25, ఏప్రిల్ 2011, సోమవారం

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు



ఎటు ముందుకు? ఎటు వెనక్కు?


కోయంబత్తూర్ లో పార్ధసారధి అనే యువకుడికి ఈ మీమాంస ఓ పట్టాన తెమలకపోవడంతో ఇక వెనకా ముందూ చూడకుండా వెనకనుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కు నడిచే ఓ అపూర్వ విద్యని ఆపోసన పట్టాడు. అతను ముక్కు సూటిగా పోగలడు. కావాలనుకుంటే వీపు సూటిగా కూడా నడవగలడు. ఇలాటి మెళకువలు నేర్చేసుకున్న తరవాత తీరి కూర్చోకుండా లేచి నడవడం మొదలు పెట్టాడు. ఎటుబడితే అటు నడవడంలో రికార్డులు బద్దలుకొట్టే పనిని ఓ పనిగా పెట్టుకున్నాడు. ఈ మధ్య పదిహేనురోజులపాటు విసుగూవిరామం లేకుండా అదేపనిగా నడుస్తూ పోయాడు. తరువాత ఇది పని కాదనుకుని 47 గంటల పాటు మొహం ముందుకు పెట్టి వెనక్కు నడిచాడు. మరోసారి గంటా పదిహేను నిమిషాలపాటు ముఖానికి అభిముఖంగా వెనక్కు పరిగెత్తాడు. ఇక అలా కాదనుకుని ఒంటికాలుమీద ముప్పయి గంటలు నిలబడ్డాడు. దేవతలు ప్రత్యక్షం కాలేదు కానీ, విలేఖరులు మాత్రం వెంటబడి ఆ నటరాజు నడకల తీరును పేపర్లకెక్కించారు. (22-10-1982 నాడు ఆకాశవాణిలో ప్రసారం)

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మగవారికి మాత్రమే!

మగవారికి మాత్రమే!


చట్టానికి మనసుంది


“రెండో పెళ్లి చేసుకోవడానికి మగవారిని అనుమతించక పోవడానికి కారణం ?”

“ఎందుకంటే ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి.”


మార్గం



“చిరకాలం జీవించడానికి ఏదయినా మార్గం వుందా డాక్టర్?”

“పెళ్లి చేసుకుని చూడండి”

“పెళ్లాడితే ఎక్కువ కాలం జీవించడం సాధ్యపడుతుందంటారా డాక్టర్?”

“అల్లా అని కాదు. కాకపొతే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తరువాత చిరకాలం జీవించాలనే కోరిక దానంతట అదే తగ్గిపోతుంది.”


కరచాలనం



“పెళ్లి సమయంలో వధూవరులులిద్దరు ఒకరి చేయి మరొకరు గట్టిగా పట్టుకుంటారెందుకు?”

“మల్లయుద్ధంలోకి దిగేముందు యోధులిద్దరూ కరచాలనం చేసుకోవడం మామూలే కదా ”


మౌనం



“ఏమండీ! ఇవాళ మన పెళ్లి రోజు. కొత్తరకంగా జరుపుకుంటే ఎలావుంటుందంటారు?”

“కరక్టుగా చెప్పావు. లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటిస్తే సరి”


లీల



“భగవంతుడి లీలలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందమయిన అమ్మాయిలను సృష్టించేది ఆయనే. మళ్ళీ వాళ్ళను భార్యలుగా మార్చేదీ ఆయనే.”


రాదే చెలీ ! నమ్మరాదే చెలీ!


పెళ్ళికి ముందు ప్రేమించుకునే రోజుల్లో తాను చెప్పేది తన్మయంగా వింటూ రాత్రంతా గడిపే మగవాడు - పెళ్ళయిన తరువాత తను మాట్లాడడం మొదలు పెట్టకముందే ఎందుకు గుర్రు పెడతాడన్నది ఇంతవరకు ఏ ఆడపిల్లకు అర్ధం కాని విషయం.

నగదు బదిలీ



ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా క్షణాల మీద నగదు బదిలీ చేయవచ్చు. అంతకంటే త్వరగా చేయాలంటే మాత్రం ఒకే ఒక మార్గం పెళ్లి చేసుకోవడం.

రుచి



చాకొలెట్ల రుచి చాకొలెట్లదే. ఆడ స్నేహితులు అలాటివాళ్ళే . ఎప్పుడు తిన్నాఅవి తియ్యగానే వుంటాయి.

ప్రేమికులు పిజ్జాల మాదిరి. తరచుగా తినాలనిపిస్తుంది. ఎప్పుడయినా అవి వేడివేడిగా, కారం కారంగా వుంటాయి.

ఇక భర్తలు మాత్రం, వేరే గతి లేదన్నప్పుడు తినే పప్పన్నం లాంటి వాళ్ళు.


నో ఛాన్స్ ప్లీజ్



దూర దేశంలో వున్న భర్తకు భార్య తాలూకు వాళ్ళనుంచి ఫోను వచ్చింది.

“మీ ఆవిడ చనిపోయింది. నువ్వు వచ్చేంతవరకు ఆగడానికి వీలుండదు. ఆమె శవాన్ని పూడ్చి పెట్టాలా లేక దహనం చేయాలా?”

“ముందు దహనం చేయండి. తరువాత ఆ బూడిదను గొయ్యితీసి పాతి పెట్టండి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోను ఎలాటి ఛాన్స్ తీసుకోవద్దు.”


కల్పితం



“మీ షాపులో ‘భార్యలను అదుపులో పెట్టడం ఎలా?' అనే  పుస్తకం వుందా?”

“కల్పితాలు, ఊహాగానాలతో రాసే పుస్తకాలు  అమ్మే విభాగం ఆ పక్కన వుంది. వెళ్లి కనుక్కోండి”


తధాస్తు దేవతలు



“నన్ను నమ్ము రాధా! నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కోసం నరకానికి వెళ్ళ డాని కయినా సిద్ధమే.”

పైనున్న దేవతలు తధాస్తు అన్నారు. రాధను పెళ్ళాడిన తరువాత అతడి జీవితం నిజంగానే నరకంగా మారిపోయింది.

23, ఏప్రిల్ 2011, శనివారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు



డిష్యుం డిష్యుం సినిమాలు చూసొచ్చిన చిన్న పిల్లలు ఇంటికొచ్చిన తరువాత కూడా తమాషాగా చేతులు వూపుతూ వుత్తుత్తి పోరాటాలు చెస్తూ వుండడం కద్దు. వాళ్ళలా మంచాలమీదా కుర్చీల మీదా గెంతుతూ తెలుగు సిన్మా పతాక సన్నివేశాలను సునాయాసంగా ప్రదర్శిస్తూ వుంటే – కొందరు తల్లులు సెన్సార్ వారి పాత్ర చేపట్టి వారిని అదుపు చేస్తుంటారు.

ఈ మధ్య పశ్చిమ బెంగాల్ లో ఒక శిశుకిశోరం హీరోలకు హీరోలా చెలరేగిపోయి పత్రికావార్తలకు ఎక్కాడు. ఆ అబ్బాయి పేరు దినేష్. తీరిక వేళల్లో ఎనిమిదో తరగతి చదువుతూ, తీరికచేసుకుని సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్న రోజుల్లో ఒకనాడు వాళ్ల ఇంటిమీద బందిపోట్లు విరుచుకు పడ్డారు. ఆ సమయంలో పిచ్చాపాటీ వేస్తున్న దినేష్ తండ్రి గారూ ఆయన స్నేహితులూ బందిపోట్లను చూడగానే ఎక్కడ లేని బలాన్ని కాలి పిక్కల్లోకి తెచ్చుకుని కాళ్ళకు బుద్ధి చెప్పారు. పదమూడేళ్ళ దినేష్ మాత్రం – అంతకు ముందే చూసిన స్టంట్ సినిమా గుర్తుకుతెచ్చుకున్నవాడై, ఉత్తేజం తెచ్చుకున్నవాడై, గోడకు వేళ్ళాడుతున్న నాన్నగారి తుపాకీని దొరకపుచ్చుకుని ఫటాఫట్ మని కాల్పులు మొదలు పెట్టాడు. బుడతడి చేతిలో వున్నది బొమ్మ తుపాకీ అని ముందు భ్రమ పడిన బందిపోట్లు తమలో నలుగురు అప్పటికే కుప్పకూలిపోవడం గమనించి – ఆ చిచ్చర పిడుగు ధాటికి అబ్బురపడి ‘ఆహా’ అని మెచ్చుకోబోయి – పేలుతున్న తూటాలు తటాలున జ్ఞాపకం వచ్చి బతుకు జీవుడా అని కాళ్ళకు బుద్ధి చెప్పారు. (1982 ఆగష్టు లో ఆకాశవాణిలో ప్రసారితం)

జీవన స్రవంతి --భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి --భండారు శ్రీనివాసరావు




ఇద్దరు ముద్దు – ముగ్గురు హద్దు – ఆపై వద్దు అనే నినాదం సంతానానికే కాదు సంసారం చేసే భార్యలకి కూడా వర్తించదంటున్నాడు ఓ థాయ్ లాండ్ పెద్దమనిషి. ఆయన ఇప్పటికే అయిదుగురు పెళ్ళాలను కట్టేసుకుని ఆరో భార్య కోసం ఆవురావురుమంటున్నాడు. పద్నాలుగుమంది పిల్లల తండ్రయ్యాక కూడా ఆయనగారికి ఇహ సుఖాలమీద మొహం మొత్తలేదు. ఆరో పెళ్ళికి రెడీ అంటూ ఈ మధ్య ఓ ప్రకటన చేసాడు. ఇలా ఎంతమందినయినా పెళ్ళాడడానికి ఆ దేశంలో ఎలాటి నిషేధాలు లేకపోవడంతో ఆయన గారిలాటి వాళ్లిలా నిత్య పెళ్లి కొడుకుల్లా వెలిగిపోతున్నారు. ఇంతమంది ఇల్లాళ్ళు ఇంటినిండా కంటి నిండుగా తిరుగుతున్నా ఆయన గారికి ఇంటి పోరు ఇసుమంతయినా లేకపోవడం నిజంగా అదృష్టం. ఆయన గారి ఇష్ట సఖులందరూ ఒక్క కడుపున పుట్టిన సొంత అక్క చెల్లెళ్ళ మాదిరిగా కలగలిసిపోయి ఒకే ఇంట్లో ఒకే మొగుడితో కలసి కాపురం చేస్తూ ‘కలసివుంటే కలదు సుఖం’ అన్న సామెతను నిజం చేస్తున్నారు. పంచ సతుల నడుమ వున్న అన్యోన్యం అలుసుగా తీసుకుని రెచ్చిపోయిన ఆ మొగుడు గారు ఆరో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. కొత్తావిడ ఇంకా గడపలో కాలుపెట్టకముందే ఆ మగానుభావుడు తన మనసులోని కోర్కెను బయట పెట్టాడు. ఆరుగురితో ఆగననీ మరో పెళ్ళికి కూడా సిద్ధమనీ అంటున్నాడు. చూద్దాం! ఆరో ఆవిడ కూడా మిగిలిన సవతుల మాదిరిగా మొగుడితో రాజీ పడిపోతుందో లేక తిక్క మొగుడి  తలతిక్క కుదురుస్తుందో. (18-09-1980 నాడు రేడియోలో ప్రసారితం)

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు

వోటు వేళ వేటు రాజకీయం – భండారు శ్రీనివాసరావు


(22-04-2011 తేదీన సూర్య దినపత్రికలో ప్రచురితం)

అలనాడు కౌరవ సభలో ధర్మరాజు శకుని ఆడిన కపట ద్యూతంలో సమస్తం కోల్పోయి ఆఖరుకు పణంగా వొడ్డిన ఆలిని కూడా పోగొట్టుకున్న తరువాత అంతఃపురంలో వున్న ద్రౌపదిని నిండు కొలువుకు తీసుకురమ్మని దుర్యోధనుడు తన కింద పనిచేసే ప్రాతికామిని ఆదేశిస్తాడు. తనను కొనిపోవచ్చిన ప్రాతికామినిని ద్రౌపది ఒకే ఒక ప్రశ్న వేసి దానికి జవాబు తెమ్మని కోరుతుంది. జూదంలో ధర్మరాజు ముందుగా ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ అన్నది ద్రౌపది తెలుసుకోదలచిన ధర్మసూక్ష్మం. పైగా దీనికి సమాధానాన్ని ధర్మకోవిదుడయిన భీష్ముడి నుంచి రాబట్టాలనుకుంటుంది.

సరిగ్గా ఇప్పుడు అదే సందేహం ఆంధ్ర ప్రదేశ్ విధానసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు మరో రూపంలో నిలుచుంది. టీడీపీ సభ్యుడిగా రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలా లేక సభ్యుడు నేరుగా స్పీకర్ కు పంపిన రాజీనామాను ఆమోదించాలా అన్న ధర్మసంకటంతో ఆయన చాలాకాలంగా గుంజాటన పడుతున్నారు. ద్రౌపది మనసులో మెదిలినట్టుగా వీటిల్లో ఏది ముందు ఏది వెనుక అనే మీమాంస నుంచి బయటపడడానికి మనోహర్ ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్టుంది. కాకపొతే, కడప ఉపఎన్నికల రూపంలో తరుముకొచ్చిన రాజకీయ వొత్తిళ్ల దృష్ట్యా ‘జగన్ అనుచర ఎమ్మెల్యేల’ విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన స్తితి దాపురించడంతో ఆయన హడావిడిగా న్యాయ నిపుణులను సంప్రదించి, అనర్హత వేటు వేసే విషయంలో ముందు టీడీపికి చెందిన ముగ్గురు సభ్యులకు సంజాయిషీ నోటీసులు పంపారు. ఈ సభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న తాపత్రయం కంటే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కట్టడి చేయడం అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిపోయింది. రాజాజ్ఞను ధిక్కరిస్తూ హరి భజన చేసే ప్రహ్లాదుడిపై బెత్తం ఎత్తలేని అసహాయ గురువులు చండామార్కులు - ఇతర రాక్షస విద్యార్ధులపై దండ ప్రయోగం చేస్తూ, వాటిని చూసయినా రాజకుమారుడు బెదిరిపోయి దారికి రాకపోతాడా అని ప్రయత్నించిన చందంగా – స్పీకర్ కార్యాలయంలో చాలాకాలంగా పెండింగ్ లో పడి వున్న ’అనర్హత’ పిర్యాదులను వెలికి తీసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపెట్టి ముందుగా సంబంధిత సభ్యులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తదనుగుణంగానే, అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. లోగడ ఇదే మాదిరి నోటీసు అందుకున్న మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తాజాగా ఇంకో నోటీసు ఇచ్చారు. అంతకుముందు అందుకున్న నోటీసుకు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వడం జరిగింది కానీ, ఆ తరవాత కూడా ఆయన సొంత పార్టీని లెక్క చేయకుండా ఢిల్లీ, విజయవాడలలో జరిగిన జగన్ కార్యక్రమాలకు హాజరయినందువల్ల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణ అయినందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, స్పీకర్ కు మరోసారి పిర్యాదు చేసిన నేపధ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మనోహర్ నోటీసు పంపారు. దీనికి ఆయన ఇచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తలపోస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి కూడా జగన్ వెంట వెడుతున్న తమ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై సయితం చర్య తీసుకుని అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని నిర్ణయించారు.

ఎన్నో నెలలుగా పెండింగులో వున్న అంశాలకు ఇంత ఆదరాబాదరాగా స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటీ స్పీకర్ స్పందించడానికి కారణాలు వూహించడం కష్టమేమీకాదు. పేరుకు స్పీకర్ పదవి అన్నది రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సినదే అయినా ఆచరణలోకి వచ్చేసరికి అధికారంలో వున్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. పొరుగున వున్న కర్నాటకలో జరిగింది కూడా ఇదే.

కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని అసమ్మతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి హడావిడిగా అటు ముఖ్య మంత్రిని, డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను విడివిడిగా కల్సుకుని సంప్రదింపులు సాగించారు. వీటికి తోడు జగన్ వర్గానికి మద్దతు తెలుపుతున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టిని కలుసుకున్నట్టు వార్తలు వెలువడడంతో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలు వెల్లువెత్తాయి. ‘ఏ క్షణంలోనయినా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం’ అంటూ టెలివిజన్ తెరలపై ఒక రోజల్లా స్క్రోలింగులు పరిగెత్తాయి. ఆయా పార్టీల ప్రతినిధులు, విశ్లేషకులు జరుగుతున్న పరిణామాలపై తమ తమ అభిప్రాయాలతో కొన్ని గంటలపాటు శ్రోతలను హోరెత్తించారు. తమపై వేటు వేసే తెగింపు కాంగ్రెస్ నాయకత్వానికి ఎక్కడిదన్న ధోరణిలో జగన్ మోహన్ రెడ్డికి తొలినుంచి బాహాటంగా బాసటగా నిలబడ్డ కొండా సురేఖ ఎద్దేవా చేశారు. అనర్హత వేటు వేస్తె దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయని అంటూ ‘మరో ఆగస్టు సంక్షోభం’ గురించి ప్రస్తావన తెచ్చి ప్రభుత్వ పతనం తప్పదన్న తీరులో హెచ్చరికలు చేశారు. ఏతావాతా ఏమిజరిగిందో కానీ, కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చిన ‘ఆ క్షణం’ రాకుండానే ఇరవై నాలుగ్గంటలు లక్షణంగా గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోని ఈ విలక్షణ లక్షణం మరోమారు వెలుగు చూడడం మినహా జరిగిందేమీ లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తొలుత తీసుకున్న నిర్ణయం అమలును ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమయిన చిక్కులు ఎదురవకుండా జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతను ఆపాదించేందుకు వీలయిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని పకడ్బందీగా పిర్యాదు చేయాలన్నదే వాయిదాకు కారణంగా చెబుతున్నారు.ఒక్క పెట్టున అందరిపై వేటు వేయాలా లేక కొందరిపై ముందు చర్య తీసుకుని మిగిలినవారికి తద్వారా హెచ్చరికలు పంపాలా అన్న విషయంలో ఆ పార్టీ నాయకులకు ఇంకా స్పష్టత వచ్చినట్టులేదు. ఏ అడుగు వేస్తె ఏమవుతుందో, దాని ప్రభావం కడప ఎన్నికలపై ఏవిధంగా వుంటుందో అన్న గుంజాటనలో పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వుంది. చివరకు తెముల్చుకుని పిర్యాదు చేసినా దానిపై చర్యకు ఎంతోకొంత కాలం పడుతుంది.

కాగా, కడప ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, జగన్ వోటమి అన్న ఒక్క లక్ష్యాన్నే పెట్టుకుని సర్వశక్తులు వొడ్డి పోరాడుతున్నట్టుగావుంది. సగానికి సగం మంత్రివర్గాన్ని కడపలో మోహరించి, గెలుపుకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వొదిలిపెట్టరాదన్న ధ్యేయంతో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుత వాతావరణం తెలుపుతోంది. అందుకే, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి - జగన్ కు, భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి మాట్లాడే సరికొత్త వ్యూహానికి తెర లేపారు. దాన్ని అందిపుచ్చుకున్న పార్టీ నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జగన్ పార్టీకి ముస్లిం వోటర్లను దూరం చేసే ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాను అనుదినం విమర్శిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి లోకసభలో అడుగు పెడితే ఆయన వేసే తొలి అడుగులు బీజేపీ వైపే అని తేల్చిచెప్పడం మొదలెట్టారు. సాధారణంగా ఇటువంటి వూహాజనిత అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదని దాటవేసేవారు కూడా అధ్యతన భావిలో జగన్ పార్టీ బీజేపీ పంచన చేరుతుందని బల్ల గుద్ది చెబుతుండడం చూస్తే ఇది ఖచ్చితంగా కడప ఉప ఎన్నికలకోసం రూపొందించిన ఎత్తుగడగా అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి తగ్గట్టే మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.

అలాగే, తెలంగాణా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాలని వస్తున్న డిమాండ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రధాన పార్టీలే ఈ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నప్పుడు అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ విధివిధానాలు ఏమిటన్న ప్రశ్న అర్ధరహితం.

ఈ ఎన్నికల సందర్భంగా వెలువడుతున్న అన్ని రకాల అభిప్రాయాలపై ప్రజలు తమ తీర్పును కొద్ది రోజుల్లో చెప్పబోతున్నారు. అది శాసన సభ్యుల అనర్హత విషయం కావచ్చు, అక్రమార్జనలతో సాగించే ఎన్నికల పోరాటాలు కావచ్చు, అవకాశవాద రాజకీయాలు కావచ్చు – అంశం ఏదయినా తుది తీర్పు ప్రజలదే. అంతిమ నిర్ణయం జనాలదే. వోటు వేసే వోటరుకే పాలకులపై వేటు వేసే హక్కు వుంటుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఎవరయినా గుర్తుంచుకోవాల్సిన ప్రాధమిక పాఠం ఇది.

సాధారణంగా ఉపఎన్నికల్లో ఒకటి రెండు స్తానాలు గెలుచుకున్నా పోగొట్టుకున్నా పాలకపక్షానికి వచ్చేదీ పోయేదీ యేమీవుండదు. కానీ ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం ఎంతో విలక్షణమయినది. అందుకే, దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు కూడా కడప ఉప ఎన్నికల ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించ లేకపోయాయి. జాతీయ మీడియా సైతం ఈ ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కడప ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ స్తాయిలో సైతం ప్రభావితం చేసే అవకాశాలు వుండడమే దీనికి కారణం.(21-04-2011)

21, ఏప్రిల్ 2011, గురువారం

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు




జాతి వైరం కుక్కలకు సహజం. ఒక కుక్కని చూస్తే మరో కుక్కకు గిట్టదు. కొంపలంటుకు పోయినట్టు మొరగడం మొదలు పెడతాయి. ఈ సంగతి తెలిసికూడా పంజాబులో ఇద్దరు సర్దార్జీలు కోరి తెచ్చుకున్న కొట్లాట పుణ్యమా అని పోలీసు కేసులో చిక్కుకున్నారు.

ఆ ఇద్దరూ ఇరుగుపొరుగూ వారే. కానీ వారి పెంపుడు కుక్కలకు మాత్రం ఏమాత్రం పొసగదు. కనబడగానే కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటాయి. గయ్యి గయ్యిమని మొరుగుతాయి. ఈ వ్యవహారం ఆ యజమానులకు సుతరామూ నచ్చలేదు. అక్కడితో ఆగితే పోయేది. ఎదురుపడగానే కుక్కల మొరుగుడు గుర్తుకువచ్చి గిల్లి కజ్జా పెట్టుకునేవారు. అంతటితో ఆగితే ఏ పేచీ లేదు. చేతులు లేపారు. చేతులు సరిపోక ఇనుప కమ్మీలతో దొమ్మీలకు దిగారు. అంతదాకా తీరిగ్గా అంతా చూసిన పోలీసులు సమయం చూసి రంగంలోకి దిగి ఇద్దర్నీ స్టేషనుకు పట్టుకుపోయి అక్కడ చేయాల్సిన సన్మానం చేశారు. అప్పటికి కానీ ఆ యజమానులిద్దరు శాంతించలేదు. వాళ్ళు తాత్కాలికంగా రాజీపడి చేతులు కలిపినా కుక్కలు మాత్రం ఇళ్ళల్లో కూర్చుని తాపీగా మొరుగుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నాయి.(17-02-1983 నాడు రేడియోలో ప్రసారితం)







వొండివార్చే పని లేకుండా వడ్డించే విధానాన్ని డాక్టర్ విగ్మూర్ అనే విదేశీ వనిత కనుక్కుంది. కాయగూరలను వొండకుండా ఎలావున్నవాటిని అలానే కొరుక్కుని తినాలన్నది ఆవిడ గారి థియరీ. నిజానికి ఇది కొత్త విద్యేమీ కాదు. వెనుక పురాణాల్లో విన్న కంద మూలాల కధే. కానీ చెప్పేది విదేశీ అమ్మడు కాబట్టి నమ్మినా నమ్మకపోయినా వినకతప్పదు కదా! ఇలా తింటే వంట తంటా తప్పడమే కాకుండా వొంటికి సరిపడే పుష్టి బ్రాండ్ ఆహారం దొరుకుతుందని ఆవిడ చెబుతోంది. వండడం వల్ల కూరగాయల్లో వుండే సహజమయిన విటమిన్లు తగ్గిపోతాయని హెచ్చరిస్తోంది. పచ్చి కూరగాయల్ని పచ్చి పచ్చిగా తినడం మొదట్లో కొంత కష్టంగా వున్నా పోను పోను అలవాటయి ఇష్టంగా మారుతుందని ఆవిడ ఢంకా బజాయించి చెబుతోంది.


విగ్మూర్ చెప్పే మాటలు కరక్టే అనే వ్యక్తి మనదేశంలోనే ఒకాయన వున్నారు. పచనం ప్రసక్తి లేకుండా పచ్చి కూరలు తింటూ, పళ్ళరసాలు తాగుతూ పెటపెటలాడుతూ తిరిగే ఆ ఆసామీ మామూలు మనిషేమీ కాదు. పేరుమోసిన క్రికెట్ వీరుడు విజయ్ మర్చంట్. వొండిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా పచ్చివాటినే భోంచేస్తున్న విజయ్ మర్చంట్ గురించి మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే గత పదిహేనేళ్ళుగా ఆయన చుక్క పచ్చి మంచినీళ్ళయినా ముట్టలేదట.

ఈ పచన రహిత భోజనాలవల్ల ఎంతో సమయం కలిసొస్తుందని, వంట ఖర్చు ఆదా అవుతుందనీ, వొంటింటిని వొదిలేస్తే ఎలాటి జబ్బులు వొంటి జోలికి రావనీ, పైపెచ్చు వొంటింటి కుందేళ్ళన్న అపప్రధ ఆడవాళ్ళకు తప్పుతుందనీ ఈ వాదనని సమర్ధించేవాళ్ళ ఉవాచ. గాస్ అయిపోయిందే అన్న దిగులు లేకుండా, నూనె ధర పెరిగిందే అన్న బెంగ లేకుండా రోజులు వెళ్లదీయవచ్చునట. (1983 జనవరిలో రేడియోలో ప్రసారితం)

  

16, ఏప్రిల్ 2011, శనివారం

Kadapa bypolls: Chasing a mirage –Bhandaru Srinivas Rao (I.I.S.)

Kadapa bypolls: Chasing a mirage –Bhandaru Srinivas Rao (I.I.S.)

Once again politics in Andhra heated up with the by polls to Kadapa Parliament as well Pulivendla assembly constituency elections drawing closer. The by polls necessitated with the resignations of Y S Jaganmohan Reddy and his mother Vijayalakshmi, resigning from the Congress party.

Main opposition Telugu Desam, which never won or come closer to the winner in these two constituencies, which are considered as bastion of former chief minister Dr Y S Rajasekhara Reddy, who died in a chopper crash, could find a strong candidate in the form of Dr M V Mysoora Reddy to field against YS Jaganmohan Reddy, the leader of newly formed YSR Congress Party. After the late leader Rajasekhara Reddy, it’s Mysoora, who got some hold on the district politics. Ironically, the Congress, which could lure yesteryear YSR arch rival family members – Kandula brothers from TDP – however, failed to make them accept the candidature to take on young scion Jaganmohan Reddy. Whatever may be reasons for Kandula brothers’ back out, it certainly have its bearing on the poll outcome. As a result, the Chief Minister N Kiran Kumar Reddy had to thrust upon the responsibility to one of his cabinet colleague and sworn enemy of YSR family, Dr.D.L.Ravindrareddy to accept the challenge. Thus far, the Kadapa parliament by poll becomes an interesting political event which will have a bearing on future polarization of political parties.

For Congress and the Chief Minister Kiran Kumar Reddy, the Kadapa parliament by poll is the biggest challenge that they might have faced since the formation of the state, though Pulivendula assembly by poll too may be equally important. Media reports also indicate that the party high command reportedly told the chief minister during his recent visit to Delhi that ‘only a victory for the ruling party in the two seats would reflect his abilities to lead the party till the 2014 general and assembly elections’. At Pulivendla, the Congress could find a potential candidate within the family – that’s YSR’s brother Vivekananda Reddy.

The by-polls becomes interesting as the Congress as well the newly born YSR Congress headed by Jaganmohan Reddy claiming they are the true inheritors of late leader’s legacy. The ruling Congress and its Chief Minister had taken the by-polls seriously and entrusted the job drafting more than half a dozen Ministers and two dozen MLAs for the official nominee’s victory by hook-or-crook. Each assembly segment of Kadapa parliament constituency will be headed by a Minister to oversee the party nominee’s prospects meticulously. Though, there might be such instances in the past, but this time around, for the ruling Congress its ‘perform or perish’ kind of a situation.

But `aam admi` wonders, what the election commission is doing when such drama being enacted right before its eyes on Andhra political stage? In democracy, should such things be allowed to happen? How can the state administration be brought to standstill, may be for a week or so, by deploying more than half a dozen important ministers, camping in Kadapa, ignoring the rest of the state peoples` problems? Aren’t the rulers making ‘democracy’ a ‘mockery’ to score a political point or two against their rivals?

This apart, look at the Congress nominee, who holds a cabinet rank, unwilling to relinquish his office, still wants to be party candidate and contest? What sort of morals the Congress would like to set? Contrary to Ravindra Reddy, the same party nominee from Pulivendla, Vivekanandareddy was right when he insisted the Chief Minister to accept his resignation first and let him go ahead to contest the polls.

In these particular by-polls, it’s the Telugu Desam, which has some relatively more moral right to ask people to elect its nominee. Reason: The party had been expressing apprehensions from time immemorial that YSR family had established their fiefdom in Kadapa and never allowed free-and-fair polls, to give an opportunity for the voter to exercise his or franchise vote according to their conscience. Moreover, the party is also known to unleash aggressive campaign against YSR and his family. Thus far, its decision to fight polls against ‘honesty and dishonesty’ may be more convincing and acceptable. As far holding free and fair polls, it’s the responsibility of the party in power and the election commission. The TDP has no moral right to crib as YSR and his family members won hands down, if not with slender margin, in the past when TDP was in power.

Ask anyone on the street in the state - from Ichchapuram to Yellendu or Anakapally to Achampet – he or she will only say that Jagan and his mother’s victory is foregone conclusion. If the Congress conceded the defeat even before the polls by failing to find a strong and suitable candidate, then the TDP, which too more or less conceded the defeat, wanted try and increase their voting percentage by fielding a strong candidate like Dr Mysoora Reddy, who in fact, succeeded to neutralize YSR hold on the party to some extent as Home Minister, in the `scheme of things` of Congress veteran late Kotla Vijayabhaskara Reddy.

Meanwhile, the affidavit filed by YS Jaganmohanreddy along with his nomination papers has become another spicy matter for small screen discussions. While it came handy for the critics of Jagan as his declared assets crossed hundreds of crores of rupees, for the supporters it became hard nut to substantiate. However, one political observer said that everyone talks about corruption, but at the same time they don’t hesitate to cover corrupt people when it suits their needs. Is is also interesting to notice one caller questioning the moral right of the of the people who were participating in the debate to talk about corruption.

(16-04-2011)

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

బాబా బందీనా ! – భండారు శ్రీనివాసరావు

బాబా బందీనా ! – భండారు శ్రీనివాసరావు
భక్త సులభుడయిన భగవంతుడు ఎప్పుడూ భక్తులకు బందీనే. పురాణ కాలం నుంచీ ఈ సత్యం ఎప్పటికప్పుడు రుజువవుతూనే వచ్చింది. కానీ ఇది కలికాలం కదా. దేవుడినే బంధించి పబ్బం గడుపుకోవాలనే భజన బృందం బయలుదేరింది. అక్కడ పుట్టపర్తిలోను ఇదే కధ. తిరుపతిలోను ఆ దేవదేవుడిది అదే కధ. నలుగురు నమ్మి చేరే ప్రతిచోటా ఇదే కధ.
ఎంత ఆస్తికులయినా అయినా పుట్టపర్తికి సంబంధించి నాస్తికులుగా మారడానికి బాబా చుట్టూ అస్తమానం చుట్టు ముట్టి వుండే పరిజనమే కారణం అని నా నమ్మకం. క్రమశిక్షణ పేరుతొ అటు బాబాను, ఇటు భక్తులను ఏకకాలంలో ‘బందీలను’ చేసేసారు. పదేళ్లక్రితం అనుకుంటా పుట్టపర్తిలో చక్రం తిప్పే ఓ పెద్ద ఆసామీని నిలదీసాను. పూర్వాశ్రమంలో ఆయనో పెద్ద అధికారి. బాబా పేరుతొ ఈ దిగ్బంధనాలేమిటని ప్రశ్నించాను. ఆయన సమాధానం ఆయన అహంకారానికి అద్దం పట్టేదిలావుంది. అప్పటినుంచి బాబాను పుట్టపర్తి నుంచి బయటకు తెచ్చి నా మనసు వరకే పరిమితం చేసాను. బహుశా ఇప్పుడు పుట్టపర్తినుంచి వస్తున్న వార్తలు వింటుంటే బాబాను నమ్మే ప్రతి వ్యక్తీ బాబాకు తమ గుండెల్లో చోటిచ్చి కాపాడుకుంటే మంచిదనిపిస్తోంది. ఎందుకంటె ఆయన చుట్టూ వున్నవారికి ఆయన అక్కరలేదు. ఆయన పేరు కావాలి. ఆ పేరుతొ వచ్చే పేరు ప్రతిష్టలు కావాలి. తద్వారా సమకూడే సంపదలు కావాలి. అయాచితంగా లభించే అధికారం కావాలి. బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ వారికి మాత్రం కాసులు కురిపించే దేవుడు.
ఈ పరాన్నభుక్కులు ఆధ్యాత్మిక రంగం లోనే కాదు అన్నిచోట్లా కనిపిస్తుంటారు. మంత్రులు, ప్రధాన మంత్రులు. ముఖ్య మంత్రులు, ఉన్నతాధికారులు అందరి చుట్టూ వీరే. కాకపోతే, పదవి దిగిపోయేదాకా వీరి నిజ స్వరూపం అసలు వారికి కనిపించదు. ఎందుకంటె, అప్పటివరకు జనం అనుకునే మాటలు వారి చెవులకు చేరకుండా చూస్తారు. వాస్తవాలు వారి కళ్ళకు కనబడకుండా చేస్తారు. ఇలాటి విషయాలలో మాత్రం వీళ్ళు భగవంతుడినీ, బాబాలను మించిన శక్తివంతులే.(15-04-2011)

   

14, ఏప్రిల్ 2011, గురువారం

సద సంశయం – భండారు శ్రీనివాసరావు

సద సంశయం – భండారు శ్రీనివాసరావు


శీతల పానీయాలు తయారు చేసే కంపెనీలకు శుద్ధి చేసిన మంచి నీటిని ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన నేపధ్యంలో -


జలాశయాల్లోని నీటిని ప్రజలు తాగడానికి వీలయిన విధంగా ‘రక్షిత మంచి నీరు’ గా మార్చడానికి సంబంధిత ప్రభుత్వ యంత్రాగం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదో తెలవదు కానీ రాజధాని నగరం హైదరాబాదులో సంపన్న వర్గాలు నివసించే అనేక ప్రాంతాల్లోని సువిశాల భవంతుల్లో- పచ్చిక బయళ్ళు పెంచడానికీ, కులీనులు పెంచుకునే కుక్క పిల్లలకు స్నానాలు చేయించడానికీ, వారి ఖరీదయిన కార్లు కడుక్కోవడానికీ - ప్రజాధనంతో శుద్ధిచేసిన మంచినీటినే మంచినీళ్ళ ప్రాయంలా వాడుతున్నారనేది జగమెరిగిన సత్యం.


ప్రజాహితాన్ని కోరుకునే పెద్దలు ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుందేమో. (24, అక్టోబర్, 2006)

12, ఏప్రిల్ 2011, మంగళవారం

దటీజ్ ఎన్టీఆర్ – భండారు శ్రీనివాసరావు

దటీజ్ ఎన్టీఆర్ – భండారు శ్రీనివాసరావు


అన్నా హజారే పుణ్యమా అని నీతీ నిజాయితీలను గురించి నలుగురూ తీరిగ్గా చర్చించుకోవడం మొదలయింది. తెలుగు టీవీ చానళ్ళు కూడా అవినీతిని ఖండిస్తూ చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. డీజీపీ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఏ.కే.మహంతి- ఏ.బీ.ఎన్. ఆంధ్రజ్యోతి ఛానల్లో పాల్గొన్నారు. ఆయన చెప్పిన విషయాలలో ఒక ఆణిముత్యం.

“ ఎన్.టీ.ఆర్. బెస్ట్ సీ.ఎం. ఓ జిల్లాలో పోలీసు అధికారిగా పనిచేస్తున్నప్పుడు నేనంటే గిట్టని కొందరు రాజకీయనాయకులు నాపై లేనిపోని మాటలు చెప్పి నన్ను బదిలీ చేయించాలని చూశారు. ఆయన వారిని రెండే ప్రశ్నలు వేశారు.

‘మహంతి అవినీతి పరుడా? చేతకానివాడా?’

‘కాదన్నారు’ వాళ్ళు.

‘మరేమిటి?’ సీ.ఎం. ఆరా.

‘పార్టీకి పనికిరాడు.’ పార్టీ నేతల జవాబు.

‘పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు.’ సంభాషణ ముగించారు ఎన్టీఆర్.

వార్తలు- వ్యాఖ్యలు -1– భండారు శ్రీనివాసరావు

వార్తలు- వ్యాఖ్యలు -1– భండారు శ్రీనివాసరావు


సందర్భం : సుబ్బరామిరెడ్డి ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం


ఒక టీవీ ఛానల్ లో అవార్డ్ స్వీకర్త, హాస్య నటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తున్న సన్నివేశం ప్రసారమవుతోంది.


“టి. సుబ్బరామిరెడ్డి గారు నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయన ఇంట్లో వున్న ‘శక్తి’ పీఠాన్ని చూస్తే చాలు మనల్ని ఏదో శక్తి ఆవహిస్తుంది.”


ఆయన మాటల్లోని ‘శక్తి’ ఆ టీవీ ఛానల్ ఎడిటింగ్ బృందాన్ని ఆవహించినట్టుంది.అంతే! క్షణం ఆలశ్యం లేకుండా అదే వేదిక మీద అర్ధ నగ్న సుందరీమణులు చేసిన అశ్లీల నృత్య ప్రసారం ప్రారంభమయింది. ఆధ్యాత్మికమయినా, పారమార్దికమయినా ఇంటి గడప వరకే. నలుగురు జనం చేరే చోట వారు కోరేదే ఇవ్వాలనుకోవడం సినీ జీవులకు, రాజకీయులకు కొత్తేమీ కాదు కదా.(12-04-2011)

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు


ఎంత మార్పు! ఎంత మార్పు!! ఇంత మార్పు దేనికోసం? – భండారు శ్రీనివాసరావు

కడప ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నదే ఈనాడు అందరి మనస్సులనూ తొలుస్తున్న తొలి ప్రశ్న. వారసత్వ రాజకీయాలను ఈసడించుకునే వారు సైతం ‘వై.ఎస్.ఆర్.’ కి నిజమయిన రాజకీయ వారసులెవ్వరు?’ అని లేవనెత్తుతున్నది రెండో ప్రశ్న.
‘విదియ నాడు కనబడని చంద్రుడు తదియ నాడు తానే కనబడతాడ’న్న సామెత ప్రకారం వీటికి సమాధానం లభించడానికి కొద్ది వారాలు ఆగితే చాలు. స్వల్ప వ్యవధిలో తేలిపోయే విషయాలే అయినా ఎన్నికల సమరంలో దిగినవారెవ్వరూ అంత తేలిగ్గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. కారణం రాష్ట్రం లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తాజాగా ఎన్నికల బరిలో కాలు మోపుతున్న కొత్త పార్టీ - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఉప ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్షే. ఇందులో నెగ్గగలిగితేనే మునుముందు రాజకీయంగా నెగ్గుకురాగలిగిన పరిస్తితి జగన్ పార్టీది. భవిష్యత్తును ఆటో ఇటో తేల్చగల ‘తుది సమరం’ జగన్ పార్టీ చేయబోతోంది కనుక అసలు సిసలు పరీక్ష ఆ పార్టీదే.
పోతే, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే కాని  ప్రాణాంతకం కావు. కాకపొతే, ప్రాంతీయ ఉద్యమాలతో దిక్కుతోచని స్తితిలో వున్న ఆ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో లభించే కాసింత విజయం కూడా కొండంత ఆత్మ విశ్వాసాన్ని కొనితెస్తుంది కాబట్టి కడప ఉపఎన్నికలు టీ.డీ.పి. కి సైతం ముఖ్యమయినవే.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, ఎన్నికల ఫలితాలు ఎలావున్నా, రాష్ట్రంలో ప్రభుత్వ మనుగడకు వెనువెంటనే వచ్చే ముప్పు ఏమీ వుండకపోవచ్చు. అయినా, ఈ ఎన్నికల్లో పరాజయం పాలయితే దాని ప్రభావం ముందు పడేది పార్టీ రాష్ట్ర నాయకత్వం మీదే అన్న ఎరుక ఆ పార్టీ నాయకులకు లేకపోలేదు. పైపెచ్చు, ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కడపలో తగిలిన ‘ఎదురు దెబ్బ’ నేపధ్యంలో – కడప, పులివెందుల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నిజమయిన అగ్ని పరీక్షగా మారనున్నాయి.
ఎన్నికల చిహ్నం ఏమిటో కూడా తెలియకముందే కొత్త పార్టీ నాయకుడు, వై ఎస్సార్ తనయుడు జగన్, దివంగత నేత భార్య విజయమ్మ- అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మగౌరవానికి అహంకారానికీ నడుమ జరిగే సమరంగా’ ఆయన తన ఎన్నికల నినాదాన్ని ఓటర్లపై వొదిలారు. ‘కడప ఉపఎన్నికలు వైఎస్సార్ కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మధ్య జరిగే యుద్ధంగా’ కూడా ఆయన అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. సోనియాపై ఈగ వాలినా వూరుకోని కాంగ్రెస్ నాయక శ్రేణులు జగన్ వ్యాఖ్యను ఆయన అహంభావానికి నిదర్శనమని విమర్శించాయి. వై ఎస్ జీవించివున్న కాలంలో ఆయన సోనియా పట్ల ప్రదర్శించిన వినయ విధేయతలను ఉటంకిస్తూ, ఆయనే ఈనాడు బతికి వుంటే జగన్ వ్యాఖ్యలకు ఎంతగా కుమిలి పోయివుండేవారో జగన్ తెలుసుకుని మాట్లాడాలని సలహా చెప్పాయి. అయితే, వై. ఎస్. ఆర్. అనేది కొత్త పార్టీ పేరు కనుక దీంట్లో తప్పు పట్టాల్సిందీ, ఆక్షేపించాల్సిందీ ఏముందన్నది జగన్ వర్గీయుల వాదన.
మామూలు పరిస్థితుల్లో అయితే, ఒకటి రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల ఫలితాల ప్రభావం పాలక పక్షం పై పడే అవకాశం వుండదు. సంఖ్యాబలంలో చిన్న చిన్న తేడాలు ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరంగా మారే వీలుండదు. అయితే ఈసారి కడప పార్లమెంట్, పులివెందుల శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో జరుగుతున్నాయి. వీటికి లోగడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ ఇరువురూ కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి, చట్టసభల్లో తమ సభ్యత్వాలను వొదులుకుని, వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మళ్ళీ ఎన్నికల బరిలో దిగిన కారణంగా, కడప ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రత్యేకించి ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎదురయిన పరాజయాలు పాలక పక్షాన్ని కొంత ఇరకాటంలో పడేసిన నేపధ్యంలో, మరో అవమానాన్ని తట్టుకోగల స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేదు. అలాగే, శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయకారీగా కుమ్మక్కయ్యాయని వెలువడిన ఆరోపణల దృష్ట్యా టీ.డీ.పీ. అధినాయకత్వం కూడా ఆ మచ్చను మాపుకునే క్రమంలో అభ్యర్ధుల ఎంపికలో తీవ్రమయిన కసరత్తు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.
అనేక వడబోతల అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కడప జిల్లా రాజకీయాల్లో పండిపోయిన సీనియర్ నాయకుడు అయిన డాక్టర్ మైసూరారెడ్డిని జగన్ మోహన రెడ్డిపై పోటీకి టీ.డీ.పీ. నిలబెట్టింది. పులివెందులలో మాత్రం అంతగా జనం నోళ్ళలో నలగని బీటెక్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. ఇక కాంగ్రెస్ తరపున ఆ నియోజకవర్గం నుంచి వై ఎస్ సోదరుడు వివేకానందరెడ్డి స్వయానా వొదినె విజయమ్మతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
పోతే, కడప పార్లమెంట్ స్తానానికి జగన్ కు దీటయిన అభ్యర్దిని వెతికే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనేక పాట్లు పడాల్సివచ్చింది. గతంలో ఒకసారి వై ఎస్సార్ కే గట్టి పోటీ ఇచ్చిన టీ.డీ.పీ. నాయకుడు కందుల రాజమోహన రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీర్ధం ఇప్పించి జగన్ పై పోటీకి నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కొంత వరకే పనిచేశాయి. కందుల సోదరుల కాంగ్రెస్ పార్టీ ప్రవేశం మాత్రం ఎలాటి అవాంతరాలు లేకుండా జరిగిపోయింది కానీ, జగన్ పై పోటీలోకి దిగడానికి వారిద్దరూ ససేమిరా అనడంతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీ.ఎల్. రవీంద్రారెడ్డిని ఆఖరు నిమిషంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాల్సిన దైన్య స్తితిలో కాంగ్రెస్ పడింది. ఈ కధ ఇన్ని మలుపులు తిరగడానికి దారి తీసిన పరిణామాలు కూడా శోభస్కరంగా లేవనే చెప్పాలి. కడప పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడానికి ఈసారి కందుల సోదరులు పెట్టిన ముందస్తు షరతులు టీ.డీ.పీ. అధ్యక్షుడు చంద్రబాబుకు మనస్కరించకపోవడంతో మనస్తాపానికి గురయిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ఇద్దరిలో ఒకరికి పార్టీ టిక్కెట్టు ఇచ్చిపోటీలో నిలబెట్టి జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నమే చేసినట్టు మీడియా కోడై కూసింది. జగన్ పై పోటీకి దిగడానికి కందుల సోదరులు పెట్టిన షరతులకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా వూపని కారణంగానే, వారు పోటీకి వెనుకడుగు వేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. పోటీ చేయాల్సిన అభ్యర్ధులే ఫలితాలు తారుమారయిన పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధినాయకులనుంచి హామీ కోరాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయంటే, వాస్తవ పరిస్తితులు ఎలావున్నాయో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
కందుల సోదరులు పోటీ చేయమని భీష్మించుకున్న నేపధ్యంలో ఇక విధి లేక మంత్రి డీ.ఎల్.రవీంద్రారెడ్డి పేరును కడప పార్లమెంట్ స్తానానికి అభ్యర్ధిగా అధిష్టానానికి సూచించినట్టు ప్రకటించి రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారు. అయితే, దానికి ముందే కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యుడు వీరశివారెడ్డి – కడప పార్లమెంటు సీటుకు పార్టీ తరపున డీ.ఎల్. పోటీచేస్తారని మీడియాకు వెల్లడించి ఆ పార్టీలో కొత్త సంప్రదాయానికి తెర తీసారు. చిన్నపాటి కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అధిష్టానం అనుమతి లేకుండా స్వతంత్రించి నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ పార్టీలో, ఒక శాసన సభ్యుడు- ఏకంగా పార్లమెంటుకు పార్టీ తరపున పలానా వ్యక్తి పోటీ చేస్తారని ప్రకటించడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి వింతగానే అనిపించింది. నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. అయితే దేని కోసం ఇంత మార్పు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద పార్టీ, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో వున్న జాతీయ పార్టీ - ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇన్ని మల్లగుల్లాలు పడుతుండడం చూసేవారికి ఆ పార్టీ నిజంగానే బలంగా వుందా లేదా అంతగా బలహీన పడిందా అని అనిపించడంలో వింతేమీ లేదు.
అభ్యర్ధి నిర్ణయ ప్రక్రియలో ఇన్నిన్ని కప్పదాట్లకు అవకాశం ఇవ్వకుండా, ముందుగానే రవీంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించి, ప్రకటించి వుంటే పార్టీ ఇంత అపప్రధ మూటకట్టుకునేది కాదు. ఎందుకంటే, కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో పలుకుబడి కలిగిన నాయకుడాయన. పైపెచ్చు వై.ఎస్.ఆర్.నే నేరుగా రాజకీయంగా ఎదుర్కున్న వ్యక్తి. జగన్ రెడ్డి పై ఆయన విజయావకాశాలు యెలా వుంటాయన్నది ప్రశ్న కాదు. యే ఎన్నికల్లో అయినా గెలుపోటములు అభ్యర్ధుల చేతుల్లో వుండవు. కాకపోతే, జగన్ రెడ్డి పై పోటీ చేసే అభ్యర్ధిని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కిందుమీదవుతోందన్న మీమాంసకు తావు లేకుండా పోయేది. కానీ, అలా చేయకుండా, అభ్యర్ధి నిర్ణయంలో తాత్సారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరంలో కొంత ముందస్తు ఓటమిని అంగీకరిస్తున్న భావాన్ని కలిగించింది. మనసులో మాట దాచుకోకుండా వ్యక్తం చేసే మంత్రి బొచ్చ సత్యనారాయణ ఇదే విషయాన్ని మరోరకంగా వెల్లడించారు కూడా. దీనికి తోడు ఈ ఉప ఎన్నికలు రిఫరెండం కావంటూ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన ప్రకటన.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో విచిత్రమయిన అంశం ఈ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్ధులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఢిల్లీ చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేయాలి. అధిష్టానం వద్ద పట్టుందని భ్రమ కల్పిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఎందరెందరో తాబేదార్లను మెప్పించాలి. ఇంతా చేసినా టికెట్ రావాలని లేదు. ఒకవేళ టికెట్ వచ్చినా బీ ఫారం చేటికి చేతికి ఇస్తారని  ఆశ  లేదు. అధవా బీ ఫారం ఇచ్చినా నామినేషన్ వేసేంతవరకు అధిష్టానం మనసు మార్చుకోదన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఎవరినడిగినా ఈ విషయాలు చెబుతారు. అలాటిది, ఈ సారి అనేకమంది కాంగ్రెస్ నాయకులు, ‘అధిష్టానం ఆదేశిస్తే జగన్ పై పోటీ చేస్తామ’ని బహిరంగ ప్రకటనలు చేశారు. అధినాయకత్వం ఆదేశించాలే కాని ఔదలదాల్చని వారెవరుంటారు? మరెందుకిలా బీరాలు పోయినట్టు? దీనికి ఒక కాంగ్రెస్ నాయకుడే ప్రైవేటు సంభాషణలో సమాధానం చెప్పాడు. అధిష్టానం ఆదేశించడం అంటే – ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ స్వీకరించాలి. యావత్తు భారాన్ని పార్టీయే మోయాలి. మొత్తం పార్టీ శ్రేణుల్నీ సమన్వయం చేసి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పనిచేసేట్టు చూడాలి. తీరా ఫలితంలో ఏవన్నా తేడాపాడాలు వస్తే, ఆ అభ్యర్ధుల రాజకీయ భవిష్యత్తును మరో రకంగా కాపాడాలి. అధిష్టానం ఆదేశించడం అంటే ‘కంప్లీట్ ప్యాకేజ్’ అన్నమాట. కాకపొతే, కాస్త అటూ ఇటూగా అన్ని ప్రధాన పార్టీల్లో ఈ ప్యాకేజి ఏదో ఒక రూపంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమలవుతోందట. (11-04-2011)



8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఎవరీ అన్నా హజారే? - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?' - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?'
'ఓ మాజీ సైనికుడు. 1965 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.'
'ఎవరితడు? ఏమిటి ఈయన ప్రత్యేకత? యిరవై నాలుగ్గంటలు దేశవ్యాప్తంగా మీడియా లో వార్తలన్నీ ఈయన గురించే. మహారాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లాలో రాలెగావ్ అనే ఆదర్స ఆదర్శగ్రామ సృష్టికర్త అయిన అన్నా హజారే గురించే. ఏమిటి అన్నా హజారే విశిష్టత? ఏమిటి ఈ గ్రామం గొప్పదనం?'
'స్వయం పోషకంగా, ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని హంగులు దీనికి ఏర్పరిచారు. ఈ గ్రామానికి అవసరమయిన విద్యుచ్చక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తి, గాలిమరలు, బయో ఫ్యూయల్ ఇందుకోసం వాడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం వరకు పేదరికం తాండవించిన గ్రామం అంటే ఈనాడు నమ్మడం కష్టం. ఎందుకంటె ఇప్పుడా గ్రామం మొత్తం దేశంలోనే అత్యంత సంపన్నగ్రామాల్లో ఒకటిగా తయారయింది కాబట్టి. దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్ణయించడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రభుత్వాల మీదా, ప్రభుత్వ పధకాల మీదా ఆధారపడకుండా అన్ని వసతులు గ్రామ ప్రజలే సొంతంగా ఏర్పాటుచేసుకున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినని రీతిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అన్నింటికీ మించి ఆ గ్రామ ప్రజల నడుమ వెల్లివిరిసే సామరస్యాన్ని మరెక్కడా చూడలేము.
ఇన్ని మంచి పనులు ప్రచారం జోలికి పోకుండా చేసిన మంచి వ్యక్తి కాబట్టే భారత ప్రభుత్వం అన్నా హజారేను పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.'
'అది సరే! అన్నా హజారే పోరాటం అంటూ మీడియాలో వస్తోంది. దేనిమీద ఆయన పోరాటం. దేనికోసం ఆయన ఆరాటం?'
'ఆయన ఒక మంచి అంశం మీద పోరాటం ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించే ధ్యేయంతో చట్టానికి సవరణ చేయాలన్నది ఆయన డిమాండ్.'
'ఈ రోజుల్లో ఇలాటివి సాధ్యమయ్యే పనులేనా?'
'మామూలు మనుషులకు కష్టమే. కానీ అన్నా హజారే వంటి వ్యక్తులు అనుకుంటే సాధ్యం కానిది వుండదు.
'ఇందుకోసం అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కావాలంటున్నారు. మంత్రులతో సహా రాజకీయరంగంలోవున్న వాళ్ళు , ఐ ఏ ఎస్ ఐ పీఎస్ లతో సహా అధికార యంత్రాంగంలో పనిచేసే సిబ్బంది అందర్నీ – ఎవరికీ ఎలాటి మినహాయింపు లేకుండా ఈ బిల్లు పరిధిలోకి తీసుకు రావాలన్నది అన్నా హజారే కోరిక. ఈ బిల్లు ద్వారా ఏర్పడే వ్యవస్థ అత్యంత బలీయంగా వుండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు.
'లోక్ పాల్ బిల్లు అంత కొత్త విషయం ఏమీ కాదే. 1972 లోనే అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.'
'కానీ ఏమి లాభం! మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ఈ బిల్లు పట్ల శ్రద్ధ వుండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారెవ్వరికీ ఇలాటి చట్టాలు రుచించవు.
'అందుకే, మచ్చలేని ప్రజాసేవకుడయిన అన్నా హజారే ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగించడానికి నడుం బిగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించాలని అన్న హజారే కోరుతున్నారు. ఈ బిల్లు రూపకల్పన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన డిమాండ్. ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటె, ఇలాటి ముఖ్యమయిన బిల్లును తయారుచేసే బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వొదిలివేస్తే ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయం.
అన్నా హజారే కోరుకున్న విధంగా బిల్లు తయారయి చట్ట సభల ఆమోదం పొందితే, స్వయం ప్రతిపత్తి కలిగిన లోక్ పాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. భారత ఎన్నికల సంఘం మాదిరిగా ఈ లోక్ పాల్ వ్యవస్తకు కూడా సర్వాధికారాలు వుంటాయి. ప్రతి రాష్ట్రం లో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవస్తలు ఆవిర్భవిస్తాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ ఈ వ్యవస్థ విచారిస్తుంది. ఈ దర్యాప్తు ఏళ్ళూ పూళ్ళూ సాగకుండా ఒక్క ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి వుంటుంది. కేవలం రెండేళ్ళ లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాల్సి వుంటుంది. బోఫార్స్ కుంభకోణం విషయంలో, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ దర్యాప్తులు దాదాపు పాతికేళ్ళకు పైగా సాగాయి. చివరికి సాధించింది శూన్యం.
అవినీతి పై అన్న హజారే ప్రారంభించిన ఈ మహోద్యమంలో ఆయన ఒంటరి కాదు.
బాబా రాం దేవ్, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి కిరణ్ బేడీ, స్వామి అగ్ని వేష్, సమాచార హక్కు ఉద్యమకారుడు అరవింద్ కేజరీ వాల్, ఇంకా అనేకమంది అన్నా హజారేకు మద్దతుగా నిలిచారు. అలాగే, ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. అందరి బాగుకోసం అన్నా హజారే ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు, ఇంటింటికీ చేర్చడంలో ప్రతి ఒక్కరు తమకు చేతనయిన విధంగా తోడ్పాటు అందించాలని కోరడానికే ఈ వివరాలు. అవినీతిపై అన్నా హజారే మొదలు పెట్టిన ఈ ఉద్యమ స్పూర్తిని నేల నాలుగు చెరగులకు చేర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.' (08-04-2011)

7, ఏప్రిల్ 2011, గురువారం

సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు


సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు



"స్వామి క్షేమం గురించి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామికి ఎలాటి ఆపదా రాదు. ఒకవేళ అలాటి ఆపదలు సంభవిస్తే స్వామే స్వయంగా వాటినుంచి చెక్కుచెదరకుండా బయటపడగలరు. అందుచేత ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. విచారించాల్సిన అవసరం లేదు. స్వామే అన్నీ సాధించుకుంటూ వస్తాడు. అన్నింటినీ నెగ్గుకుంటూ వస్తాడు. అయినప్పటికీ, పాంచభౌతికమయిన శరీరానికి కొన్ని అవస్తలు తప్పవు. ఆహారం,పరిసరాలు దేహంలో ఎన్నో మార్పులు తెస్తాయి.భౌతికమయిన దేహంలో ఎన్నో జరగవచ్చు. అయితే, ఇవన్నీ తాత్కాలికం. శాశ్వితం కాదు. అంచేత స్వామి మీరంతా ధైర్యంగా వుండాలని కోరుకుంటాడు.

"ఇంతకీ నా మెడిసిన్ ఏమిటి? భక్తులు నాకోసం మనస్పూర్తిగా చేసే ప్రార్ధనలే నా మెడిసిన్. నాకోసం, అది మద్రాస్ కావచ్చు, హైదరాబాదో, ముంబయ్యో, బెంగుళూరో ఏ నగరమయినా కావచ్చు – అక్కడి భక్తులందరూ నా కోసం ప్రార్ధనలు చేశారు. భజనలు చేశారు. నామస్మరణలు చేశారు. తపస్సులు చేశారు. యజ్ఞాలు చేశారు. వారు చేసిన ప్రార్ధనల ఫలితంగానే నేనీనాడు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నాను.

"ఈ శరీరం ఇలా బాధ పడాలని నేను కోరుకోలేదు. అలాగని ఇలా బాగుపడాలని కూడా అనుకోలేదు. మీరు మీ ప్రార్ధనల ద్వారా దీన్ని సాధించారు. ఇలా జరగాలని ఆశించిందీ మీరే. కోరుకున్నదీ మీరే. ఈ దేహం నాది కాదు. మీదే. దీన్ని  మీరే కాపాడుకోవాలి. అది మీ బాధ్యత.

"నేను దేహాన్ని కాదు. నేను దేహిని మాత్రమే. దేహం పాంచభౌతికం. దేహి నిరామయుడు.

"ఈ దేహాన్ని రక్షించడం కోసం డాక్టర్లు ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. వారు తమ విద్యుక్తధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు.  అయితే, నేను మాత్రం ఈ దేహాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించలేదు. దేహం పట్ల మమకారం పెంచుకోకూడదన్న మంచి భావనను నేను నిరూపించదలిచాను. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా నేను పదేపదే ఇదే చెబుతూ వస్తున్నాను. దేహం పట్ల అభిమానాన్ని తగ్గించుకోండి. క్రమంగా మీ దేహాభిమానాన్ని తగ్గించుకోండి. ఆత్మాభిమానాన్ని పెంచుకోండి. మీ దేహం మీది కాదు. ఆత్మకు మీరు ప్రతిరూపం. ఈ శరీరం పుడుతుంది. పెరుగుతుంది. ఏదో ఒకనాడు కాలగర్భం లో కలసిపోతుంది. బాధలు, క్లేశాలు అన్నీ దేహానికే. ఆత్మకు కాదు.

"నాకున్న దైవ శక్తిని  నా దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నడూ వాడుకోలేదు. అలా చేయాలనుకుంటే నాకు క్షణం పట్టదు. నా దైహిక బాధలను నేను లిప్త కాలంలో మాయం చేసుకోగలను. నన్ను నేను స్వస్తత పరచుకోవాలన్న స్వార్ధం నాకు లేదు. అలాటి స్వార్ధ భావన నాకు లేశమాత్రంగా కూడా లేదు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరు హాయిగా సంతోషంగా వుండాలి. ఇదొక్కటే నాకున్న స్వార్ధపూరితమయిన ఆశ. ఆలోచన.

"ఒక్కటి గుర్తుంచు కోండి. ఈ దేహం పాంచ భౌతికం. కాస్త అటూ ఇటూగా పంచ భూతాల్లో కలసిపోయేదే. కాని దేహంలో వున్న ఆత్మకు చావు పుటకలు లేవు. ఆత్మకు ఎలాటి భవబంధాలు వుండవు. నిజం చెప్పాలంటే, ఆత్మే పరమాత్మ."

(2003 సంవత్సరం జులై 13 వ తేదీన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయి బాబా చేసిన అనుగ్రహ భాషణం నుంచి ప్రొఫెసర్ జి.వెంకటరామన్ భద్రపరచిన కొన్ని భాగాలు, ఈ నాటి పరిస్తితులకు తగినట్టుగా వున్నాయన్న వుద్దేశ్యంతో బ్లాగులో పెట్టడం జరుగుతోంది. అప్పటికి స్వామి తన విరిగిన కాలుకు పెద్ద శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది. – భండారు శ్రీనివాసరావు)

3, ఏప్రిల్ 2011, ఆదివారం

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ మూడో తేదీ ఆదివారం ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

‘నేడే విడుదల, రేపే ఆఖరు, ఈరోజే చూడండి’ అన్న చందంగా సాగిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్టుగా జరక్కపోయినా అనుకున్న గడువులో మాత్రం ముగిశాయి. చివరొక్కరోజును మినహాయిస్తే , ముందుగా నిర్ణయించుకున్న కాల వ్యవధిలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగిన దాఖలా లేదు. సభాపర్వంలో వాయిదాలకే అధిక సమయం చెల్లిపోయింది.

‘ఐస్ హావిట్ ఐస్ హావిట్ ది మోషన్ ఈజ్ మూవ్డ్ అండ్ ది బిల్ ఈజ్ పాస్డ్’ (Ayes have it. Ayes have it. The motion is moved and the bill is passed) అని స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటుండగానే పరీక్షిత్తు యజ్ఞగుండం దగ్గర నిలబడి ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అంటే తక్షణం వచ్చి వాలిన తక్షకుడి మాదిరిగా, సమావేశాల్లో చర్చించి ఆమోదించాల్సిన బిల్లులన్నీ ఒకదానివెంట మరొకటి సభ ఆమోదం పొందడం క్షణాల్లో జరిగిపోయింది.(Ayes అంటే - ప్రాచీన ఆంగ్ల భాషలో అనుకూలంగా వోటు చేయడానికి అంగీకరించడం – Nyes have it అంటే వ్యతిరేకించడం అని ఇంగ్లీష్ నిఘంటువు చెబుతోంది-రచయిత)

ఏప్రిల్ ఒకటో తేదీన మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ చెల్లింపులకు ఎలాటి అవరోధం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లుతో సహా అన్ని బిల్లులను – ఎలాటి చర్చా లేకుండానే తూనా బొడ్డు తంతుగా నిమిషాలమీద సభ ఆమోదించడాన్ని ఆఖరు రోజున యావదాంధ్ర ప్రజలు టీవీల్లో చూశారు. పనిలో పనిగా శాసనసభ్యుల జీత భత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెంచే బిల్లును కూడా సభలోని అన్ని పక్షాలు యధాశక్తి సహకరించి వొడ్డున పడేశాయి. దీనివల్ల అన్నీ కలిపి నెలకు అక్షరాలా 95 వేల రూపాయలు గౌరవ శాసన సభ్యులకు ముడతాయి. ఇంత మాత్రం నెలవారీ జీతాలు పొందేవారు ప్రతిజిల్లాలో హీనపక్షం అయిదారుగురు అధికారులు వున్నప్పుడు, వారి మీద పెత్తనం చేసే తమకు ఆమాత్రం వేతనం లేకపోతే ఏం గౌరవం అనుకున్నారేమో – ఈ ఒక్క విషయంలో మాత్రం పార్టీలకతీతంగా అంతా చేతులు కలిపి ‘మమ అనిపించారు. ఆ చేత్తోనే, మాజీ శాసన సభ్యుల పింఛను గరిష్ట మొత్తాన్ని నెలకు 25 వేలకు పెంచారు. సీపీయం మాత్రం ఈ పెంపుదలను వ్యతిరేకించింది. చర్చ జరగకుండానే ఈ బిల్లు సభ ఆమోదం పొందిన కారణంగా ఆ పార్టీ నిరసన ప్రకటనకే పరిమితమయింది. శాసన సభ కార్యాలయం విడుదలచేసిన వివరాలప్రకారం సభ మొత్తం 29 రోజులు జరిగింది. 15 బిల్లులు ప్రవేశపెట్టగా అందులో 10 బిల్లులు ఆమోదం పొందాయి. అన్ని రోజులు కలిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది 2 గంటల 58 నిమిషాలయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 3 గంటల 53 నిమిషాల సమయం తీసుకున్నారు. వాళ్ల మాదిరిగానే రెండు గంటలకు పైగా సమయం వాడుకున్న ఘనత మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కు దక్కుతుంది. టీ.ఆర్.ఎస్. సభ్యుడు రాజేందర్, ఒకప్పటి ప్రజారాజ్యం నేత చిరంజీవి - అసలు నోరువిప్పని సభ్యుల జాబితాలో వుండడం విశేషం. అత్యధిక సభా సమయాన్ని ఉపయోగించుకున్న వారిలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ వున్నారు. ఆయన మొత్తం 3 గంటల 27 నిమిషాలు సభలో ప్రసంగించి రెండో స్తానం సంపాదించారు. లెక్కకు 29 రోజులు సభ నడిచినా అందులో వాయిదాలు పడ్డ సమయమే ఎక్కువ. ఇన్ని రోజుల వ్యవధిలో సభ సజావుగా నడిచింది 52 గంటల 30 నిమిషాలే. కాంగ్రెస్ ఇంచుమించు 23 గంటలు, తెలుగుదేశం దాదాపు 14 గంటలు తీసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే సభ రోజుకు సరాసరి గంట కంటే తక్కువ కాలం నడిచినట్టు లెక్క. బహుశా సభా సమయం ఎంత వృధా అయినా, చివరిలో ఎలాగో అలాగా గిలెటిన్ అస్త్రం ప్రయోగించి పని పూర్తి చేయొచ్చునన్న ‘ఎరుక’ కలిగిన వారు కాబట్టే చట్టసభలోని సభ్యులందరూ చట్టరీత్యా పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను మాత్రం ఎట్టకేలకు తు చ తప్పకుండా పూర్తిచేశారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో సంప్రదాయాలకు నీళ్ళు వొదిలిన సందర్భాలు అనేకం. ఉభయ సభల సంయుక్త సమావేశం ఆరంభంలోనే గవర్నర్ కుర్చీ లాగివేయడం, సభ ఆవరణలోనే ఒక సభ్యుడిపై చేయి చేసుకోవడం, బడ్జెట్ సమావేశాలు పూర్తికావడానికి ఒక్క రోజు ముందు సాక్షాత్తు ఒక మంత్ర్రే ప్రతిపక్ష సభ్యులపై సభలోనే భౌతిక దాడికి దిగడం, అసలు శాసనసభకు పోటీగా కొందరు సభ్యులు కలసి వేరేచోట మాక్ అసెంబ్లీ నిర్వహించడం, మరికొందరు సభ్యులు ఏకంగా అనేక రోజులపాటు సభనే బహిష్కరించడం - ఒకటా రెండా ‘ఏమి చెప్పుదు సంజయా!’ అన్నట్టు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సంఘటనల మయంగా ముగిసిపోయాయి.

సమావేశాల మధ్యలో వచ్చిన విధాన మండలి ఎన్నికలు వివిధ రాజకీయపార్తీలలోని అవకాశవాదాన్ని ఎత్తిచూపాయి. సిద్ధాంతాలకు తిలోదకాలు వొదిలి అన్ని పార్టీలవాళ్ళు క్రాస్ వోటింగులో తమ ప్రతిభను, సొంత లాభాలపట్ల తమ నిబద్ధతను నిరూపించుకున్నారు.

సాధారణ రాజకీయాలకు విభిన్నమయిన, మరో విచిత్రమయిన పరిస్తితి ఈ సమావేశాల కాలంలో ప్రస్పుటమయింది. పదవిని వొదులుకోవడానికి మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వొప్పుకోడన్నది సామాన్య జనంలో వున్న అభిప్రాయం. దీనికి భిన్నంగా ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణాకు మద్దతుగా పదవికి రాజీనామా చేసారు. క్రాస్ వోటింగ్ ఉదంతానికి సంబంధించి నైతిక బాధ్యతగా ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యులు రాజీనామా చేసారు. అలాగే, టీడీపీ సభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి - తెలంగాణా పట్ల పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ నుంచి తప్పుకుని టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకున్నారు. ఈయనగారి రాజీనామా లేఖ డిప్యూటీ స్పీకర్ దగ్గర పెండింగ్ లో వుండిపోయింది. దాన్ని ఆమోదించాలంటూ ఆయన ఏకంగా నిరసన దీక్షకు దిగాల్సివచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా ముఖ్యమంత్రి దగ్గరా, ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ  అధినేత దగ్గరా ‘నిద్ర’ చేస్తున్నాయి. రాజీనామా చేసిన మంత్రి తన విధులకు హాజరు కానంటూ మొండికేయడంతో – సమావేశాల సమయంలో ఆయన తరపున సమాధానాలు చెప్పే బాధ్యతను మరో మంత్రికి వొప్పగించాల్సిన విచిత్రమయిన పరిస్తితి. మరోవైపు జగన్ వర్గం సభ్యులు రాజీనామా చేయకుండానే నిండు సభలో పార్టీని ధిక్కరించినా ఏమీ చేయలేని బలహీనత.
సమావేశాల చివరిరోజున సభ్యులు, వివిధ పక్షాల నేతలు అతి ముఖ్యమయిన ఒక అంశంపై జరిగిన సుదీర్ఘమయిన చర్చపట్ల కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టే కనిపించింది. పారిశ్రామిక ప్రగతి పేరుతొ, ఉపాధి అవకాశాలను పెంచే నెపంతో విచ్చలవిడిగా ప్రభుత్వాలు జరిపిన భూ పందేరాలపై సాగిన ఈ చర్చలో పాల్గొన్నవారందరూ సంయమనంతో చేసిన ప్రసంగాలు, సవివరంగా చేసిన సూచనలు వింటున్న వారికి సభపై గౌరవం కొంత పెరిగింది. కడప ఉపఎన్నికలు గడప ముందుకు వచ్చిన నేపధ్యంలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారన్న విషయం పక్కనబెడితే, సభాసంఘం వల్ల ఇష్టారాజ్యంగా జరిపే భూముల పంపిణీల జోరు ఒకమేరకయినా కట్టడి అయ్యే అవకాశం వుంటుంది. రాజకీయంగా కొందరికి ఇబ్బందికరం అయినప్పటికీ, దీని ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించడం ఈ సమావేశాల కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఇంతమాత్రందానికి, శాసన సభ సమావేశాల పేరుతొ ఇంత హడావుడి అవసరమా అన్న సామాన్యుడి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేవారులేరు. (02-04-2011)



1, ఏప్రిల్ 2011, శుక్రవారం

తొమ్మిది నమ్మలేని నిజాలు

తొమ్మిది నమ్మలేని నిజాలు




1) ఆస్ట్రేలియాలో తొంభయ్ శాతం మంది ప్రజలు పాలు తాగరు.

2) పాములు రాత్రి వేళల్లో కూడా అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న జంతువుల్నిసయితం చూడగలవు.

3) సూర్యుడు మండే గోళం . అయినా మనిషి దాన్ని తాకవచ్చు. అదెలా సాధ్యం అంటే వొంటి నిండా పాదరసం పూసుకున్నప్పుడు.

4) ఒక విచిత్రమయిన విషయం ఏమిటంటే గ్రీన్ ల్యాండ్ అనే దేశంలో ఇంతవరకూ కవల పిల్లలు జన్మించలేదు.

5) సమస్త జీవరాశిలో ఒక్క జీబ్రాకు మాత్రమే లివర్ లేదు.

6) ఆరో వాస్తవం ఏమిటంటే పైన పెర్కొన్నదేదీ నిజం కాదు.

7) ఇవన్నీ ఒక్క క్షణం పాటయినా నమ్మినందుకు ధన్యవాదాలు.

8) ఎనిమిదోది మాత్రం నిజంగా నిజం. ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ. ఆల్ ఫూల్స్ డే.

9) ఫూల్ అనేవాడు ఏ రోజయినా ఫూలే.