16, జులై 2011, శనివారం

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.

ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా, ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు అమ్మ ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.

ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.

మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”

అప్పుడు నాన్న చెప్పిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై పేరు నెయ్యి  రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”

నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.

“ ఒరేయ్ నాన్నా”

నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.

“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే బాగా అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!

“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో.

“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు. మనం ఇష్టపడ్డ మనుషులే మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం. నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.

“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.

“మళ్ళీ చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.

“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:

జీవితంలో మీరు కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు కోరుకునే వ్యక్తులను మీ మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే ఇతరులతో మీ సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది.
 (16-07-2011)

2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

మాడిపోయిన అన్నం చేక్కలకి పేరునెయ్యి రాసుకుని తిన్న చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. మాకు అప్పుడు అది ఒక ట్రీట్ గ ఉండేది. మీరు చెప్పిన నీతి మాత్రం సూపర్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju- చక్కగా గుర్తు చేశారు. నేను రాసినట్టు అది వెన్న కాదు. పేరు నెయ్యి. ధన్యవాదాలు- భండారు శ్రీనివాసరావు