22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు


(22-04-2011 తేదీన సూర్య దినపత్రికలో ప్రచురితం)

అలనాడు కౌరవ సభలో ధర్మరాజు శకుని ఆడిన కపట ద్యూతంలో సమస్తం కోల్పోయి ఆఖరుకు పణంగా వొడ్డిన ఆలిని కూడా పోగొట్టుకున్న తరువాత అంతఃపురంలో వున్న ద్రౌపదిని నిండు కొలువుకు తీసుకురమ్మని దుర్యోధనుడు తన కింద పనిచేసే ప్రాతికామిని ఆదేశిస్తాడు. తనను కొనిపోవచ్చిన ప్రాతికామినిని ద్రౌపది ఒకే ఒక ప్రశ్న వేసి దానికి జవాబు తెమ్మని కోరుతుంది. జూదంలో ధర్మరాజు ముందుగా ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ అన్నది ద్రౌపది తెలుసుకోదలచిన ధర్మసూక్ష్మం. పైగా దీనికి సమాధానాన్ని ధర్మకోవిదుడయిన భీష్ముడి నుంచి రాబట్టాలనుకుంటుంది.

సరిగ్గా ఇప్పుడు అదే సందేహం ఆంధ్ర ప్రదేశ్ విధానసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు మరో రూపంలో నిలుచుంది. టీడీపీ సభ్యుడిగా రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలా లేక సభ్యుడు నేరుగా స్పీకర్ కు పంపిన రాజీనామాను ఆమోదించాలా అన్న ధర్మసంకటంతో ఆయన చాలాకాలంగా గుంజాటన పడుతున్నారు. ద్రౌపది మనసులో మెదిలినట్టుగా వీటిల్లో ఏది ముందు ఏది వెనుక అనే మీమాంస నుంచి బయటపడడానికి మనోహర్ ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్టుంది. కాకపొతే, కడప ఉపఎన్నికల రూపంలో తరుముకొచ్చిన రాజకీయ వొత్తిళ్ల దృష్ట్యా ‘జగన్ అనుచర ఎమ్మెల్యేల’ విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన స్తితి దాపురించడంతో ఆయన హడావిడిగా న్యాయ నిపుణులను సంప్రదించి, అనర్హత వేటు వేసే విషయంలో ముందు టీడీపికి చెందిన ముగ్గురు సభ్యులకు సంజాయిషీ నోటీసులు పంపారు. ఈ సభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న తాపత్రయం కంటే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కట్టడి చేయడం అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిపోయింది. రాజాజ్ఞను ధిక్కరిస్తూ హరి భజన చేసే ప్రహ్లాదుడిపై బెత్తం ఎత్తలేని అసహాయ గురువులు చండామార్కులు - ఇతర రాక్షస విద్యార్ధులపై దండ ప్రయోగం చేస్తూ, వాటిని చూసయినా రాజకుమారుడు బెదిరిపోయి దారికి రాకపోతాడా అని ప్రయత్నించిన చందంగా – స్పీకర్ కార్యాలయంలో చాలాకాలంగా పెండింగ్ లో పడి వున్న ’అనర్హత’ పిర్యాదులను వెలికి తీసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపెట్టి ముందుగా సంబంధిత సభ్యులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తదనుగుణంగానే, అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. లోగడ ఇదే మాదిరి నోటీసు అందుకున్న మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తాజాగా ఇంకో నోటీసు ఇచ్చారు. అంతకుముందు అందుకున్న నోటీసుకు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వడం జరిగింది కానీ, ఆ తరవాత కూడా ఆయన సొంత పార్టీని లెక్క చేయకుండా ఢిల్లీ, విజయవాడలలో జరిగిన జగన్ కార్యక్రమాలకు హాజరయినందువల్ల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణ అయినందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, స్పీకర్ కు మరోసారి పిర్యాదు చేసిన నేపధ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మనోహర్ నోటీసు పంపారు. దీనికి ఆయన ఇచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపోస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి కూడా జగన్ వెంట వెడుతున్న తమ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై సయితం చర్య తీసుకుని అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని నిర్ణయించారు.

ఎన్నో నెలలుగా పెండింగులో వున్న అంశాలకు ఇంత ఆదరాబాదరాగా స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటీ స్పీకర్ స్పందించడానికి కారణాలు వూహించడం కష్టమేమీకాదు. పేరుకు స్పీకర్ పదవి అన్నది రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సినదే అయినా ఆచరణలోకి వచ్చేసరికి అధికారంలో వున్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. పొరుగున వున్న కర్నాటకలో జరిగింది కూడా ఇదే.

కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని అసమ్మతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి హడావిడిగా అటు ముఖ్య మంత్రిని, డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను విడివిడిగా కల్సుకుని సంప్రదింపులు సాగించారు. వీటికి తోడు జగన్ వర్గానికి మద్దతు తెలుపుతున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టిని కలుసుకున్నట్టు వార్తలు వెలువడడంతో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలు వెల్లువెత్తాయి. ‘ఏ క్షణంలోనయినా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం’ అంటూ టెలివిజన్ తెరలపై ఒక రోజల్లా స్క్రోలింగులు పరిగెత్తాయి. ఆయా పార్టీల ప్రతినిధులు, విశ్లేషకులు జరుగుతున్న పరిణామాలపై తమ తమ అభిప్రాయాలతో కొన్ని గంటలపాటు శ్రోతలను హోరెత్తించారు. తమపై వేటు వేసే తెగింపు కాంగ్రెస్ నాయకత్వానికి ఎక్కడిదన్న ధోరణిలో జగన్ మోహన్ రెడ్డికి తొలినుంచి బాహాటంగా బాసటగా నిలబడ్డ కొండా సురేఖ ఎద్దేవా చేశారు. అనర్హత వేటు వేస్తె దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయని అంటూ ‘మరో ఆగస్టు సంక్షోభం’ గురించి ప్రస్తావన తెచ్చి ప్రభుత్వ పతనం తప్పదన్న తీరులో హెచ్చరికలు చేశారు. ఏతావాతా ఏమిజరిగిందో కానీ, కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చిన ‘ఆ క్షణం’ రాకుండానే ఇరవై నాలుగ్గంటలు లక్షణంగా గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోని ఈ విలక్షణ లక్షణం మరోమారు వెలుగు చూడడం మినహా జరిగిందేమీ లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తొలుత తీసుకున్న నిర్ణయం అమలును ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమయిన చిక్కులు ఎదురవకుండా జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతను ఆపాదించేందుకు వీలయిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని పకడ్బందీగా పిర్యాదు చేయాలన్నదే వాయిదాకు కారణంగా చెబుతున్నారు.ఒక్క పెట్టున అందరిపై వేటు వేయాలా లేక కొందరిపై ముందు చర్య తీసుకుని మిగిలినవారికి తద్వారా హెచ్చరికలు పంపాలా అన్న విషయంలో ఆ పార్టీ నాయకులకు ఇంకా స్పష్టత వచ్చినట్టులేదు. ఏ అడుగు వేస్తె ఏమవుతుందో, దాని ప్రభావం కడప ఎన్నికలపై ఏవిధంగా వుంటుందో అన్న గుంజాటనలో పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వుంది. చివరకు తెముల్చుకుని పిర్యాదు చేసినా దానిపై చర్యకు ఎంతోకొంత కాలం పడుతుంది.

కాగా, కడప ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, జగన్ వోటమి అన్న ఒక్క లక్ష్యాన్నే పెట్టుకుని సర్వశక్తులు వొడ్డి పోరాడుతున్నట్టుగావుంది. సగానికి సగం మంత్రివర్గాన్ని కడపలో మోహరించి, గెలుపుకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వొదిలిపెట్టరాదన్న ధ్యేయంతో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుత వాతావరణం తెలుపుతోంది. అందుకే, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి - జగన్ కు, భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి మాట్లాడే సరికొత్త వ్యూహానికి తెర లేపారు. దాన్ని అందిపుచ్చుకున్న పార్టీ నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జగన్ పార్టీకి ముస్లిం వోటర్లను దూరం చేసే ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాను అనుదినం విమర్శిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి లోకసభలో అడుగు పెడితే ఆయన వేసే తొలి అడుగులు బీజేపీ వైపే అని తేల్చిచెప్పడం మొదలెట్టారు. సాధారణంగా ఇటువంటి వూహాజనిత అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదని దాటవేసేవారు కూడా అధ్యతన భావిలో జగన్ పార్టీ బీజేపీ పంచన చేరుతుందని బల్ల గుద్ది చెబుతుండడం చూస్తే ఇది ఖచ్చితంగా కడప ఉప ఎన్నికలకోసం రూపొందించిన ఎత్తుగడగా అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి తగ్గట్టే మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.

అలాగే, తెలంగాణా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాలని వస్తున్న డిమాండ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రధాన పార్టీలే ఈ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నప్పుడు అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ విధివిధానాలు ఏమిటన్న ప్రశ్న అర్ధరహితం.

ఈ ఎన్నికల సందర్భంగా వెలువడుతున్న అన్ని రకాల అభిప్రాయాలపై ప్రజలు తమ తీర్పును కొద్ది రోజుల్లో చెప్పబోతున్నారు. అది శాసన సభ్యుల అనర్హత విషయం కావచ్చు, అక్రమార్జనలతో సాగించే ఎన్నికల పోరాటాలు కావచ్చు, అవకాశవాద రాజకీయాలు కావచ్చు – అంశం ఏదయినా తుది తీర్పు ప్రజలదే. అంతిమ నిర్ణయం జనాలదే. వోటు వేసే వోటరుకే పాలకులపై వేటు వేసే హక్కు వుంటుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఎవరయినా గుర్తుంచుకోవాల్సిన ప్రాధమిక పాఠం ఇది.

సాధారణంగా ఉపఎన్నికల్లో ఒకటి రెండు స్తానాలు గెలుచుకున్నా పోగొట్టుకున్నా పాలకపక్షానికి వచ్చేదీ పోయేదీ యేమీవుండదు. కానీ ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం ఎంతో విలక్షణమయినది. అందుకే, దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు కూడా కడప ఉప ఎన్నికల ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించ లేకపోయాయి. జాతీయ మీడియా సైతం ఈ ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కడప ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ స్తాయిలో సైతం ప్రభావితం చేసే అవకాశాలు వుండడమే దీనికి కారణం.(21-04-2011)

కామెంట్‌లు లేవు: