18, జూన్ 2010, శుక్రవారం

సుందరం మనమందరం – భండారు శ్రీనివాసరావు

సుందరం మనమందరం   భండారు శ్రీనివాసరావు
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా -నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళు ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమె తమ ప్రతిభతో పై మెట్టు ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా  మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు  మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం  నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా 
వారు నాతొ ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.



ఈరోజుజూన్ 17 వ తేదీన హైదరాబాద్ ఎర్రగడ్డ హిందూ స్మశాన వాటికలో ఎక్స్ ప్రెస్  సుందరం అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు పూర్వపు మిత్రులందరూ కలిసారు. వారిలో చాలా మంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కొద్దిమంది ఇంకా వృత్తిలో కొనసాగుతున్నారు. మా మధ్య తిరిగిన సుందరాన్ని (సుందరం గారు అని మన్నింపుగా పేర్కొనకపోవడంపై ఎవరికయినా బాధ కలిగితే క్షంతవ్యుడిని ) విగత జీవుడిగా చితిపై చూస్తున్నప్పుడు మా అందరి మనస్సులు వికలమయ్యాయి. జర్నలిజంలో ఎంతో వున్నత స్తానానికి ఎదిగినా కూడా నాతో ఆయన ప్రవర్తన మునుపటిమాదిరిగానే వుండేది. ఎనభయ్యవ దశకానికి ముందు నేను రేడియోలోనూ, ఆయన ఆంద్ర పత్రికలోను పనిచేస్తూ వుండేవాళ్ళం.  శ్రీయుతులు జి కృష్ణ, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, పేట్రియాట్ ప్రభాకరరావు, క్రానికల్ సింహం,ఎక్స్ ప్రెస్ మురళీధర్, శ్రీకాంత్ విట్టల్, ప్రభ సలంద్ర (చావు గీతం), యుఎన్ఐ పార్థసారథి, పీటీఐ జమాల్ వంటి కీర్తిశేషులయిన వుద్దండులతో కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు  సమాచార భారతి ఆదిరాజు వెంకటేశ్వర రావు, యుఎన్ఐ డి సీతారాం, ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్ర జ్యోతి వెంకట రావు, ఇన్నయ్య , హిందూ కేశవరావు, నగేష్, ఆంద్రప్రభ పొత్తూరి వెంకటేశ్వరరావు, జ్యోతి రామచంద్రమూర్తి, క్రానికల్ రబీంద్రనాధ్, పీ ఏ రామారావు, ,విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ప్రజాశక్తి వినయకుమార్, ఈనాడు శేఖర్, పాశం యాదగిరి, శ్రీధర్, కే వేణుగోపాల్, ఎన్ఐఎస్ కొండా లక్ష్మారెడ్డి,  ఒకరా ఇద్దరా జర్నలిజం లో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం  గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు వుండేవి.మాలో చాలామందిమి, సంపాదకులను మినహాయిస్తే,   దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్ లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. సుందరం గారు కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారిగిర్నార్ స్కూటర్ ను మన రాష్ట్రంలో తొలిసారి ప్రవేసపెట్టినప్పుడు, మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కానీ, కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సివచ్చేది. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
అంత్యక్రియలు పూర్తయిన తరవాత సుందరం గారి పిల్లల్ని కలుసుకుని పరిచయం చేసుకున్నాను. వారి తండ్రి గారితో నా సాన్నిహిత్యం గురించి చెప్పాలనిపించినా అంత చనువు లేక మానుకున్నాను. జర్నలిస్టుల జీవితాలు ఇంతే. వారికి సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, సుందరం గారు చనిపోయిన విషయం వెంటనే తెలిసికూడా ఆయన ఇంటికి వెళ్ళ లేకపోవడానికి ఇదే కారణం. ఆ ఇంట్లో ఆయన తప్ప నాకెవరు తెలవదు.ఒకవేళ వెళ్ళివున్నా,నేను తెలిసిన ఆ ఒక్కరికి నేను వచ్చిన విషయం తెలియదు. ఇది మరో  విషాదం. (17-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                 

1 కామెంట్‌:

cbrao చెప్పారు...

"ఆ ఇంట్లో సుందరం తప్ప నాకెవరు తెలవదు.ఒకవేళ వెళ్ళివున్నా,నేను తెలిసిన ఆ ‘ఒక్కరికి’ నేను వచ్చిన విషయం తెలియదు. ఇది మరో విషాదం. "
-అవును, విగత జీవులైన మిత్రుల సజీవ బంధులను పలకరించాలంటే నాకూ ఇదే సమస్య. గతించిన వారి శ్రీమతి నన్నెరగని సందర్భంలో వారిని ఎలా పలుకరించాలి, ఓదార్చాలి అనేది ఒక విలక్షణ విషయం. ఆత్మీయ మిత్రులైన దండమూడి మహీధర్, సంజీవ దేవ్, చలసాని ప్రసాద రావు గారలు గతించిన సందర్భంలో నాకు కలిగిన అనుభూతి విచిత్రమనిపించవచ్చు. వారు నన్ను మోసం చేసి దూరంగా, తిరిగి రాని లోకాలకు వెళ్లారన్న భావన లో ఉండేవాడిని చాలా రోజులు. సంజీవదేవ్ పేరిట వారి జ్ఞాపకార్ధం ఒక వెబ్ సైట్ నిర్మించాను, స్నేహితుల సహకారంతో. చలసాని ప్రసాదరావు గురించి ఒక వెబ్సైట్ నిర్మించాలన్న ప్రతిపాదనకు వారి కుటుంబ సభ్యుల మద్ధతు లేదు. మహీధర్ గారి పేరిట ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తామన్నాము కాని కుటుంబ సభ్యుల సహకారం లేక విరమించుకోవల్సి వచ్చింది. ఇది మరో విషాదం.