన్ని ప్రాంతాలకు చేరిపోయింది. ప్రజలకు ఒక గొప్ప  సంగ్రామం జరిగిందని తెలుసు. అయితే, అది మహా భారత యుద్ధం అన్న వాస్తవం ఇతర దేశాలవారికి తెలవదు.
యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం -  యుద్ధం గురించి జానపద కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చిన విభిన్న కధా రూపాలు -  ఆ యా దేశాల్లో అధికారంలోకి వచ్చిన నూతన తరం రాజులు తమ గతం గురించి అనుసరించిన నిరాసక్త విధానాలు -  ఇవన్నీ కలసి  వెరసి మహాభారత యుద్ధానికి చరిత్రలో సముచిత స్తానం లభించకపోవడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.
ప్రాచీన  సుమేరియన్ సంస్కృతిలో చాలా భాగం ఏడుపులు, రోదనల ప్రాతిపదికగా ఏర్పడిందని చెబుతారు. ఒక మహా యుద్ధంలో సైనికులయిన  భర్తలను కోల్పోయిన వీర పత్నులు  కన్నీటితో విలపించిన సన్నివేశాలే వారి ప్రాచీన రచనల్లో కానవస్తాయి.
వారి పురాతన  చరిత్రలో కూడా మహా భారతాన్ని పోలిన కధ వుంది.
ఒక నగరాన్ని నిర్మిస్తారు. జూదం జరుగుతుంది. మరో నగరాన్ని తగలబెడతారు. ఒక మహిళ అవమానానికి గురవుతుంది.   మహాభారతంలో  మాదిరిగా ఈ సన్నివేశాలన్నీ అదే  క్రమంలో జరగవు. కానీ అంశాలన్నీ ఏదోఒక విధంగా భారత కధను గుర్తుకు తెచ్చేవిగా వుంటాయి.
యుద్ధం ముగిసిన తరువాత భర్తలను కోల్పోయిన ఆడవారందరూ కలసి విలపించే అంశంతో సుమేరియన్ ప్రాచీన సాహిత్యం రూపుదిద్దుకుంది.
భారత యుద్ధంలో  రాజుల మరణానంతరం రాణులు విలపించే ఘట్టాన్ని గురించిన ప్రసక్తి మహాభారతంలో కూడా  వుంది. (వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం – Originally published in Tatwa Prakasha News Letter in English - రచయిత )   
(25-10-2011)

 




21, అక్టోబర్ 2011, శుక్రవారం

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు



 
గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.

అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే అడిగాడు.

“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.

“అర్ధం కాలేదు. భారం అంటే?”

“నీకర్ధం కాదులే! ఇప్పడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి.

గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.

“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.

కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.

స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.

ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.

ఆమె ఇలా చెప్పింది.

“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.

“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.

“నవమాసాలు మోసి, ప్రాణాలనే పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.

“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న పిల్లలే పెరిగి పెద్దయిన తరువాత వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ తిరస్కారాలను భరించగల హృదయ వైశాల్యాన్ని వరంగా ఇచ్చాడు.

“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.

“ఇంట్లో ఏఒక్కరికి వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా రేయింబవళ్ళు సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.

“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.

“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి మరచిపోగల మనసును ఇచ్చాడు.

“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.

“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా వరంగా అనుగ్రహించాడు.

“కన్నీరు ఆడవారి సొంతం. తమకు అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి లేదు.

“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న వారి హృదయానికి ప్రధాన కవాటాలు వారి కంటిలోని ఈ కన్నీటి చుక్కలే.”

టీచరు చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.

కానీ, ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు. (21-10- 2011)





18, అక్టోబర్ 2011, మంగళవారం

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఇంతకు ముందు రాసిన ‘వన్ బై టు కాఫీ’ కి ఇది అచ్చంగా అద్దంలో అక్షరం లాటిది. అంటే పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. అందుకే - ‘ఫీకా టు బై న్ వ’ అని శీర్షికాసనం వేయాల్సి వచ్చింది.

అదేమో నలభైఏళ్ల కిందటి ముచ్చట. ఇదేమో ఈనాటి తాజా కధ.

రామానికి చదువంటే ఇష్టమే కానీ ఇంజినీరింగ్ అస్సలు ఇష్టం లేదు. తలిదండ్రుల ముచ్చట తీర్చడానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమెరికా అంటే మాటలా. అవకాశాలకు పుట్టినిల్లు. వాటిని వెదుక్కుంటూ వెళ్ళే ధీశాలులకు అదొక పోతుగడ్డ. ఆ దేశపు గడ్డ మీద కాలుమోపగానే రామానికి జీవిత ధ్యేయం నెరవేరిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటె అమెరికా ఉద్యోగం అన్నది తన ఒక్కడి కల కాదు. కుటుంబం యావత్తు కలసి కన్న స్వప్నం.

రామం ఏమీ కలిగిన కుటుంబం నుంచి రాలేదు. అతడి తండ్రి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.అప్పటికి వాళ్లకు మిగిలిన స్తిరాస్తి ఒక బెడ్ రూమ్ ఫ్లాట్.


అమెరికా రావడంలో అతగాడి లక్ష్యం ఒక్కటే. కనీసం ఇక్కడ అయిదేళ్ళు వుండాలి. వున్నన్ని రోజులు బాగా సంపాదించాలి. సంపాదించిన దానిలో చేతనయినంత కూడబెట్టాలి. కూడబెట్టిన డబ్బుతో ఇండియాకు తిరిగెళ్లి అమ్మానాన్నను బాగా సుఖపెట్టాలి.

ఆలోచన బాగానే వుంది కానీ, ఆచరణ అంత సులభం అనిపించలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఇంటి మీద ధ్యాస మళ్ళింది. ప్రతి క్షణం అమ్మా నాన్నా గుర్తొచ్చేవాళ్ళు.

వారం వారం ఫోను చేసి వారితో గంటలు గంటలు మాట్లాడేవాడు.ఇందుకోసం చౌకగా దొరికే ఇంటర్నేషనల్ టెలిఫోన్ కార్డులు వాడేవాడు.

రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లు మెక్ డొనాల్డ్ బర్గర్స్, డిస్కోలలో సాయం కాలక్షేపాలు.

అంతేనా అంటే అంతే కాదు. డాలరు విలువతో పోల్చి రూపాయి బలహీనపడుతుంటే ఎంతో సంతోషం వేసేది. మామూలుగా పంపే డాలర్లతోనే ఇంటికి ఇంకా ఎక్కువ డబ్బు పంపొచ్చుకదా అన్న అల్పానందం.



చేతినిండా డబ్బులు. పర్సు నిండా క్రెడిట్ కార్డులు. మనసు నిండా సంతృప్తి. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి?

అటు ఇండియాలో అతడి అమ్మానాన్నా పెళ్ళికి తొందర పెడుతున్నారు. వాళ్ల కోరిక తీర్చాలనిపించింది. ఇంటికి ఫోను చేసి చెప్పాడు వీలుచేసుకుని వస్తానని. ఈలోగా అమ్మాయిని చూడమని. వున్న సెలవులు తక్కువ. అంతా పది రోజుల్లో అయిపోవాలన్నాడు. నెట్లో వెతికి ఇండియా వెళ్లి రావడానికి అతి చౌకలో టిక్కెట్లు కొనేశాడు. పనిలో పనిగా మార్కెట్లన్నీ గాలించి చుట్టపక్కాలందరికీ చిన్న చిన్న గిఫ్ట్ వస్తువులు కొన్నాడు. లేకపోతే మాట దక్కదు మరి. పొరబాటున ఎవరినయినా మర్చిపోతే ఇక అంతే సంగతులు. మాటలు కటీఫ్.


ఇంటికి రాగానే వారం రోజులు ఇంట్లోనే మఠం వేసుకు కూర్చున్నాడు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఒకటే పని. అమ్మానాన్నా ఎంపికచేసిన అమ్మాయిల ఫోటోలు చూడడం. నచ్చలేదని టిక్కుబెట్టడం. చూస్తుండగానే తిరుగు ప్రయాణం తేదీ దగ్గరపడింది. దాంతో హడావిడిగా ఒక పెళ్లికూతురును సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.

రెండంటే రెండురోజుల్లో పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వాళ్లు వచ్చారు. రానివాళ్ళు రాలేకపోయినందుకు విచారిస్తూ గ్రీటింగులు పంపారు. వాటిల్లో కొన్ని అందాయి. మరికొన్ని అతడు ఇండియా వొదిలివెళ్ళిన తరువాత చేరాయి. ‘ఇదా తను కోరుకున్న పెళ్లి. ఇదా ఇన్నాళ్ళుగా కలలు కన్న పెళ్లి.

అమెరికా జీవితాలు అంతే. నచ్చిన పిల్ల దొరకకపోతే వచ్చిన పిల్ల నచ్చిందని సరిపుచ్చుకోవాలి’


అమ్మా నాన్న చేతిలో కొంత డబ్బు పెట్టి, భార్యను తీసుకుని అమెరికా విమానమెక్కాడు.


అందరిలాగే రామం భార్య కూడా అమెరికా వైభోగం చూసి చాలా సంతోషపడింది. ప్రతి వీకెండ్ పనికట్టుకుని ఒక కొత్త ప్రదేశం చూపించాడు. కొత్త కాపురమాయే. వున్న ఇల్లు మార్చి పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఆదాయంలో తేడాలేదు. తేడా అల్లా ఖర్చుల్లోనే. మునపటికీ, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల భారం పెరిగింది. బ్యాంకులో బాలన్స్ తరిగింది.

మరో రెండేళ్లు గడిచాయి. ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మానాన్నని అమెరికా పిలిపించుకోవాలన్న ఆరాటం మొదలయింది. కానీ, ఆచారం ప్రకారం పురిటికి రామం అత్తా మామా వచ్చారు. వారికి తమ వైభోగం చూపించాలనే తాపత్రయంలో అలవికి మించి ఖర్చు పెట్టాడు. ఫలితం బ్యాంక్ బాలన్స్ సున్నా అయింది. క్రెడిట్ కార్డుల భారం బాగా పెరిగింది.

ఇండియాలో రామం అమ్మానాన్నకు మనుమడినీ, మనుమరాలినీ చూడాలనే తాపత్రయం పెరిగింది. ఫోను చేసిన ప్రతిసారీ ఇండియా రమ్మనే వారు. ఉద్యోగ బాధ్యతలవల్ల కొంత, డబ్బు సమస్యవల్ల కొంత ప్రయాణం పెట్టుకోవడానికి వీలుకాలేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఇండియా వెళ్లి అమ్మానాన్నను చూడాలనే కోరిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది.

హఠాత్తుగా ఒక రోజు తల్లీతండ్రికి వొంట్లో బాగాలేదనే కబురు తెలిసింది. వెంటనే వెళ్ళడానికి ఆఫీసులో తీరుబడి లేని పని. నిజానికి వారిద్దరూ యాత్ర కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. ఆ కబురు రామం చుట్టపక్కాలకు కూడా ఆలశ్యంగా తెలిసిందట. దానితో అమెరికా వరకు ఆ సమాచారం చేరేసరికి మరికొంత ఆలశ్యం జరిగింది. రామం తలిదండ్రులకు రామం ఒక్కడే సంతానం. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎవ్వరూ లేరు. అమెరికాలో కూడా ఒంటరే. ఆఫీసులో రామం పని అతడు లేనప్పుడు చూసేవారు లేరు. చేసేవారు లేరు. అందుకే ఓ పట్టాన సెలవు దొరకదు. ఇండియా పోలేక వుసూరుమనిపించినా ఆసుపత్రి ఖర్చులకు డబ్బు పంపి వూరుకోవాల్సివచ్చింది.



రోజులన్నీ ఒక్కలాగే వుండవనడానికి అమెరికా ఒక పెద్ద ఉదాహరణ. ఆర్ధిక మాంద్యం కారణంగా చేస్తున్న రామం ఉద్యోగం పోయింది. కొత్తది దొరకడం అసాధ్యంగా మారింది. కాస్తో కూస్తో కూడబెట్టింది అప్పులు తీర్చడానికి సరిపోయింది.


విధిలేని స్తితిలో ఇండియాకు తిరిగొచ్చారు. వాళ్లని చూసి రామం అమ్మా నాన్నా ఎంతో సంతోషించారు. వున్న ఒకేవొక్క బెడ్ రూమ్ వాళ్లకు ఇచ్చారు. పిల్లలు ముందు ఇబ్బంది పడ్డా తరువాత సర్డుకున్నారు. ఎందుకంటె అమెరికాలో కలికానికి కూడా దొరకని ఆపేక్షలు, అనురాగాలు వారికి ఆ ముసలివారిదగ్గర లభించాయి.

కూడబెట్టింది ఏమీ లేదు అమెరికా అనుభవం తప్ప. తండ్రి సంపాదించి కొన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఒక్కటే చివరకి అవసరానికి అక్కరకు వచ్చింది.

ఎండమావి వెంట పరుగులు తీస్తే దాహం తీరదన్న నగ్న సత్యం తెలిసివచ్చింది.(18-10-2011)

(ఎన్నారై ఒకరు ఈమధ్య నెట్లో ఇంగ్లీష్ లో ఒక పోస్టింగ్ పెట్టారు. మూలాంశం అందులోనిదే. కాకపోతే ముగింపు నచ్చలేదు. కన్నబిడ్డను చూడకుండానే తలితండ్రులు చనిపోతారు. పిల్లలు అమెరికన్లను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతారు. అమెరికన్ స్వేఛ్చా జీవితానికి అలవాటుపడిన భార్య విడిపోతుంది. నిరాశావాదంతో ఆ గల్పిక ముగుస్తుంది. అందుకే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. పేరు తెలియని ఒరిజినల్ రచయితకు మనః పూర్వక ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు)

17, అక్టోబర్ 2011, సోమవారం

వన్ బై టు కాఫీ - భండారు శ్రీనివాసరావు

వన్ బై టు కాఫీ - భండారు శ్రీనివాసరావు







నలభై ఏళ్ళ కిందటి మాట.

ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన ఒక్క కాఫీని కాసేపు అటూ ఇటూ మార్చుకుంటూ తాగి వెళ్ళిపోయాడు.



మరో సారి కూడా ఆ హోటల్లో అదే పెద్దమనిషి తారస పడ్డాడు. మళ్ళీ అదే సీను. ఒక్కడే మనిషి. వన్ బై టు కాఫీ. ఇక మనసు ఉగ్గపట్టుకోలేకపోయాను. కలిసి కదిలిస్తే కదిలిన కధ ఇది.

ఆయనో ఎలిమెంటరీ స్కూలు మాస్టారు. ఒక్కడే కొడుకు. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి కరుణ అపారం. క్లాసులో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్. హోల్ మొత్తం ఆ ఏరియాలోనే చదువులో ఫస్ట్. ఇరుగు పొరుగు పిల్లాడిని మెచ్చుకుంటూ మాట్లాడే మాటలే వాళ్లకు కొండంత బలం ఇచ్చేవి. ‘పిల్లాడంటే మీ వాడు మాస్టారు. మా పిల్లలూ వున్నారు ఎందుకు తిండి దండగ” అంటుంటే ఆ తలిదండ్రులు మురిసి ముక్కచెక్కలయ్యేవారు.


కొడుకు చదువుపై మాస్టారికి కాణీ ఖర్చు లేదు. అంతా స్కాలర్ షిప్పుల మీదనే నడిచిపోయింది. అతగాడు కూడా - చిన్న చదువులప్పుడు మాత్రమే కనిపెంచిన వారితో కలసి వున్నాడు. ఆ తరువాత పొరుగూర్లలోని పెద్ద కాలేజీల్లో పెద్ద చదువులు చదివాడు. కొన్నాళ్ళకు అవీ అయిపోయాయి. పై చదువులు చదవడానికి ఈ చిన్న దేశం సరిపోలేదు. అమెరికా వెళ్లాడు. అక్కడా చదువులో మెరిక అనిపించుకున్నాడు. ఆ చదువులకు తగ్గ పెద్ద ఉద్యోగం అక్కడే దొరికింది. కానీ, ఇండియాకు వచ్చి తలిదండ్రులను చూసే తీరిక దొరకలేదు. అది దొరికే లోపలే అక్కడే ఓ దొరసానిని పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ల ఫోటోలు చూపిస్తూ ‘మా మనవళ్ళు’ అని వూళ్ళో వాళ్లకు చెప్పుకుని మురవడమే ఆ ముసలి తలిదండ్రులకు మిగిలింది. డబ్బుకు కొదవలేదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఇండియా బ్యాంకులో రూపాయల పిల్లలు పెడుతున్నాయి. కానీ ఒక్కగానొక్క పిల్లాడు కళ్ళెదుట లేకుండా, ఎక్కడో దూరంగా వుంటూ పంపే ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్తితి. ఇది వాళ్లకు కొత్తేమీ కాదు. చిన్నప్పటినుంచి చదువుల పేరుతొ పరాయి చోట్లనే పెరిగాడు. పట్టుమని పది రోజులు కలసివున్నది లేదు.

‘ఇంకా వస్తారు వస్తారు’ అనుకుంటూ వుండగానే, పిల్లాడిని, వాడి పిల్లల్ని కళ్ళారా చూడకుండానే ఆ కన్న తల్లి కన్ను మూసింది.

కబురు తెలిసి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని అమెరికానుంచి ఆర్చుకుని, తీర్చుకుని వచ్చేసరికే కర్మకాండ అంతా ముగిసిపోయింది.

వచ్చిన వాళ్లకు ఇంట్లో సౌకర్యంగా వుండదని వున్న నాలుగు రోజులు పెద్ద హోటల్లో గదులు అద్దెకు తీసుకుని వున్నారు. మనుమళ్లని దగ్గరకు తీసుకోవాలని వున్నా ఏదో జంకు. ‘తిస్ యువర్ గ్రాండ్ పా’ అని తండ్రి పరిచయం చేస్తే ‘య్యా! హౌ డూ’ అని పలకరించారు. వాళ్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే జవాబు చెప్పలేని అశక్తత. రెండో తరగతి టిక్కెట్టు కొనుక్కుని ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న అనుభూతి.

అమెరికా తమతో రమ్మన్నారు. తాను రానన్నాడు. భార్య కలిసిన మట్టిలోనే కలసిపోవాలన్నది తన కోరిక.


వొంటరి జీవితంతో వొంటరి పోరాటం మళ్ళీ మొదలు.

కానీ, ఈసారి మొదలుపెట్టే జీవన యానంలో తాను వొంటరి కాదు. తనతో పాటు మరొకరు వున్నారు. ఆ వ్యక్తి మరో లోకానికి వెళ్ళిన భార్యా? మరో దేశానికి వెళ్ళిన కొడుకా? యేమో.

‘అందుకే ఈ వన్ బై టు కాఫీ’ ముగించాడు ముసలాయన. (17-10-2011)

15, అక్టోబర్ 2011, శనివారం

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు

తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే  ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.


మాటలు కోటలు - చేతలు బీటలు






‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’


ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.


ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?


ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.


అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.


కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.


అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)

11, అక్టోబర్ 2011, మంగళవారం

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు?
ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు  

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.



సంపుటం - 43 సంచిక - 4 బుధవారం 4-4-1956 6 పేజీలు 1 అణా

‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి

కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం

అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన

(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)

కర్నూలు, ఏప్రిల్ 3

‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.

ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.

నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.

హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.

'ఆంధ్ర' లో దోషం లేదు

తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.

‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’

చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.


(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – రచయిత, 11-10-2011)

10, అక్టోబర్ 2011, సోమవారం

అయితే ఒకే!

అయితే ఒకే!





ఏకాంబరం కొడుకును పిల్చి చెప్పాడు.


‘నాకు నచ్చిన పిల్లనే నువ్వు పెళ్లి చేసుకోవాలి.’


‘అది కుదిరే పని కాదు.’ కొడుకు ఖరాఖండిగా జవాబిచ్చాడు.


‘నేను ఎంపిక చేసే అమ్మాయి ఎవరనుకున్నావు. బిల్ గేట్స్ కూతురు.’


‘అలా అయితే నాకు ఓకే!’


కొడుకు టక్కున ఒప్పేసుకున్నాడు.


ఏకాంబరం బిల్ గేట్స్ దగ్గరకు వెళ్లి తన కొడుక్కు ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమన్నాడు.


బిల్ మహాశయుడు కుదరదు కాక కుదరదు పో! అన్నాడు.


‘నా కొడుకు వరల్డ్ బ్యాంక్ సీఈఓ’ చెప్పాడు ఏకాంబరం.


‘అయితే నాకు ఓకె’ అన్నాడు బిల్ గేట్స్.


ఏకాంబరం నేరుగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లాడు.


వెళ్లి తన కొడుక్కు వరల్డ్ బ్యాంక్ సీ.ఈ.ఓ. గా ఉద్యోగం ఇమ్మన్నాడు.


అది అయ్యేపని కాదని ఆయన తేల్చి చెప్పాడు.


‘నా కొడుకంటే ఎవరనుకున్నావు? వాడు సాక్షాత్తు బిల్ గేట్స్ కు కాబోయే అల్లుడు.’ బదులిచ్చాడు ఏకాంబరం.


‘అయితే నాకూ ఓకే!’


ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు వరల్డ్ బ్యాక్ ప్రెసిడెంట్.


ఇలా వుంటాయిట పెద్దోళ్ల బిజినెస్ వ్యవహారాలు.

నెట్లో అందిన ఇంగిలీసు జోక్కి- మక్కికి మక్కి కాని తెలుగు అనువాదం – భండారు శ్రీనివాసరావు
(10-10-2011)

3, అక్టోబర్ 2011, సోమవారం

సేకరించిన ‘శ్రీ’ సూక్తాలు – భండారు శ్రీనివాసరావు





‘శ్రీకరా! అంటే ఒట్టు – సూకరా అంటే తిట్టు – అన్నాడు మహాకవి’


‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’


‘శాస్త్రం – చట్టం ఒప్పుకుంటే దొంగే దొర’


‘రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం’


‘పిసినారిని మించిన దాత లేడు’


‘కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని ఆహ్వానించ లేనివాళ్ళు పాత మోడల్ కారు మాదిరిగా మిగిలిపోతారు.’


‘భక్తులందు వీ.ఐ.పీ. భక్తులు వేరయా అన్నాడు వేమన్న’


‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు - కానీ, ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా అనే డౌటు.


‘కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది. నిజమే! కానీ టైం కు కూడా టైం ఇవ్వకపోతే పాపం టైం మాత్రం ఏం చేస్తుంది?’


‘చిన్న దొంగలు జిల్లాలో జైళ్ళలో మగ్గుతుంటారు. పెద్ద దొంగలు జనం మధ్యే దొరల్లా తిరుగుతుంటారు’


‘విన్నది మరచిపోతాము. చూసింది గుర్తుంటుంది. చెయ్యడం వల్ల విషయం బోధపడుతుంది.’


‘నాలికతో ఎలా మాట్లాడాలో తెలియడానికి మనిషికి మూడేళ్ళు పడుతుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియడానికి జేవితకాలం కూడా సరిపోకపోవచ్చు’

(03-10-2011)





1, అక్టోబర్ 2011, శనివారం

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణం సాగిస్తోంది. కంప్యూటర్ పుణ్యమా అని నాకు ఈ పుణ్యమూర్తి పరిచయ భాగ్యం కలిగింది. అదెలాగో తెలుసుకోవాలంటే- కొద్దిగా వెనక్కు వెళ్ళాలి.

2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకుని వుంటున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి. బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ దగ్గర కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే నాకు సీతమ్మ పరిచయం అయింది. తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మను చూస్తూ నా వాకింగ్ మొదలయ్యేది.


'ఆ మహాతల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఆమె బొమ్మ పెట్టడం లేదు'

అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్టపడేది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటువుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు.

అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ , వస్తూనో పోతూనో కాసేపు ఆగి ఆమెతో మాటలు కలిపేవాడిని. అన్ని విషయాలు ఒక్కసారే చెప్పకపోయినా కొద్ది కొద్దిగా ఆమె తన గురించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది.

సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్న తనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవుకానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. అప్పటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.

ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళ ల్లో పాచిపనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొ ప్పుకోలేదు. వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటివాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్టచెబుతుంది.

సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పడు పది రూపాయలనోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.

బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.

‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది.

(01 - 10 - 2011)