21, ఏప్రిల్ 2011, గురువారం

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు




జాతి వైరం కుక్కలకు సహజం. ఒక కుక్కని చూస్తే మరో కుక్కకు గిట్టదు. కొంపలంటుకు పోయినట్టు మొరగడం మొదలు పెడతాయి. ఈ సంగతి తెలిసికూడా పంజాబులో ఇద్దరు సర్దార్జీలు కోరి తెచ్చుకున్న కొట్లాట పుణ్యమా అని పోలీసు కేసులో చిక్కుకున్నారు.

ఆ ఇద్దరూ ఇరుగుపొరుగూ వారే. కానీ వారి పెంపుడు కుక్కలకు మాత్రం ఏమాత్రం పొసగదు. కనబడగానే కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటాయి. గయ్యి గయ్యిమని మొరుగుతాయి. ఈ వ్యవహారం ఆ యజమానులకు సుతరామూ నచ్చలేదు. అక్కడితో ఆగితే పోయేది. ఎదురుపడగానే కుక్కల మొరుగుడు గుర్తుకువచ్చి గిల్లి కజ్జా పెట్టుకునేవారు. అంతటితో ఆగితే ఏ పేచీ లేదు. చేతులు లేపారు. చేతులు సరిపోక ఇనుప కమ్మీలతో దొమ్మీలకు దిగారు. అంతదాకా తీరిగ్గా అంతా చూసిన పోలీసులు సమయం చూసి రంగంలోకి దిగి ఇద్దర్నీ స్టేషనుకు పట్టుకుపోయి అక్కడ చేయాల్సిన సన్మానం చేశారు. అప్పటికి కానీ ఆ యజమానులిద్దరు శాంతించలేదు. వాళ్ళు తాత్కాలికంగా రాజీపడి చేతులు కలిపినా కుక్కలు మాత్రం ఇళ్ళల్లో కూర్చుని తాపీగా మొరుగుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నాయి.(17-02-1983 నాడు రేడియోలో ప్రసారితం)







వొండివార్చే పని లేకుండా వడ్డించే విధానాన్ని డాక్టర్ విగ్మూర్ అనే విదేశీ వనిత కనుక్కుంది. కాయగూరలను వొండకుండా ఎలావున్నవాటిని అలానే కొరుక్కుని తినాలన్నది ఆవిడ గారి థియరీ. నిజానికి ఇది కొత్త విద్యేమీ కాదు. వెనుక పురాణాల్లో విన్న కంద మూలాల కధే. కానీ చెప్పేది విదేశీ అమ్మడు కాబట్టి నమ్మినా నమ్మకపోయినా వినకతప్పదు కదా! ఇలా తింటే వంట తంటా తప్పడమే కాకుండా వొంటికి సరిపడే పుష్టి బ్రాండ్ ఆహారం దొరుకుతుందని ఆవిడ చెబుతోంది. వండడం వల్ల కూరగాయల్లో వుండే సహజమయిన విటమిన్లు తగ్గిపోతాయని హెచ్చరిస్తోంది. పచ్చి కూరగాయల్ని పచ్చి పచ్చిగా తినడం మొదట్లో కొంత కష్టంగా వున్నా పోను పోను అలవాటయి ఇష్టంగా మారుతుందని ఆవిడ ఢంకా బజాయించి చెబుతోంది.


విగ్మూర్ చెప్పే మాటలు కరక్టే అనే వ్యక్తి మనదేశంలోనే ఒకాయన వున్నారు. పచనం ప్రసక్తి లేకుండా పచ్చి కూరలు తింటూ, పళ్ళరసాలు తాగుతూ పెటపెటలాడుతూ తిరిగే ఆ ఆసామీ మామూలు మనిషేమీ కాదు. పేరుమోసిన క్రికెట్ వీరుడు విజయ్ మర్చంట్. వొండిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా పచ్చివాటినే భోంచేస్తున్న విజయ్ మర్చంట్ గురించి మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే గత పదిహేనేళ్ళుగా ఆయన చుక్క పచ్చి మంచినీళ్ళయినా ముట్టలేదట.

ఈ పచన రహిత భోజనాలవల్ల ఎంతో సమయం కలిసొస్తుందని, వంట ఖర్చు ఆదా అవుతుందనీ, వొంటింటిని వొదిలేస్తే ఎలాటి జబ్బులు వొంటి జోలికి రావనీ, పైపెచ్చు వొంటింటి కుందేళ్ళన్న అపప్రధ ఆడవాళ్ళకు తప్పుతుందనీ ఈ వాదనని సమర్ధించేవాళ్ళ ఉవాచ. గాస్ అయిపోయిందే అన్న దిగులు లేకుండా, నూనె ధర పెరిగిందే అన్న బెంగ లేకుండా రోజులు వెళ్లదీయవచ్చునట. (1983 జనవరిలో రేడియోలో ప్రసారితం)

  

కామెంట్‌లు లేవు: