9, జనవరి 2010, శనివారం

మీడియాపై నీలినీడలు - భండారు శ్రీనివాసరావు

మీడియాపై నీలినీడలు - భండారు శ్రీనివాసరావు




రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వచ్చిన ప్రైయివేటు టీవీ ఛానళ్ళు గత కొంత కాలంగా ఈ అంశంపై చర్చోపచర్చలు కొనసాగి స్తూ వస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు ఒక అడుగు ముందుకు వేసి - 'అవును' అయితే ఇది నొక్కండి, 'కాదు' అయితే అది నొక్కండని ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణకే పూనుకున్నాయి. ఆ విషయం పూర్తిగా తెలుసుకోగాలిగాయో లేదో తెలియదు కానీ, స్వేచ్చకు కూడా పరిమితులుంటాయని వాటికి తెలిసివచ్చింది. పొద్దున్న లేచింది లగాయతు, టీవీ చర్చల్లో మేధావి వర్గం ప్రభుత్వ అస్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దశలో - రోశయ్య గారి ప్రభుత్వం- 'ఇద్దరు మీడియా జర్నలిష్టులను' అదుపు పేరిట అరెస్ట్ చేయడంతో అంతా యిప్పుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. 'అతి దారుణమయిన, హేయమయిన నీతి బాహ్య చర్య' అని జర్నలిస్టు సంఘాలు ఖండించడంపై ప్రజాస్పందన కొరవడడానికి కారణం అంతకు ముందు రాష్ట్రంలో జరిగిన విధ్వంస కాండకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని చానళ్ళ ప్రమేయం ఉండడమే. మీడియా స్వేచ్చపై ఒక పక్క బుల్లి తెరలపై చర్చలు సాగుతుండగానే, ఈ అరెస్టులు జరిగిపోయాయి.మరి కొన్ని చానళ్ళవారిపై పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. విధ్వంస ఘటనలకు సంబంధించి కూడా వందకుపైగా కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గగ్గోలు పెడుతున్న వాళ్లకు ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీనికి తోడు తెలుగు చానళ్ళ మధ్య- ఆ మాటకు వస్తే - వాటి యాజమాన్యాల నడుమ కొంత కాలంగా పరోక్షంగా సాగుతున్న 'యుద్దాలు' యిప్పుడు 'టెలివిజన్ తెరలపైకెక్కి' నేరుగా డ్రాయింగ్ రూముల్లోకి చేరాయి. జర్నలిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయి ప్రకటనలు గుప్పిస్తుండడంతో- అసలు విషయం నీరుకారిపోయే అవకాశం ఏర్పడింది.ఇన్నాళ్ళూ నివురుగ ప్పిననిప్పులా ఉండిపోయిన జర్నలిష్టుల 'అనైక్యత' ఇప్పుడు బజారున పడింది. స్వేచ్చ గురించి బలంగా గొంతు విప్పగల శక్తి బలహీనపడింది. ఈ పరిణామాలు ఏమాత్రం అభిలషనీయం కావని చెప్పడానికి సంకోచించనక్కరలేదు కానీ భవిష్యత్తు గురించే బాధ్యతకలిగిన జర్నలిస్టులు అలోచించాల్సిన తరుణం ఆసన్నమయింది.

పోతే, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పత్రికా(మీడియా) స్వేచ్చకు విఘాతం కలిగించేదిగా ఉందా అనే విషయాన్ని చర్చించే ముందు కొన్ని పూర్వాపరాలను పరిశీలించాల్సి వుంటుంది.

నాకు గుర్తున్న గతంలోకి వెడితే -

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యెక అభిమానం ప్రదర్శించేవారనేది బహిరంగ సత్యం. పత్రికల యజమానులే కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన హాస్యంతో అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు- విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని అమాయకంగా మురిసిపోయేవారు. ఒక దినపత్రిక మాత్రం - కొత్త బాణీ కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ , ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం. వున్నది వున్నట్టు రాయడంతో పాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది.



తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో - అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.

ఏరోజుకారోజు పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, రెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి యేవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా,తాము బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది.ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి అదే వార్తను తామే మర్నాడు ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి - తమ రాజకీయ ప్రత్యర్ధుల పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి మార్గం వేసింది.



నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.పత్రికల ముద్ర

ణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీ వీ చానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధ శక్తులు చొరబడడానికి కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగే, రాజకీయ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి.

మీడియా విశ్వసనీయతపై ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు తాజా ఘటనలతో కారు మబ్బులుగా మారి మసకబారి పెద్ద ప్రశ్నను మీడియా ముందుకు తెచ్చాయి.



ఫలితంగా, మంచికో చెడుకో మీడియాపై ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితులగురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ చానళ్ళను మూసివేయాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం చేయాల్సిన మీడియా ఈనాడు ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.



అందుకే, ఈ అవకాశాన్ని మీడియా ఉపయోగించుకోవాలి. ఆత్మ శోధన చేసుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై , వార్తాకధనాలపై చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వం తో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. పరస్పర విమర్శలు కట్టిపెట్టి, కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు శిధిలమయినప్పుడు సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీ, వెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి.

కానీ, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?

(09-01-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు: